ఈ సృష్టి అంతా పరమాత్మతోనే నిండి ఉంది. ఆ పరమాత్మ స్వరూపమే సృష్టి. ఈ సృష్టిలో మనమంతా ఆయన ఊపిరులూదిన వారం. మనిషికి ఊపిరి ముఖ్యం. బంగారం లేకుండా ఆభరణాలు ఉండవు. అలాగే, ఆ ‘భగవంతుని చైతన్యం’ లేని పదార్థానికీ ఉనికి ఉండదు. ‘ఎవ్వనిచే జనించు జగమెవ్వరి లోపల నుండు లీనమై..’ అంటూ కేవలం భాగవత సారం ఆధారంగా సాగిన స్తుతిని ఓమారు పరిశీలిస్తే తత్తం బోధపడుతుంది. ఒక మనిషి జీవన పెరుగుదల లేదా ఎదుగుదల, పతనం, అంత్యదశ అన్నిటికీ మూలం ఆ పరమాత్మే. కనుక, భగవంతునిపై భారం వేసి మన కర్తవ్యాలను, స్వధర్మాన్ని ఆచరించడమే ఉత్తమం. అధ్యాత్మ విద్యా విద్యానాం వాదః… (భగవద్గీత:10.32). అన్ని విద్యలలో ‘అధ్యాత్మ విద్యయే గొప్పది’.
లౌకిక విద్యలన్నీ కేవలం పొట్టకూటి కోసమే. కూడు, గూడు, గుడ్డ.. వీటికోసం ఏర్పడినవే. ‘ఇవి అనవసరం’ అని ఎవరూ అనరు. మానవుడు సంఘజీవి. భారతీయ వైదిక క్రియలన్నీ పునర్జన్మ సిద్ధాంతం ఆధారంగానే కొనసాగుతున్నాయి. పూర్వజన్మలోని మన చేతలు, మనోభావాలు, నిర్ణయాలు, విధానాలు.. వీటన్నిటిమీద ఆధారపడి మనకు ఈ జన్మ, స్థితులు లభించాయి. ఒక్క మానవునికే సాధనద్వారా ఉన్న స్థితినుండి ఉన్నత స్థితికి పొందే అవకాశం ఉంది. ఈ అవగాహనలో సాధకునికి తోడ్పడేది అధ్యాత్మ విద్య. దీనిద్వారా మాత్రమే వ్యక్తి ముక్తిని పొందటానికి అవసరమైన సాధన చేయగలడు. ఏది తెలుసుకుంటే ఇక వేరేది తెలుసుకోవలసిన అవసరం ఉండదో అదే ‘అధ్యాత్మ విద్య’. విద్యలన్నిటిలోకి ఇదియే రారాజు. ‘ఆ అధ్యాత్మ విద్యయే నేను. వాదించేవారిలో వాదనా పఠిమను నేను’ అన్నాడు పరమాత్మ
పూర్వం పండితులు పరస్పరం వాదించుకొని విషయాన్ని నిగ్గు తేల్చేవారు. వారి వాదనలో నెగ్గిన వారికి సన్మానం చేసేవారు. వాదనలో జల్పం, వితండం అనే రెండు వ్యత్యాసాలు ఉన్నాయి. ‘జల్పం’ అంటే ఉచితానుచితాలు మరచి క్రూరంగా, కేవలం ఎదుటి పక్షాన్ని ఓడించడమే ధ్యేయంగా సాగేది. వీరి వాదనలో పస ఉండదు. న్యాయాన్యాయ విచారణలు లేకుండా, యుక్తాయుక్తాలు మరచి, కేవలం విజయం కోసమే పెద్దగా అరుస్తూ క్రోధంతో చేసే వాదన ‘వితండ వాదన’. వీరి వాదనలోనూ పస ఉండదు. ‘విషయాని’కి వ్యతిరేకంగా వాదిస్తూ ఉంటారు. అసలు నిజమైన వాదన అంటే పూర్వాపరాలు దృష్టిలో ఉంచుకొని, కుతర్కాలు చేయకుండా తన పాండిత్యంతో ఎదుటివారి వాదాన్ని ఖండిస్తూ చేసేది. ‘అటువంటి వాదాన్ని నేను’ అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. అధ్యాత్మ విద్య నేర్చిన వ్యక్తి మౌనిలా, ప్రశాంత వదనంతో ఉంటాడు. ఎన్ని సమస్యలు వచ్చినా తొణకడు. ఎవరైనా విమర్శించినా చిరునవ్వే సమాధానం అవుతుంది. అధ్యాత్మ విద్య వచ్చిన వారికి అన్నీ తెలుసుంటాయి. అనవసరమైన, తగని విషయాలపై వాదన చేయరు. ఎంత తెలుసుకున్నా ఇంకా ‘విషయ పరిజ్ఞానం’ అవలంబించేలా, అభ్యసించేలానే ఉంటారు.‘మధ్యమ’ అంటే వ్యక్తులు చెరోవైపు ఉండి మధ్యలో ఇద్దరి వాదనలు వినే వ్యక్తి. వీరు ఒకరి ఆలోచనలు, మరొకరి ఆలోచనలు బేరీజు వేసుకొని నిష్కర్షగా సమాధానం చెప్పేవారు. గెలుపు ఎవరిదో కూడా నిర్ణయించేది ఈ మధ్యములే. ‘అటువంటి మధ్యముడిని నేనే’ అంటాడు పరమాత్మ. అందుకే, ఈ సృష్టికే ఆది, మధ్యమం, అంతం.. అంతా భగవంతుడే.
–కనుమ ఎల్లారెడ్డి
93915 2302