యత్రయత్ర రఘునాథ కీర్తనం తత్రతత్ర కృతమస్త కాంజలిమ్!
బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకమ్!!
‘ఎక్కడ శ్రీరామనామ సంకీర్తన జరుగుతుందో అక్కడ హనుమంతుడు ఆనందబాష్పాలు నిండిన కళ్ళతో తలవంచి చేతులు జోడించి నెలవై ఉంటాడు’. ఎక్కడ శ్రీరామ కథాగానం జరుగుతుందో అక్కడ హనుమ ఆసీనుడై ఉంటాడని కూడా మన ధర్మశాస్ర్తాలు చెప్తున్నాయి. హనుమంతుడు శ్రీరామచంద్రుడికి చేసిన ప్రార్థనొకటి శ్రీమద్భాగవతం (5.19.8)లో ఉంది. శ్రీరామచంద్ర భక్తి భావామృతంలో భక్తులను మరింత ఆనందింపజేసేందుకు హనుమంతుల వారు నాడు, నేడు సకలవిధాలా మానవులకు సహాయపడుతూనే ఉన్నారు. రామనామం జపించబడినంత కాలం చిరంజీవియైన హనుమంతుడు ఈ లోకంలో నివసిస్తాడని కూడా శాస్ర్తాలు చెప్తున్నాయి.
ప్రసిద్ధిగాంచిన 108 దివ్య వైష్ణవ క్షేత్రాల్లో శోలింగుర్ ఒకటి. ఇది చెన్నై పట్టణానికి పశ్చిమ దిశగా 90 కి.మీ. (అరక్కోణం నుంచి 25 కి.మీ., తిరుత్తణి నుంచి 40 కి.మీ.) దూరంలో ఉంది. ఇక్కడి కొండపై ‘ఏకశిలా విగ్రహ మూర్తి’గా కొలువై ఉన్నాడు యోగ నరసింహస్వామి. ఈ దివ్యక్షేత్రాన్ని ‘చోజ-సింహపురం’ (తిరుకడిగై) అని కూడా పిలుస్తారు. శోలింగుర్ క్షేత్రంలో అత్యంత ప్రభావవంతమైన రెండు దేవాలయాలున్నాయి. ఒకటి: పెరియ మలై (పెద్దకొండ) వద్ద నెలకొన్న ‘యోగ నరసింహస్వామి’ దేవాలయం, మరొకటి: చిన్న మలై (చిన్నకొండ) వద్ద నెలకొన్న ‘చతుర్భుజ ఆంజనేయస్వామి’ ఆలయం. భక్త ఆంజనేయుడు తపస్సు చేసిన క్షేత్రంగా స్థానికులు దీన్ని విశ్వసిస్తారు. ఆంజనేయుని తపస్సుకు ప్రసన్నుడైన స్వామి తన శంఖచక్రాలను వారికి బహుకరించాడట. ఆంజనేయ స్వామి యోగాసీనుడై తనపై బాహువులలో శంఖచక్రాలను, కింది బాహువులలో ఒకదానితో జపం చేస్తూ, మరొకదాని వేళ్లపై సంఖ్యలను లెక్కిస్తున్నట్టుగా దర్శనమిచ్చే ఏకైక అపురూప దివ్య క్షేత్రమిదే. నిత్యం నరసింహస్వామినే దర్శిస్తూ శ్రీహరి నామాలను జపిస్తూ ఆంజనేయస్వామి ఇక్కడ తపస్సు చేస్తుండటం విశేషం.
సురో సురో వాప్యథ వానరో నరః సర్వాత్మనా యః సుకృతజ్ఞ ముత్తమమ్
భజేత రామం మనుజాకృతిం హరిం య ఉత్తరాననయత్కోసలాన్దివమితి॥
‘సురులు గానీ లేదా అసురులు గానీ, నరులు గానీ లేదా వానరులు గానీ మానవమాత్రునిగా ఈ లోకంలో అవతరించిన దేవాదిదేవుడైన ఆ శ్రీరామచంద్ర ప్రభువును ఆరాధించాలి. భక్తుడు ఆచరించే తృణమాత్రపు సేవనైనా ప్రేమతో స్వీకరించే ఆ స్వామిని సేవించడానికి కఠోర తపస్సులే చేయనవసరం లేదు. వారు ప్రీతి చెందితే, తన భక్తునికి సార్థకత చేకూరినట్టే! వాస్తవానికి, శ్రీరామచంద్ర ప్రభువులవారు అయోధ్య వాసులందరికీ తన స్వధామాన్ని (వైకుంఠ ప్రాప్తి) అనుగ్రహించారు.
భగవంతుని సంకల్పం మేరకు ఆ శోలింగుర్ ధామం వంటి మూర్తి హైదరాబాద్లోనూ వెలిశాడు. స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దివ్యక్షేత్రమైన ‘హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్’లో ఆంజనేయస్వామి, లక్ష్మీ నరసింహుడిని ధ్యానిస్తూ, శ్రీహరి నామాలను ముఖ్యంగా శ్రీరామ నామాలను జపిస్తున్న ‘చతుర్భుజ జపాంజనేయమూర్తి’గా ఆవిర్భవించడం విశేషం. భక్తులు ఒనర్చే అల్పమైన సేవనూ భగవంతుడు స్వీకరిస్తాడు. అదే మానవ జీవితానికి గొప్ప సార్థకత. ప్రస్తుత యుగంలో భగవంతుణ్ణి ప్రసన్నం చేసే అత్యంత సరళతరమైన మార్గమే హరినామ సంకీర్తన. అదే ‘హరే కృష్ణ’ మహా మంత్రం.
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
–శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస ప్రభూజి