తతః సప్తదశే జాతః సత్యవత్యాం పరాశరాత్
చక్రే వేదతరోః శాఖ దృష్ట్వా పుంసో ల్పమేధసః
–భాగవతం (1.3.21)
‘సత్యవతీ పరాశరుల పుత్రుడైన శ్రీల వ్యాసదేవుడు భగవంతుని 17వ అవతారమని’ శ్రీమద్భాగవతం వర్ణించింది. ప్రతీ అవతారానికీ ఒక ప్రత్యేకమైన ప్రయోజనం మహోత్కృష్టమై ఉంటుంది. కలియుగంలో జనులు అల్పమేధస్సు కలవారుగా ఉంటారని ముందుగానే తెలుసుకొని భగవంతుడు వ్యాసదేవునిగా ఆవిర్భవించి, ఏకమొత్తంగా ఉన్న వేదాన్ని నాలుగు శాఖలుగా విభజించాడు. ఇదే శ్రీల వ్యాసదేవుని జన్మ (అవతార) ప్రయోజనం. ఆయనది శక్త్యావేశ అవతారం. యోగ్యుడైన జీవునికి ప్రత్యక్షంగా భగవచ్ఛక్తి ప్రదానమైనప్పుడు ‘శక్త్యావేశ అవతారం’ ఉద్భవిస్తుంది. పరోక్షంగా శక్తి ప్రదానం జరిగినప్పుడు ‘భగవద్విభూతులు’ ప్రకటితమవుతాయి.
కృష్ణుడు, కృష్ణద్వైపాయనుడు, ద్వైపాయనుడు, సత్యవతీ సుతుడు, పారాశర్యుడు, పరాశరాత్మజుడు, బాదరాయణుడు అనే పలు పేర్లతో పిలువబడే వేదవ్యాసుడు యమునా నదీ ద్వీపంలో జన్మించడం వల్ల ద్వైపాయనుడయ్యాడు. దాశరాజు కుమార్తె అయిన సత్యవతికి వివాహం కాకముందు పరాశర మునిద్వారా జన్మించినవాడే శ్రీవ్యాసదేవుడు. ఆవిర్భవించగానే ఆయన తల్లికి నమస్కరించి తపస్సు చేసుకోవడానికి వెళ్లిపోయాడు. ‘ఎప్పుడు తలిస్తే అప్పుడు వచ్చి అవసరమైన పని చేసి పెడతానని’ ఆమెకు వాగ్దానం చేసి మరీ వెళ్లాడు. సూర్యతేజుడు, వేదమయుడు, ఆదిముని అయిన వ్యాసదేవుడే వేదవాఙ్మయం రచించాడు. తపస్సు తర్వాత తన దివ్యదృష్టితో దర్శించి జనులు అల్పాయుష్షులు, వారిలో సత్త్వగుణం తగ్గడం, దౌర్భాగ్యులు కావడం చూసి వాటికి విరుగుడు ‘వేదోక్త యజ్ఞాలను విస్తరింప జేయడమేనని’ నిర్ణయించుకొని, ఆ మేరకు నాలుగు వేదాలకు రూపకల్పన చేశాడు. వీటికి తన నలుగురు శిష్యులను అధిపతులను చేశాడు. ఋగ్వేదానికి పైలుడు, సామవేదానికి జైమిని, యజుర్వేదానికి వైశంపాయనుడు, అధర్వణ వేదానికి అంగీరుడు ఆచార్యులు అయ్యారు. పురాణాలకు రోమహర్షణుడు ఆచార్యుడు అయ్యాడు. బ్రహ్మదేవుని ఆదేశంపై శ్రీవ్యాసదేవుడు పంచమ వేదమైన ‘మహాభారతం’ రచించాడు. అందులోనే ‘భగవద్గీత’ కూడ అంతర్భాగమైంది. ‘బ్రహ్మసూత్రాలూ’ అందించాడు. ఇంత జరిగినా ఆయనకు సంతృప్తి కలుగలేదు.
ఏదో కొరత మనసును పీడించింది. అప్పుడు నారద ముని వ్యాసాశ్రమానికి వచ్చి రోగ నిర్ధారణ చేశాడు. వారి ఆదేశంతో వ్యాసదేవుడు ‘భాగవత’ పురాణ రచన పూర్తి చేసి సంపూర్ణ శాంతిని, తృప్తిని పొందాడు. దీనిని తన పుత్రుడైన శ్రీశుకదేవునిచే అధ్యయనం చేయించాడు. ఆ శుకదేవుడే తర్వాత భాగవతాన్ని గంగాతటంలో ప్రాయోపవేశుడై ఉన్న పరీక్షిత్తు మహారాజుకు వినిపించాడు. కలియుగంలో జనులకు జ్ఞానప్రదానం చేయడం ద్వారా వారిని కలి ప్రభావం నుంచి కాపాడేందుకు అవతరించిన వ్యాసదేవుని అవతార ప్రయోజనం ‘భాగవత’ రచనతో పరిపూర్ణమైంది. శ్రీకృష్ణుడు అన్ని అవతారాలను ధరించే అవతారియని, ‘కృష్ణస్తు భగవాన్ స్వయం’ అనే సత్యాన్ని ‘భాగవతం’లోనే వ్యాసదేవుడు వెల్లడించాడు. ‘మహాభారత’ రచన చేయడమేగాక ఆ కథలోనూ వ్యాసదేవుడు అత్యంత ముఖ్యపాత్ర పోషించాడు. ధృతరాష్ర్టుడు, పాండురాజు, విదురుడు.. ఈ ముగ్గురికి జన్మనిచ్చి భారతకథకు సూత్రధారి అయ్యాడు. జనులకు వేద జ్ఞానాన్ని బోధించిన వ్యాసదేవుడు ఈ ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు ఆవిర్భవించి జనుల చీకటి జీవితాల్లో జ్ఞాన వెన్నెలను నింపాడు. అందుకే, ఆయన జన్మదిన తిథిని ‘గురు పూర్ణిమ’గా జరుపుకొంటాం. వేద జ్ఞానాన్ని, గీతా భాగవత జ్ఞానాన్ని యథాతథంగా అందించే ఎవ్వరైనా వ్యాసప్రతినిధులే అవుతారు. అటువంటి వారందరినీ పూజించే రోజే నేటి వ్యాసపూర్ణిమ!
డా॥ వైష్ణవాంఘ్రి సేవక దాస్
98219 14642