నిర్మలంగా విశాల ఆకాశం. మిరుమిట్లు గొలుపుతూ తారకలు. వాటి మధ్య నిండుగా మెరిసిపోతూ తారాధిపతి చంద్రుడు. శరత్కాల మహిమ. ఏ పౌర్ణమి నాడూ కనిపించనంత మనోహరంగా నేడు చంద్రుడు ఉంటాడు. పదహారు కళలతో ప్రకాశిస్తూ దర్శనమిస్తాడు. అందుకే, శరత్ పౌర్ణమికి ఎనలేని ప్రాధాన్యం వచ్చింది. సాధారణంగా ఏడాదికి పన్నెండు పౌర్ణములు వస్తాయి. దేనికదే ప్రత్యేకం. అయితే, ఆశ్వయుజ పౌర్ణమికి కాస్త ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందంటారు. శరత్కాలంలో ఆకాశం నిర్మలంగా ఉండటం వల్ల చంద్రుడు మరింత తేజోవంతంగా ప్రకాశిస్తూ ఉండటం మనం గమనించవచ్చు. మన మనస్సు కూడా శుద్ధంగా, స్పష్టంగా ఉంటే జ్ఞానం ప్రకాశిస్తుంది.
శరత్ పౌర్ణమికి మరో ప్రాముఖ్యం కూడా ఉంది. క్షీరసాగర మథనంలో చంద్రుడు ఇదేరోజు ఉద్భవించాడని పురాణ కథనం. చంద్రుడి తర్వాత లక్ష్మీదేవి ఆవిర్భవించిందని అంటారు. అందుకే చంద్రుడిని లక్ష్మీదేవి సహోదరుడని చెబు తారు. పౌర్ణమినాడు చంద్రుడు సంచరించే నక్షత్రం ఆధారంగానే నెలలకు పేర్లు వచ్చాయి. చంద్ర గమనానికి అంత ప్రాధాన్యం ఇచ్చారు మన పూర్వికులు. ఆశ్వయుజ పౌర్ణమి నాడు చంద్రుడు అశ్వని నక్షత్రంపై ఉంటాడు. అందుకే ఈ నెలకు ‘ఆశ్వయుజం’ అన్న పేరు వచ్చింది. అశ్వని వైద్య కారకత్వం ఉన్న నక్షత్రం. చంద్రున్ని ఔషధాలకు అధిపతిగా భావిస్తారు. ఈ రెండిటి మేలు కల యికగా వచ్చే ఆశ్వయుజ పౌర్ణమి ఔషధ సేవకు, మానసిక పరివర్తనకు మహో న్నతమైనదిగా పేర్కొంటారు. అందుకే, ఈ రోజు చంద్రకాంతిలో కొంత సమ యమైనా గడపాలని పెద్దలు సూచించారు. రాత్రివేళ ఆరుబయట ఒక పాత్రలో పాలను ఉంచి.. వాటిని ఔషధంగా స్వీకరించే సంప్రదాయం ఉన్నది. వెడల్పాటి మూతి ఉన్న బిందెలో గానీ, స్తాంబాళంలో గానీ పాలు పోసి, ఆలయ ప్రాంగ ణంలో చంద్ర కిరణాలు ఆ పాత్రపై ప్రసరించేలా ఉంచుతారు. తర్వాత ఆ పాత్రకు వేదోపచార పూజలు నిర్వహించి, పాలలో చంద్ర బింబాన్ని దర్శించు కుంటారు. తర్వాత ఆ పాలను ప్రసాదంగా అందరికీ పంచుతారు.
ఆధ్యాత్మికంగానూ ఈ పౌర్ణమికి విశిష్ట ప్రాధాన్యం ఉంది. ఆశ్వయుజ పౌర్ణమిని పురస్కరించుకొని కౌముద్యుత్సవం, కోజాగరీ వ్రతాలు చేస్తారు. దీనినే ‘కుమార పౌర్ణమి’ అని కూడా పిలుస్తారు ‘గొంతెమ్మ పండుగ’ పేరుతో పార్వతీదేవిని పూజిస్తారు. ఆరుబయట వెన్నెల్లో పరమాన్నం వండి ఆ ప్రసాదం అందరూ స్వీకరిస్తారు. కోజాగరీ వ్రతంలో భాగంగా ఉదయం ఉపవాసం ఉంటారు. చంద్రోదయం అయిన తర్వాత, లక్ష్మీదేవిని షోడశోపచారాలతో పూజించి, పాయసాన్నం నివేదిస్తారు. ‘కోజాగరీ వ్రతకథ’ను చదువుకుంటారు. ఈ రోజు రాత్రి జాగరణ చేసే సంప్రదాయాన్ని కొందరు పాటిస్తారు.
‘చంద్రమా మనసో జాతః’ అంటుంది వేదం. అంటే విరాట్ పురుషుని మనోఫలకం నుంచి చంద్రుడు ఆవిర్భవించాడని అర్థం. అందుకు తగ్గట్టే, మనసుపై రేరాజు ప్రభావం చూపుతాడని అంటారు. జ్యోతిష శాస్త్రంలోనూ చంద్రుడిని మనఃకారకుడిగా సూచిస్తారు. జన్మ కుండలిలో చంద్రుడు ఉండే స్థానం ఆధారంగా జాతకుడి మనో ప్రవృత్తిని అంచనా వేస్తారు. అంతేకాదు చంద్రుడిని మాతృకారకుడిగానూ చెబుతారు. చంద్రుడి అనుగ్రహం కోసం జపం, అభిషేకం చేసుకోవాలని పెద్దలు సూచించారు.
శరత్ అంటే జ్ఞానం అనే అర్థం ఉన్నది. జ్ఞానం పరిపూర్ణ వికాసం పొందడానికి ఉపాసనా బలం తోడుండాలి. ఆ శక్తినిచ్చే పౌర్ణమి ఇది. సాధకులు దీనిని విశిష్టమైన రోజుగా భావిస్తారు. శక్తిమాసంగా భావించే ఆశ్వయుజంలో శరన్నవరాత్రులు ముగిసిన తర్వాత వచ్చే పౌర్ణమి కావడంతో.. శక్తి ఉపాసకులు ఈ రోజు విశేష ఆరాధనలు నిర్వహిస్తారు. చంద్రోదయం తర్వాత ఉపదేశ మంత్రాన్ని యథాశక్తి జపం చేసి ఆధ్యాత్మిక శక్తిని సంతరించుకుంటారు.
–కణ్వస
నేడు శరత్ పౌర్ణమి