వ్యాస భగవానుడు ప్రసాదించిన దేవీ భాగవతం.. సర్వచైతన్య రూపిణి అయిన పరాశక్తి స్వరూపమే. పరమాత్మలో అవిభాజ్యమైన ఆ జగన్మాత సృష్టి చేయాలనే మహాసంకల్పంతో పరమాత్మ నుంచి ప్రకృతిగా మనకు వ్యక్తమైంది. ప్రకృతిలో ప్రస్ఫుటమయ్యే వివిధ స్వరూపాలు, కళాంశరూపాలు, కళారూపాలు అన్నీ ఆ పరాశక్తి రూపాలే! పురుషుడితో కలిసి ప్రకృతి శక్తి ఆడించిన లీలా విశేషాలే ఈ రూపాలు.
శక్తి, శక్తిమంతుడు భార్యాభర్తలు. వేదం దృష్టిలో శరీరం నుంచి ప్రాణాన్ని ఎలాగైతే విడదీయలేమో.. భార్యాభర్తలూ అంతే. శరీరంలో రోగాలు ఏర్పడినప్పుడు ఔషధ సేవతో ప్రాణాన్ని నిలుపుకొన్నట్టుగా, భార్యాభర్తల మధ్య చికాకులు తలెత్తినప్పుడు సామరస్యంగా పరిష్కరించుకోవాలేగానీ, తెగే దాకా లాగకూడదు. సహనం కష్టమైనా దానివల్ల కలిగే ఫలితం గొప్పగా ఉంటుంది. పతి-పత్ని భావంలోని దివ్యత్వాన్ని, ఔన్నత్యాన్ని పరిశీలిస్తే ప్రకృతిలోని శక్తులన్నీ ఇదే రూపంలో కనిపిస్తాయి.
యజ్ఞుని పత్ని దక్షిణ. వాయు పత్ని స్వస్తి. స్వస్తి అంటే పూర్తి చేయడం అని కాదు అర్థం. శుభం కలగాలని! స్వస్తి వాచనంతో మనం ఇచ్చేది, పుచ్చుకునేది ఫలవంతం అవుతుంది. గణపతి పత్ని పుష్టి. అందుకే గణపతి పుష్టిగా ఉంటాడు. ధనమైనా, ఆరోగ్యమైనా, పుణ్యమైనా ఏదైనా సమృద్ధిగా ఉండాలనే భావనను ఇది తెలియజేస్తుంది. అనంతుని భార్య తుష్టి. అంటే తృప్తి. అది ఉంటేనే అనంతమైన ఆనందాన్ని ఆస్వాదించగలం. తృప్తే లేకపోతే ఎన్ని ఉన్నా ఆనందం ఉండదు. నీరు తగిలిన నిప్పులా ముఖం కళ తప్పుతుంది. సత్యుడు అంటే సత్యం. అతడి పత్ని సతి ఎప్పుడూ ఉండునది. అంటే సత్యానికి శాశ్వతత్వం ఉంటుంది. మోహుడి పత్ని దయ. మనం మోహం ఉన్నవారి పట్లనే దయ కలిగి ఉంటాం. మోహమే లేకపోతే బంధుత్వాలు ఉండవు. కనుక జగన్మాత మోహం రూపంలో ప్రపంచాన్ని నడిపిస్తుంది. ధార్మికమైన మోహాన్ని తల్లి అంగీకరిస్తుంది. మోహంలో మునిగిపోయేవాడిని తిరస్కరిస్తుంది. పుణ్యుని భార్య ప్రతిష్ట. ఏ పని చేయడం వల్ల మనిషి పవిత్రుడు అవుతాడో దాని పేరే పుణ్యం. దానివల్ల ఆ వ్యక్తి ప్రతిష్ట పెరుగుతుంది. సుకర్మునికి సిద్ధి, కీర్తి ఇద్దరు పత్నులు. మంచి పనుల వల్ల సిద్ధి కలుగుతుంది. ఫలితంగా కీర్తి లభిస్తుంది. ఉద్యోగుడి భార్య క్రియ. ఉద్యోగం అంటే ప్రయత్నం. చేయునది క్రియ. ఈ రెండే లేకపోతే ప్రపంచ మనుగడే లేదు.
అధర్ముడి పత్ని మిథ్య. మిథ్య అంటే నిలువనిది, సత్యం కానిది అని అర్థం. అధర్ముడి పక్కనే అసత్యం ఉంటుంది. అతడిని పూజించేవారు ధూర్తులు. కృతయుగంలో ఈ దంపతులు కనపడరు. త్రేతాయుగంలో సూక్ష్మంగా కన్పిస్తారు. ద్వాపరయుగంలో సగం కనపడతారు. కలియుగంలో స్పష్టంగా కనపడతారు. మిథ్య తన సోదరుడు అయిన కపటుడితో కలిసి ప్రతి ఇంటా తిరుగుతూ ఉంటుంది.
సుశీలుడికి శాంతి, లజ్జ ఇద్దరు భార్యలు. ఇవి లేకపోతే జనులంతా ఉన్మాదులైపోతారు. తప్పు చేయడానికి వెనుకంజ వేసేలా చేసేదే లజ్జ. కాలానికి పగలు, సంధ్య, రాత్రి అనే ముగ్గురు భార్యలు. లోభుడి భార్యలు ఆకలి, దప్పిక. అగ్నికి వెలుగు, వేడి అనే ఇద్దరు భార్యలు. వైరాగ్యుడి పత్నులు శ్రద్ధ, భక్తి. వైరాగ్యం అంటే విరక్తితో వచ్చేది కాదు. జ్ఞానంతో వచ్చేది. ప్రతికూల పరిస్థితుల్లో పుట్టేది కాకుండా నిత్య, అనిత్య వివేకం నుంచి పుట్టే వైరాగ్యం జ్ఞాన వైరాగ్యం. దీనివల్ల ధర్మంపై, శాస్త్రంపై శ్రద్ధ పెరుగుతుంది.ఆ శ్రద్ధ వల్ల పరమాత్ముడిని నమ్మితే అదే భక్తి. ఈ రెండు బలపడేది వైరాగ్యం వల్లే! ఇవన్నీ ప్రపంచాన్ని నడిపే పరాశక్తి జనిత క్రియాశక్తులు. అందుకే, ప్రకృతిలోని ఈ కళలను మనం తెలియకుండానే ఉపాసిస్తున్నాం. తెలుసుకున్న వాడు ధన్యుడు.
వేముగంటి శుక్తిమతి
99081 10937