శ్రీశైలం : తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే ఆషాఢ బోనాల పండుగలో భాగంగా శ్రీశైల శ్రీ భ్రమరాంబదేవి అమ్మవారికి బంగారు బోనం సమర్పించేందుకు లాల్దర్వాజ సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయ కమిటి గురువారం రాత్రి శ్రీశైలం చేరుకుంది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఛైర్మెన్ మాట్లాడుతూ.. మహంకాళి దేవాలయ 113వ వార్షికోత్సవం సందర్భంగా అష్టాదశ శక్తిపీఠాలలో ఒక్కో క్షేత్రాన్ని ఒక్కొక్క సంవత్సరం దర్శించుకుని అమ్మవారికి బంగారు బోనం, పట్టువస్త్రాలు సమర్పించేందుకు శ్రీకారం చుట్టినట్లుగా పేర్కొన్నారు.
అందులో భాగంగా గురువారం సాయంత్రం లాల్దర్వాజ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించుకుని తొలి బంగారు బోనం శ్రీశైలాంబికకు సమర్పించేందుకు వచ్చినట్లు చెప్పారు. శుక్రవారం ఉదయం ఆలయ కమిటీ సభ్యులంతా కలిసి ఆలయ సాంప్రదాయాలతో అమ్మవారికి నైవేద్యం సమర్పించనున్నట్లు తెలిపారు. శ్రీశైలం వచ్చిన వారిలో ఆలయ కమిటీ సలహాదారు జి. మహేష్ గౌడ్, కే.విష్ణుగౌడ్, జే. లక్ష్మినారాయణగౌడ్, ప్రధాన కార్యదర్శి బి. మారుతి యాదవ్, కొశాధికారి జి. అరవిందకుమార్ గౌడ్, చంద్రకుమార్, సురేష్ బాబు ఉన్నారు.