ప్రతి మానవుడూ ఆత్మస్వరూపుడని తెలియజేసింది భగవద్గీత. గీత ఉద్భవించక ముందు దేహం, మనసు, బుద్ధి అన్న మూడు అంశాలే ఉండేవని భావించే వారు. కానీ, వీటన్నిటిపైనా ఆత్మ ఉన్నదని గీత తెలియజేసింది. మనిషికి అసలైన బలం, శక్తి ఆత్మ నుంచే వస్తాయి. అలాంటి ఆత్మబలాన్ని ఉద్దీపితం చేసేదే గీత. కురుక్షేత్ర సంగ్రామ సమయంలో మహాబల సంపన్నుడైన అర్జునుడు అసాధారణ పరిస్థితుల్లో తన శక్తినంతా కోల్పోయి చతికిలపడ్డాడు. సవ్యసాచిలో ఆత్మశక్తిని జాగృతం చేయడానికి రణక్షేత్రంలో శ్రీకృష్ణ భగవానుడు అతనికి గీతోపదేశం చేశాడు. పార్థుడికి జ్ఞానోదయం అయింది. ఆత్మబలం రెట్టింపయింది. ఆ ఉత్సాహంతోనే తన కర్తవ్యాన్ని నిర్వర్తించి విజయుడిగా నిలిచాడు.
ఇప్పుడు సమాజం కూడా కురుక్షేత్రంగా పరిణమించింది. ఈ రణరంగస్థలంలో నిత్యం పద్మవ్యూహాల్లో చిక్కుకుంటున్నారు అతివలు. ఇంట్లో, వీధిలో, ఉద్యోగం చేసే చోట ఇలా ప్రతి నెలవూ మహిళకు సవాలు విసురుతున్నది. అబలగా ముద్రించి ఆడవాళ్లను కొందరు అగచాట్లకు గురి చేస్తున్నారు. శారీరకంగా, మానసికంగా మహిళలు కొంత బలహీనులనే వాదన కొందరిది. కానీ, ఆత్మస్థా యిలో వాళ్లూ శక్తిమంతులే! ఆత్మ దగ్గరికి వచ్చేసరికి స్త్రీ, పురుష భేదమే ఉండదు. చుట్టూ జరుగుతున్న ఘోరాలను ఎదుర్కోవడానికి, తమకు తాము రక్షణ కల్పించుకోవడానికి మహిళలు ఆత్మబలాన్ని జాగృతం చేసుకోవాలి. అప్పుడే ఎంతటి కష్టాన్నయినా ఎదుర్కొనే స్థితికి చేరుకోగలుగుతారు. ఎటువం టి అవరోధాన్నయినా అధిగమించి లక్ష్యాన్ని సాధించే ధైర్యాన్ని పొందగలుగు తారు. దానికి భగవద్గీత ఉన్నతమైన మార్గం.
సంపూర్ణ ఆత్మ దర్శనం పొందిన వ్యక్తి భగవంతుడి దర్శనాన్నే పొందగలుగుతా డు. ఈ క్రమంలో 12 సాధనలు ఉన్నాయన్నాడు శ్రీకృష్ణభగవానుడు. గీతలోని 18వ అధ్యాయం మూడు శ్లోకాలలో (51, 52, 53) వాటిని వివరించాడు. ఈ పన్నెండింటిలో మూడు సాధన చేయగలిగినా ఆత్మబలం పునరుత్తేజం అవుతుం ది. ఈ పన్నెండు సాధనల్లో మొదటిది బుద్ధిని పవిత్రంగా ఉంచుకోవడం. రెండో ది దృఢనిశ్చయం కలిగి ఉండటం, ఆహారంపై నియంత్రణ, దేహాన్ని, మనస్సు ను, వాక్కును నియంత్రించడం అనేవి కూడా ముఖ్యమైన సాధనలు. క్రోధాన్ని దరిచేరనీయక పోవడం, శాంతంగా ఉండేందుకు ప్రయత్నించడమూ సాధనే. వీటిలో కొన్నిటిని సాధన చేసినా స్త్రీలలో ఆత్మబలం నిండుతుంది. అదేవారికి శ్రీరామరక్ష అవుతుంది. అప్పుడు వారు ఎంతటి విపత్కర పరిస్థితి నైనా ఎదుర్కొని విజయసీమలకు చేరగలుగుతారు.
ఇందుకు ఉత్తరప్రదేశ్కు చెందిన అరుణిమ కథే ఓ ఉదాహరణ. అరుణిమ ఫుట్బాల్ క్రీడాకారిణి. మిలిటరీ ఉద్యోగంలో చేరడం ఆమె లక్ష్యం. ఒకసారి రైలులో ప్రయాణిస్తుండగా దొంగలు ఆమెపై దాడికి దిగారు. అరుణిమ ప్రతిఘటించింది. దాంతో ఆ దుండగులు ఆమెను కదిలే రైలు నుంచి కిందికి తోసేశారు. రైలు పట్టాలపై పడిపోయిందామె. ఎదురుగా వచ్చిన రైలు ఆమె కాలుపై నుంచి పోయింది. ఈ ప్రమాదంలో అరుణిమ ఎడమకాలు పూర్తిగా తెగిపోయింది, కుడి కాలులో చువ్వలు గుచ్చుకుపోయాయి. వెన్నెముక విరిగిపోయింది. ప్రమాదం జరిగిన కాసేపటికి అరుణిమని గ్రామస్తులు చూశారు. ఆమెను ఆస్పత్రికి తరలించారు. రోజులు గడిచాయి. వైద్యులు అరుణిమకు కృత్రిమ కాలు అమర్చారు. పరిస్థితులు పగబట్టినా ఆమె పోరాటం ఆపలేదు. తనకు జరిగిన అన్యాయానికి బెదిరిపోలేదు. మరో మహోన్నత లక్ష్యాన్ని నిర్దేశించు కుంది. ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించాలని నిశ్చయించుకుంది. రైలు ప్రమాదం జరిగిన రెండేండ్లకు పూర్తి ఆత్మబలంతో, తీవ్రసాధనతో కృత్రిమ కాలుతో ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కింది. పద్మశ్రీ పురస్కారాన్నీ అందుకుంది. అరుణిమలాంటి అతివలు ఈ సమాజంలో ఎందరో ఉన్నారు. విపరీత పరిస్థితుల్లోనూ ఆత్మస్థయిర్యం కోల్పోకుండా సత్తా చాటుతున్నారు. ఆత్మబలం పుంజుకోవడానికి సాధన అవసరం. అందుకు భగద్గీత మార్గనిర్దేశనం చేస్తుందనడంలో సందేహం లేదు.
డాక్టర్ వైష్ణవాంఘ్రి సేవకదాస్
98219 14642