శ్రీశైలం : శ్రీశైల మహా క్షేత్రంలో ఆషాఢమాస పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు, పుష్పార్చనలు శాస్తోక్తంగా ఘనంగా జరిగినట్లు ఆలయ ఈవో కేఎస్ రామారావు తెలిపారు. శుక్రవారం ఉదయం గ్రామదేవత అంకాలమ్మకు అభిషేకాలు నిర్వహించి వార పూజలు నిర్వహించారు. సాయంత్రం ప్రదోషకాల పౌర్ణమి గడియల్లో శ్రీ భ్రమరాంబ దేవికి లక్ష కుంకుమార్చన అదేవిధంగా ఊయల సేవను జరిపారు. అమ్మవారి ఆలయ ప్రాకారమంతా ప్రత్యేక పుష్పాలంకరణతో శోభాయమానంగా మారింది. ఊయలలో ఆశీనులైన స్వామి అమ్మవార్లకు అర్చక వేదపండితులు షోడశోపచార క్రతువులు జరిపి లలితా సహస్రనామ పఠనంతో కుంకుమార్చన చేశారు.
లోకకళ్యాణార్ధం ప్రతి పౌర్ణమి రోజున మాత్రమే అమ్మవారికి ప్రత్యేకంగా నిర్వహించే లక్షకుంకుమార్చన పూజా విధిలో భక్తులు కూడా పరోక్షసేవ ద్వారా పాల్గొనే అవకాశం కల్పించగా వివిధ ప్రాంతాల నుండి ఈ సేవలో భాగస్థులైన 721 మంది గొత్రనామాలను అర్చకులు పఠించారు. దేశ విదేశాలలో ఉండే భక్తుల అభ్యర్థన మేరకు అమ్మవారికి జరిగే పౌర్ణమి ప్రదోషకాల పూజల్లో పరోక్షంగా పాల్గొనే అవకాశం కల్పించిన దేవస్థానం నిర్ణయానికి పలువురు దాతలు హర్షం వ్యక్తం చేసినట్లు ఈవో తెలిపారు. పూజా కార్యక్రమంలో వేదపండితుడు రాధాకృష్ణ, ఉప ప్రధాన అర్చకులు విజయ్ కుమార్, శాస్త్రి, ఫని, పవన్, శ్రీశైలప్రభ సంపాదకుడు అనీల్ కుమార్, ఏఈవో హరిదాసు పాల్గొన్నారు.