శ్లో॥ కులం పవిత్రం జననీ కృతార్థా వసుంధరా పుణ్యవతీ చ తేన అపార సంవిత్ సుఖసాగరేస్మిన్ లీనం పరే బ్రహ్మణి యస్య చేతః’(స్కాందం- మహేశ ఖండం)పరబ్రహ్మములో లీనమై పారం లేని జ్ఞానానందమయ సాగరంలో ఈదులాడే సాధు పురుషుని కులమే పవిత్రం. వాని జననియే కృతార్థురాలు. ఈ అవని (భూమి) అతని వలననే పుణ్యవతి, పావని అగుచున్నది.
కం॥ అనయంబును నయ్యక్షుల ఘనమాయ నెఱింగి ముని నికాయము వరుసన్ మను మనుమని మను మనుమని మనమున దలచుచును దత్యమక్షంబునకున్
మైత్రేయ మహర్షి విదురునితో ఇలా ముచ్చటించాడు.. ‘మహాత్మా! పట్టాభిషిక్తుడైన ధ్రువుడు శింశుమార ప్రజాపతి పుత్రిక ‘భ్రమి’ని పత్నిగా పొందాడు. ఆమె యందు కల్పుడు, వత్సరుడు అను ఇద్దరు పుత్రులు కలిగారు. కల్ప (పద్నాలుగు మన్వంతరాల కాలం), వత్సర (సంవత్సర కాలం) నామాలు కాలవాచకాలు. ధ్రువం అనగా నిత్య, నిశ్చిత సత్యం. కాలాతీతం, అఖండ కాలం. ధ్రువుని నిజ బంధువులందరూ కాలానికి బద్ధులు. ఖండకాల స్వరూపులు. ఎప్పటికైనా కాలంచే కబళింపబడేవారే. ‘భ్రమి’ అనగా గడియారపు ముల్లువలె నిరంతరం గతిశీలం (చలిస్తూ ఉండేది). ధ్రువుడు కేంద్రం (ఇరుసు)గా తిరిగే జగచ్చక్రం, కాలచక్రం!
యక్షుని చేతిలో హతుడైన తమ్ముడు ఉత్తముని మరణవార్త విన్న ధ్రువుని చిత్తం శోకాయక్తమయింది. కలత చెందిన మనస్సు మన్యువు (కోపం)తో మరగిపోయింది. జయశీలమైన అరదం (రథం) అధిరోహించి జక్కుల (యక్షుల) ఆవాస భూమి అయిన అలకాపురిపై ఆక్రమణ చేశాడు. అరవిందనేత్రుడు శ్రీహరి అపరిమిత కృపాపాత్రుడైన ధ్రువుడు అరి (శత్రు) వీరులను పరిమార్చి సర్వోపరి అజేయుడై నిలిచాడు. చావగా మిగిలిన యక్షులు హరీంద్రాన్ని (సింహరాజును) చూసి హడలి హతాశులై పరుగుపెట్టే కరీంద్ర (ఏనుగుల) బృందాల వలె కదన రంగం నుంచి కనుమరుగై పోయారు. క్రూరులు, మాయావులైన యక్షులు అదృశ్యరూపులై అనేక మాయలను కల్పించారు.
అప్పుడు యక్షుల మాయల మర్మా (రహస్యా)లను గ్రహించి మహామునులు మనువు మనుమడైన ధ్రువుని ప్రేమతో ‘మనుము (చిరంజీవ)! మనుము (చిరంజీవ)!’ అని మనసులో తలుస్తూ ‘ఓ పుణ్యమూర్తీ! శార్ఙపాణి శ్రీహరి నీ శత్రువులను సంహరించుగాక’ అని ఆశీర్వదించారు.ఇంత అందమైన కందం పోతన అమాత్యుని సొంత పద్యం. దీనిలో కూర్చిన సభంగ యమకాలంకారం, ‘న’కార, ‘మ’ కారాల మరల-మరల ఆవృత్తి కందానికి సొబగును, శ్రావ్యతను సంతరించి పెట్టాయి.
