‘ఉపవాసం’ ఎవరు, ఎప్పుడు, ఎలా చేయాలి?- ఇది తెలియకుండానే చాలామంది ‘ఉపవాస వ్రతాలు’ చేస్తుంటారు. ‘ఉప’ శబ్దానికి ‘సమీపం’ అని, ‘వస’ ధాతువుకు ‘ఉండటం’ అనీ అర్థం. ‘ఉపవాసం’ అంటే, దైవ ‘సమీపంలో ఉండటం’. భగవంతునికి అతి దగ్గరగా ఉండటానికి నిర్ణయించుకోవడం. భగవంతుడు అన్నిచోట్లా, అన్నివేళలా ఉన్నా మన మనసు ఆయనను గుర్తించలేక కేవలం లోకరీతులను, ప్రాపంచిక వ్యవహారాలనే గుర్తుచేసుకుంటూ ఉంటుంది. మనసు నిరంతరం దేని సమీపంలో ఉంటుందో ఆ ప్రభావాన్నే వ్యక్తిగతంగా ఎవరైనా ఎక్కువగా పొందుతుంటారు. కోరికలు, బాధలు, సాంసారిక ఒత్తిడులు, ఉద్యోగాదులు, బాధ్యతలు వంటి వాటి చుట్టే మనసు ఎక్కువగా సంచరిస్తుంటుంది కనుక, జీవశక్తి కాస్తా పూర్తిగా తరిగిపోతుంది. ఫలితంగా రకరకాల ఇబ్బందులు పెరుగుతుంటాయి. అందుకే, మనసు మనకంటే ఉన్నతమైన శక్తి దగ్గర ఉన్నపుడు అది మనవైపు ప్రసరిస్తుంది. దాంతో హృదయానికి హాయిగా, సంతృప్తిగా ఉంటుంది. తక్కువ శక్తి ఉన్న అంశాలపై దృష్టిని కేంద్రీకరిస్తే మనం శక్తిని కోల్పోతుంటాం. మళ్లీ మళ్లీ శక్తిని పెంచుకోవాల్సిన, పొందాల్సిన అవసరాలు కలుగుతుంటాయి. ఆ ప్రయత్నం జరుగకపోతే క్రమంగా మనసు బలహీనమై, ఇబ్బందులను కోరి తెచ్చుకుంటాం. మానవునిగా ఈ లోకానికి వచ్చిన ప్రయోజనం పూర్తిగాక, కర్మలు నిర్వహించలేక, రోజురోజుకూ వాటిని పెంచుకోవడంలోనే నిమగ్నమవుతాం.
మనసును మనకన్నా ఉన్నతమైన శక్తి దగ్గర నిరంతరం పెట్టే ప్రయత్నమే ‘ఉపవాసం’.ఈ దీక్షలో ఉంటే ఇతర అంశాలపై దృష్టి కేంద్రీకరించకుండా కేవలం భగవంతునిపైనే మనసు నిలుపుతాం. అదేలా మన మనసును ఇష్టదైవంపైన, దైవనామంపైన కేంద్రీకరించి, నిరంతరం సాధన చేయడం ద్వారా అపరిమితమైన శక్తి సిద్ధిస్తుంది. ఇదే ‘ఉపవాసం’లోని అంతరార్థం. ఆహారం, జలం, ప్రాణ వాయువులను ఘన, ద్రవ, వాయు రూపాల్లో ఆహారంగా స్వీకరిస్తుంటాం. ఘనాహారాన్ని తయారుచేసుకొని తక్కువసార్లు తింటాం. జలాన్ని కొన్నిసార్లు ఎక్కువగా సేవిస్తాం. వాయువునైతే నిరంతరం స్వీకరిస్తూనే ఉంటాం. ఈ వాయు ప్రక్రియ మన ప్రమేయం లేకుండానే జరుగుతుంది.
ఇంద్రియాలు ఇంతకన్నా ఎక్కువగా మన ప్రమేయం లేకుండానే లోక వ్యవహారాలకు చెందిన ఎన్నో అంశాలను స్వీకరిస్తుంటాయి. దానివల్ల కలిగే ‘ఆలోచనల’కు ఒక అంతుండదు. వాయువు కన్నా వేగంగా ‘ఆలోచనల ఆహారం’ మెదడులోకి వెళ్తుంది. ఘన, ద్రవ, వాయు ఆహారాల్లో లోపాల వల్ల శరీరం పాడవుతున్నట్లే, వ్యర్థ ఆలోచనల వల్ల మనసు మరింత ఎక్కువగా పాడవుతుంది. ఇటువంటి ఆలోచనలను తగ్గించి, క్రమంగా ఉన్నతమైన శక్తి వద్దనే మనసును కేంద్రీకరించడం వల్ల మిగిలిన పదార్థాలను స్వీకరించే అవసరం చాలావరకు తగ్గిపోతుంది. ఇదే నిజమైన ఉపవాసంలోని పరమార్థం.
ఇందులో కేవలం సాధకులకు వారి ఆరోగ్యాదుల రీత్యా తాత్కాలికంగా పండ్లు, పాలు వంటివి కొద్దిగా స్వీకరించడానికి మాత్రమే అవకాశం ఉంది. ఒక్కోసారి ఇదికూడా దుర్వినియోగమై అపార్థాలు చోటు చేసుకుంటాయి. మనసును శక్తి వద్ద కేంద్రీకరించే ప్రయత్నం చేస్తున్న క్రమంలో, ఆహారం బాగా స్వీకరిస్తే నిద్రాదులు రావడం వల్ల అది దైవ సన్నిధిలో ఉండలేకపోతుంది. ఆలోచనల్లో మార్పులు వచ్చి, స్థిరత్వం కోల్పోతూ, శారీరక సుఖాలపై మనస్సు దృష్టి పెడుతుంది. అందుకే, సాధారణంగా మనం నిత్యం చేసే భోజనాదులు తగ్గించుకుంటూ, ఉద్దేశపూర్వకంగా మనసును దైవసన్నిధిలో కూర్చోబెట్టే ప్రయత్నం చేయడమే ఉపవాసం. విశ్వశక్తి మన మనసు ద్వారా శరీరంలో క్రమంగా నిండిపోతుంటే, రానురాను సాధారణ భోజన అవసరం తగ్గిపోతూ వస్తుంది. కాలక్రమంలో విశ్వశక్తి మాత్రమే జీవశక్తిగా పరిణమిస్తుంది. అందుకే, ఆ దిశగా చేసే ప్రయత్నంగానే ‘ఉపవాసాన్ని’ అర్థం చేసుకోవాలి. ఆధ్యాత్మిక సాధకులకు అటువంటి ఉపవాసమే అసలైన విందు భోజనం.