కాకతీయ సామ్రాజ్య పాలకుల్లో చివరివాడు ప్రతాపరుద్రదేవ మహారాజు. రుద్రమదేవికి మగ సంతానం లేని కారణంగా కూతురు కొడుకైన ప్రతాపరుద్రుడిని దత్తత తీసుకొని కాకతీయ సింహాసనం మీద చక్రవర్తిగా నిలబెట్టింది. ప్రతాపరుద్రుడు రాజ్యానికి వచ్చినప్పటినుంచి అనేక యుద్ధాలు చేశాడు. చివరకు ముస్లింల దండయాత్రలో ఓడిపోయి ఢిల్లీకి తీసుకువెళుతుండగా మార్గమధ్యంలో మరణించినట్లు చరిత్రకారుల కథనం.
నిరంతరం యుద్ధాల్లో ఉన్నప్పటికీ ప్రతాపరుద్రుడు అనేక దేవాలయాల నిర్మాణం, దాన ధర్మాదులను నిర్వహించాడు.ఇతని సామంత రాజులు కూడా అనేక దానాలు చేసి శాసనాలు వేయించారు. అటువంటి శాసనాల్లో ఒకటి చిత్తాపూర్ శాసనం. ఇది కాకతీయ సామంతరాజైన చిన్ని రుద్రదేవ మహారాజుకాలంలో బైరిసెట్టి వేయించినట్టిది. శాసన కాలం శోభకృత్ సంవత్సరం ఫాల్గు ణ మాసం (శ.సం. 1224 = క్రీ.శ. 1302).
చిన్న రుద్రదేవ మహారాజు నాయంకరము చిన్నపెరియాల స్థలంలోని పెద్ద పెరియాలలో బైరిసెట్టి బైరేశ్వర, సకలేశ్వర, నాగేశ్వర దేవుళ్ళను ప్రతిష్ఠ చేసి (సిద్ధ త్రికూటము అని శాసనంలో ఉంది) శాసనం వేయించినాడు. ఆ ఆలయాలలోని మూల మూర్తులకు అక్షంతలు, గంధం, పుష్ప, ధూప, దీప, నైవేద్య, తాంబూలాలతో కూడిన అంగరంగ భోగాలకు దానమిచ్చినట్లు శాసనంలో ఉంది.
శ్రీమతు, విడెము, మాదం ఈ స్థానాలకు ఇచ్చినది.. శ్రీపురపు పెద్ద చెరువు వెనక తూము కాల్వలో గుండ్రాతి మర్తురు 1, పెద్ద పరియ్యలందు దేవాలయం భండము గొలిచిన మాడలు10, ఆకులకు, నూనె గానుగుకు చెరు వు వెనక మర్తురునకు తూమెండు ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఇందులో పేర్కొనబడిన కొన్నిపదాలు ఆ కాలం నాటి కొలతలుగా గ్రహించవచ్చు.
శాసనంలో ప్రతాపరుద్రుని గురించి ఎక్కువ వర్ణ న లేదు. కానీ అతని మండలాధీశుడు/ దండనాథుడైన చిన్న రుద్రదేవ మహారాజు గురించి ఉంది. అత డు సూర్యవంశానికి చెందినవాడుగా ‘సమస్త ప్రశస్తోపేత సమధిగత పంచ మహా రాజాధిరాజ పరమేశ్వర ఆంబి(ర)కు కమళ కళికా వికాస భాస్కర, ప్రథాప లంకేశ్వర, సహజ రుద్రికా వీర హిమబళ పక్షపాద, ఉభయదళ సామర్థ్యా ఆజ్ఞ రామ, ప్రతిజ్ఞా పరశురామ ధనుర్విద్యార్జున ఏకాంవీర మన్మత్త నాధరా య, త్రయ పూజిత గడెలింగవైరి, వడవానల వైరి, వన దహన, పశ్చిమరాయ సముద్రాధిపతి, గురువెరాయ కంటోత్పాటన ప్రణీత రాయస్తాపనాచార్య, శరణాగత వజ్ర పంజర, శ్రీ దేవ దివ్య శ్రీపాద పద్మారాధక సూర్య వంశోద్భవ..’ అని వర్ణించబడినాడు.
అలాగే ‘సమస్త భువనాఖ్యాత అయ్యావళి పంచాశత వీర సమస్ర సహస్ర గుణాలంకృత భగవతీ లభుద వరప్రసాద సత్య సౌచాచార చారు చారిత్ర నయ వినయ విభూషణ విమళదిగు భరిత కీర్తి వీర బలింజ్య ధర్మోపదేశ కర్తలైన బైరిసెట్టింగారు’ అని పేర్కొనబడినాడు.
నాడు ఏ ధర్మంవారైనా ప్రభువులకు విధేయులుగా ఉంటూ తాము నమ్మిన దేవుని ప్రతిష్ఠించి, దాన ధర్మాదులను నిర్వహిస్తూ, సమాజాభివృద్ధికి దోహదం చేసినట్లుగా ఈ శాసనం స్పష్టమైన ఉదాహరణగా నిలుస్తుంది.
–డాక్టర్ భిన్నూరి మనోహరి
93479 71177