జ్ఞానం ప్రపంచాన్ని వీలైనంత సమగ్రంగా, సత్యగతంగా అర్థం చేసుకోవడానికి ఒక దృష్టి కేంద్రాన్ని (View Point) ఇస్తుంది. ఆ దృష్టి కేంద్రం ఎంత ఉన్నతమైనదీ, పరివ్యాప్త దృశ్యాన్ని ఇచ్చేదీ అయితే అంతగా మన అవగాహన పెంపొందుతుంది. సమగ్రంగా, స్పష్టంగా, సత్యంగా ఉంటుంది. తద్వారా మన విలువల వ్యవస్థ, జీవనశైలి అంత ఆరోగ్యవంతమైనవిగా, హిత ఫలవంతమైనవిగా రూపొందుతాయి.‘బ్రహ్మ సత్యం జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ నాపరః’ అన్నది అద్వైత దర్శనం సారం. అంటే బ్రహ్మమే సత్యం; అందుకు భిన్నంగా స్వతంత్రత లేనిది జగత్తు కాబట్టి అది మిథ్య. అలాగే జీవుడు అంటే జీవ (మానవ) చైతన్యం బ్రహ్మ చైతన్యానికి భిన్నమైనది కాదు. మూల చైతన్యపరంగా మనిషి పరబ్రహ్మాత్మకుడే అని దాని సారాంశం. అయితే, సత్యం విషయంలో దార్శనికంగా తగినంత స్పష్టత ఉన్నా, మిథ్య విషయంలో మాత్రం లోకంలో చాలా తప్పుడు అవగాహన ఏర్పడింది. సత్యమనేది భౌతిక విషయం కాదు. తాత్విక విషయం. తానుగా కనబడదు. తన ప్రకటనగా ప్రపంచంపై కనబడుతుంది. సత్యం ప్రధానంగా కార్యకారణ సంబంధాలకు చెందిన విషయం. లౌకికంగా మనకు అసంఖ్యాకమైన కార్యాలు, వాటినంటి ఉండే అసంఖ్యాకమైన కారణాలు కనబడతాయి. జడ ప్రపంచానికి సంబంధించి విజ్ఞానశాస్త్రం ఆ కారణాలనే సూత్రాల రూపంలో ఆవిష్కరిస్తుంది.
భారతీయ తత్వశాస్త్రంలో… ప్రత్యేకించి అద్వైత దర్శనంలో, ఏది దేశకాల వస్తువులచే అబాధితంగా ఉంటుందో, అంటే మార్పుచెందక నిలుస్తుందో అది మాత్రమే పరమ సత్యం. అదే పారమార్థిక సత్యం. మరోరకంగా చెప్పాలంటే ఏది అన్ని కారణాలకు కారణమో, ఏది మరొక కారణానికి కార్యం కాదో అదే పారమార్థిక సత్యం. అదే అసలు దైవం. దానినే మన రుషులు అనంతమైన పరబ్రహ్మంగా దర్శించి, అవగాహనకు ప్రత్యక్షపరిచారు. దాన్ని‘సచ్చిదానందం’గా ఆవిష్కరించారు. సత్ అంటే ఉన్నది, చిత్ అంటే చైతన్యం, దాని శక్తి వ్యక్తీకరణ సూత్రం. ఆనందం అంటే దేనితోనూ బాధితం కానిది. అంటే స్వతంత్ర, సమర్థ, శివశాంత స్థితి అని వివరణ. ఈ దృష్టితో చూసినప్పుడు విశ్వంలోని ప్రతివస్తువూ, సంఘటనా ఒక అబాధిత (స్వతంత్రమైన) చైతన్య శక్తి సూత్రం వ్యక్తీకరణ చేసే ఉనికే!
జగత్తులో సత్, చిత్, ఆనందాలను వదలి ఏ వస్తువూ స్వతంత్రమైన ఉనికిని కలిగిలేదు కాబట్టి అది మిథ్య. అంటే ఒక ప్రత్యేక తత్వంగా నిలబడనిది అని అర్థం. అయితే ఆయా వస్తుదేహ పరిమితులలో మాత్రం అది తాత్కాలిక (తత్కాల) సత్యమే. అంటే ప్రాపంచికంగా వ్యావహారిక సత్యమే. ఈ దృష్టితో చెప్పిందే ‘బ్రహ్మసత్యం- జగన్మిథ్య’ అన్న భావన. ఈ జ్ఞానంతో జీవితాన్ని గడిపేటప్పుడు ఎంతటి పోషక, రక్షక కర్మలు నిర్వహిస్తున్నా రెండు విషయాల్లో స్పష్టమైన స్పృహ ఉండి తీరుతుంది. ఒకటి.. ఎలాంటి జీవన విశిష్టతలకైనా అంటుకోకుండా ఒక మితిని విధించుకొని అనంతంగా ఆర్జించాలన్న వెంపర్లాట మానేయాలని. రెండు.. ఏ అనుభవమైనా ఆయా దేహోపాధులకే పరిమితమైన మిథ్యానుభవమని, అది శాశ్వతం కాదని.
ఇక ‘జీవో బ్రహ్మైవ నాపరః’ అన్న విషయంలో పెద్ద క్లిష్టత ఏమీ లేదు. సృష్టిలో ఉన్న చైతన్యమంతా ఒక్కటే. అణువు నుంచి ఆకాశం వరకూ, అమీబా నుంచి ఆ త్రిమూర్తుల వరకూ ఉన్నది ఆ పరబ్రహ్మ చైతన్య శక్తే! ఆయా దేహోపాధులను బట్టి వివిధ స్థాయిల్లో, రకరకాలుగా వ్యక్తమవుతుంది. మనిషిలో ఆ చైతన్యం ఈశ్వరీయమై వికసించినప్పుడు వ్యష్టికి సమష్టితో అభేదం ఆవిష్కృతమవుతుంది. అదే పరబ్రహ్మానుభవం. అదే యోగసమాధి. అదే ‘జీవో బ్రహ్మైవ నాపరః’. మనిషి తన విశిష్టతను సార్థకంగా ప్రకటితం చేయడానికే సూక్ష్మదృష్టితో జగత్తు మిథ్యా స్థాయిని తెలుసుకొని, అంతర్ముఖీనతతో తనలోని పరబ్రహ్మ చైతన్యాన్ని నిత్యం గమనిస్తూ తరించమని మతాతీతమైన అద్వైత బోధ.
యముగంటి ప్రభాకర్
9440152258