లక్నో: పెండ్లికి కొన్ని గంటల ముందు ఒక వ్యక్తిపై కాల్పులు జరుపడంతో అతడు మరణించాడు. ఉత్తరప్రదేశ్ ఫిరోజాబాద్లోని ఎటా రోడ్లో ఈ ఘటన జరిగింది. 25 ఏండ్ల పవన్ కుమార్కు శనివారం సాయంత్రం పెండ్లి జరుగాల్సి ఉంది. కూరగాయల వ్యాపారి అయిన అతడు యథావిధిగా ఆ ఉదయం 4.30 గంటలకు సంతకు బైక్పై వెళ్లాడు. వెనుక నుంచి బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు కుమార్పై గన్తో కాల్పులు జరిపి పారిపోయారు. దీంతో బైక్ నుంచి కింద పడిన కుమార్ అక్కడే చనిపోయాడు.
విషయం తెలుసుకున్న కుమార్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. తమ కటుంబానికి అతడే ఆధారమని, సాయంత్రం పెండ్లికి అంతా సిద్ధమవుతుండగా ఈ ఘోరం జరిగిందని వాపోయారు. తమ కుమారుడికి శత్రువులు లేరని పోలీసులకు వారు చెప్పారు. కాగా, కుమార్పై కాల్పులు జరిపిన ఘటన సమీపంలోని సీసీటీవీలో రికార్డు అయ్యింది. దీని ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దగ్గరి బంధువులే కుమార్పై కాల్పులు జరిపి హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.