జూబ్లీహిల్స్, జూలై 9: ఓ వైపు ఖేలో ఇండియాకు సన్నాహాలు.. మరోవైపు త్వరలో ప్రారంభం కానున్న టోక్యో విశ్వక్రీడలు క్రీడాకారుల్లో నూతనోత్తేజాన్ని నింపుతున్నాయి. కరోనాతో కుదేలైన క్రీడారంగం ఇప్పుడిప్పుడే కొత్త ఉత్సాహాన్ని నింపుకుంటున్నది. ఒక్కొక్కటిగా తెరుచుకుంటున్న స్టేడియాలతో యువతలో చలనం ప్రారంభమైంది. ముఖ్యంగా నగరంలోని యూసుఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్రెడ్డి ఇండోర్ స్టేడియంలో క్రీడల సందడి మొదలైంది.
కోట్ల విజయభాస్కర్రెడ్డి ఇండోర్ స్టేడియంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో సుశిక్షితులైన కోచ్లతో క్రీడాకారులకు ప్రభుత్వం నాణ్యమైన శిక్షణ అందిస్తున్నది. ఇక్కడ బాడ్మింటన్, బాక్సింగ్, బాస్కెట్బాల్, జిమ్నాస్టిక్స్, కరాటే, స్కేటింగ్, రెజ్లింగ్లో తర్ఫీదు ఇస్తున్నారు. ఒక్కసారి ఇక్కడ సభ్యులుగా నమోదైతే చాలు.. క్రీడాకారులు నిర్దేశించుకున్న లక్ష్యం చేరే వరకు శిక్షణ కొనసాగిస్తారు.
కొవిడ్ రెండో దశ ముగిసిన అనంతరం ఇటీవలే తెరుచుకున్న కోట్ల విజయభాస్కర్రెడ్డి ఇండోర్ స్టేడియంలో జూలై 1 నుంచి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఏడు క్రీడాంశాల్లో నామమాత్రం ఫీజుతో శిక్షణ ఇస్తున్నారు. ఆసక్తి గల వారు కోచ్లను సంప్రదించి ఇక్కడ అడ్మిషన్లు పొందవచ్చు. బాడ్మింటన్, జిమ్నాస్టిక్స్, స్కేటింగ్లో శిక్షణ పొందే వారు 6 నుంచి 10 ఏండ్లు, బాస్కెట్బాల్లో 6 నుంచి 12, కరాటేలో 6 నుంచి 16, రెజ్లింగ్,బాక్సింగ్లలో 10 నుంచి 16 ఏండ్ల లోపు ఉండాలి.
కోట్ల విజయభాస్కర్రెడ్డి స్టేడియంలో శిక్షణ పొందిన క్రీడాకారులు అనేక వేదికలపై మెరుస్తున్నారు. తమ సత్తా చాటుతున్నారు. కరాటే జాతీయ స్కూల్ గేమ్ ఫెడరేషన్ పోటీలలో ప్రగతి (15 ఏండ్ల విభాగంలో), వరప్రసాద్, పురుషోత్తం (17 ఏండ్ల విభాగంలో), గోవర్దన్ (18 ఏండ్ల విభాగంలో), కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన పోటీలలో లక్ష్మీప్రణీత్ (9 ఏండ్ల విభాగంలో) అత్యంత ప్రతిభ కనబర్చారు. రెజ్లింగ్లో లచిత (14 ఏండ్ల విభాగం), రోషిణి, సాయి రోహిమి, శ్రావణి (17 ఏండ్ల విభాగం), అండర్ -23 విభాగంలో దేవి, హరిప్రియ, షమయ, వెనాయిని.. సీనియర్ నేషనల్స్లో రుబానాలు ఎన్నో పతకాలు సాధించారు.
సౌత్ ఇండియా రెజ్లింగ్- 2020 చాంపియన్ షిప్ అండర్-23 విభాగంలో శివకుమార్, అరుణ్కుమార్, గంగారామ్లు.. జూనియర్ నేషనల్స్లో శ్రవణ్ కుమార్ రజత పతకాల పంట పండించారు. ఆల్ ఇండియా యూనివర్సిటీ నేషనల్స్లో విశాల్ యాదవ్, మనీష్, నరేందర్, కిరణ్ యదవ్ తెలంగాణ తరపున ప్రాతినిధ్యం వహించి తమ సత్తా చాటారు. బాక్సింగ్ సీనియర్ నేషనల్స్, యూనివర్సిటీ పోటీలలో నీరజ్, సాయికల్యాణ్లతో పాటు అనేక మంది క్రీడాకారులు స్కేటింగ్, బాడ్మింటన్, జిమ్నాస్టిక్స్లో తమ ప్రతిభాపాటవాలు కనబరుస్తూ అబ్బురపరుస్తున్నారు.
కరోనా ప్రభావంతో విద్యార్థుల్లో శారీరక వ్యాయామం పూర్తిగా తగ్గిపోయింది. మహమ్మారి విజృంభణతో స్టేడియాలు తెరుచుకోక క్రీడలపై ఆసక్తి తగ్గింది. కోట్ల విజయభాస్కర్రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఏడు క్రీడాంశాలపై ఉదయం ఆరు నుంచి తొమ్మిది వరకు.. సాయంత్రం నాలుగు నుంచి ఏడు గంటల వరకు శిక్షణ ఇస్తు న్నాం. ఆసక్తి గల విద్యార్థులు, క్రీడాకారులు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు, జనన ధ్రువీకరణ పత్రంతో స్టేడియంలోని కోచ్లను సంప్రదించి అడ్మిషన్లు తీసుకోవచ్చు.- జి.రవీందర్, స్టేడియం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్