పద్మనాభం భజే!
పన్నగశాయి పరమాద్భుత రూపం అనంత పద్మనాభుడు. సృష్టి, స్థితి, లయ తత్వాలకు ప్రతిబింబంగా కనిపించే పద్మనాభుడి దివ్యమంగళ రూపం ఎంత సేపు చూసినా తనివి తీరదు. కావేరి తీరంలో పద్మనాభుడిగా, తెలుగునాట రంగనాథుడిగా భక్తుల పూజలు అందుకుంటున్నాడు స్వామి. ఆయన సేవలో తరించే అవకాశం కల్పిస్తున్నది ‘అనంత పద్మనాభ వ్రతం’. భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. కష్టాలు తీరిపోవాలని, కోరికలు నెరవేరాలని కోరుతూ దీనిని నిర్వహిస్తారు. అరణ్యవాసంలో ఉన్న పాండవులు.. శ్రీకృష్ణుని సలహా మేరకు ఈ వ్రతాన్ని చేశారని పురాణ కథనం. పద్మనాభుడి అర్చనలో సర్పరాజమైన అనంతుడిని ఆరాధించడం ఇందులోని ప్రత్యేకత. వ్రతం విధివిధానాలు భవిష్యోత్తర పురాణంలో కనిపిస్తాయి. పిండితోగానీ, దర్భలతోగానీ ఏడు పడగల సర్పాన్ని తయారు చేసి అష్టదళ పద్మమంటపంపై గానీ, కలశంపై గానీ అనంతస్వామిని ప్రతిష్ఠించి షోడశోపచార పూజలు నిర్వర్తిస్తారు. ఇందులో భాగంగా 14 ముడులు కలిగిన ఎర్రని తోరాలను స్వామి దగ్గర ఉంచుతారు. వ్రత పరిసమాప్తి తర్వాత వాటిని దంపతులు తమ చేతులకు ధరిస్తారు. ఒకసారి వ్రత దీక్షను స్వీకరించిన దంపతులు ఏటా తప్పకుండా ఆచరించాల్సి ఉంటుంది. కుదరని పక్షంలో ఎవరైనా వ్రతంలో ఉంచిన తోరాలనైనా తప్పనిసరిగా ధరించాలని చెబుతారు పెద్దలు. పౌర్ణమితో కూడుకున్న చతుర్దశి అయితే అనంత వ్రతానికి మరింత శ్రేష్ఠమని భావిస్తారు.
టి.వి.ఫణీంద్రకుమార్
98853 35119