మునుల మాటను తలదాల్చి ధ్రువుడు కమలనాభు (విష్ణు)ని పదపద్మాలను మదిలో పదిల పరచి, ఆచమించి శత్రు విధ్వంసకమైన నారాయణాస్ర్తాన్ని సంధించాడు. అచ్చమైన జ్ఞానంతో అజ్ఞానం అంతరించునట్లు.. ఆ అస్త్రంతో యక్షుల మాయ అనే అంధకారం మటుమాయమైపోయింది. ధ్రువుడు మరల మారణహోమం మొదలుపెట్టాడు. నిరపరాధులైన యక్షుల సంహారం చూచి తాతగారైన స్వాయంభువ మనువు వచ్చి మనుమనికి ఇలా బోధించాడు.. ‘బిడ్డా! కోపం బహు చెడ్డది. అది నరకానికి ద్వారం. ఒక్కని కోసం పెక్కుమందిని వధించడం వివేకం కాదు. కాన, వెంటనే విరమించు. పురుషోత్తముని భక్తులకు ప్రాణిహింస పరమ హేయం. ఈ పాపపు పనికి ఎలా పూనుకున్నావు? సకల ప్రాణుల పట్ల సమభావమే సర్వేశ్వరుని సమారాధన! అనఘా! అయస్కాంత సన్నిధిలో అయఃఖండాలు (ఇనుప ముక్కలు) చలించునట్లు, చేతనుడైన పరమాత్ముని సన్నిధిలో జడ ప్రపంచం భ్రమిస్తూ, పరివర్తన చెందుతూ ప్రవర్తిస్తూ ఉంటుంది!
తిరుగలిలోని ఇరు రాళ్లలో తిరిగే దానికి తిరుగనిదే ఆధారం (తీరు, తెరువు) అయినట్లు, పురుష స్వరూపుడైన ధ్రువుడు సుస్థిరుడు కాన అతనికి భ్రమణం (చలనం) లేదు. ప్రకృతి స్వరూపిణి అయిన భార్య ‘భ్రమి’కే భ్రమణం. ‘విశ్వభ్రమణకారిణీ, భవచక్ర ప్రవర్తినీ’ అని లలితామాత నామాలు. సాత్తత సంహిత అయిన భాగవతంలో సాత్యవతేయుని (వ్యాసుని) సమాధి భాష అంటే ఇదే!
మనువు.. ‘ధ్రువా! ‘నా అనుజుడు ఉత్తముడు అస్మదీయుడు (నావాడు). యక్షులు నాకు ప్రతిపక్షులు’ అన్న భ్రమలో పడమాక. భక్తుడవైన నీకు భేద బుద్ధి భావ్యం కాదు. అభేద దర్శనమే జ్ఞానం. ఒకప్పుడు నీవు ‘అర్థార్థి’ భక్తుడవు. ఇప్పుడు జ్ఞానీ భక్తుడవు కావాలి. నాయనా! ఒకరి మరణానికి మరొకరు కారణం కాదు. జగత్తులో జీవుల జన్మ-మరణాలకు జగన్నాథుడు జనార్దనుడే కారణం. కాన, సర్వ శుభాలను హరించే ఆగ్రహాన్ని అణచివేసుకో. నతుల (నమస్కారాల)తో, నుతుల (స్తుతుల)తో కుబేరుని అనుగ్రహం పొందు.’
తాతగారి మాట మన్నించి మనవడు యక్షుల మారణకాండకు ముగింపు పలికాడు. యక్షరాజు కుబేరుడు ఆనందంతో ధ్రువుని అభినందించి మనోగతమైన అభిమతం కోరమనగా ధ్రువుడు శ్రీరమణుని సంస్మరణం మరణ కాలంలో కూడా మరవకుండా ఆశీస్సు అర్థించాడు. అలకాపురి అధీశ్వరుడు ‘తథాస్తు’ అని అంతర్థానం అయ్యాడు. ధ్రువుడు ముప్పయ్యారు వేల సంవత్సరాలు ధర్మబద్ధంగా రాజ్యమేలి విరక్తి చెందాడు. పుత్రులకు రాజ్యం వదిలి పుణ్యభూమి బదరీక్షేత్రం చేరి పద్మనేత్రుని పూజించి పరమానందం పొందాడు. ధ్రువుని వైకుంఠ గమనానికి నంద-సునందులనే విష్ణు భక్తులతో విమానం వచ్చింది. తేజోమయ రూపంతో ధ్రువుడు విమానంలో విష్ణుపదానికి వెళ్తూ తల్లిని విడిచి వెళ్లడం ఎలా? అని విచారించాడు. విష్ణుభక్తులు ముందు పోతున్న విమానంలో తన కన్నతల్లి ఉన్నదని విన్నవించగా ధ్రువుడు పరమానందం పొంది విష్ణుపదం వేంచేశాడు. మృత్యువు శిరస్సు మీద పాదం మోపి విమానమెక్కి సశరీరంగా వైకుంఠం (ధ్రువ స్థానం) వెళ్లాడని మూల భాగవతం.
(సశేషం)
తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ
98668 36006