మియాపూర్, జూన్ 18 : శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని వరద ముంపు నుంచి కాపాడుకునేందుకు నాలా విస్తరణ పనులను అత్యంత ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాల్సి ఉన్నదని, ఈ వ్యవస్థను మరింతగా విస్తరించేందుకు గాను చేపట్టే పనుల నిమిత్తం నిధుల మంజూరులో నియోజకవర్గానికి పెద్ద పీట వెయ్యాలని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ కోరారు. తాము ముందస్తుగా తీసుకున్న చర్యలతో గతేడాది వర్షాలకు చాలాభాగం కాపాడుకోగలిగామని మరింత పటిష్ట వ్యవస్థతో శాశ్వత పరిష్కారం చూపటమే తన లక్ష్యమన్నారు. నియోజకవర్గంలో నాలా అభివృద్ధి పనులపై బుద్ధ భవన్లో స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం(ఎస్ఎన్డీపీ) సీఈ వసంత సహా సంబంధిత అధికారులతో ప్రభుత్వ విప్ గాంధీ శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో ఉత్పన్నమవుతున్న సమస్యలను పరిగణనలోకి తీసుకునే నాలా విస్తరణ పనులకు సంబంధించిన ప్రతిపాదనలను రూపొందించాలని ఆయన కోరారు. నియోజకవర్గ స్వరూపాన్ని బట్టి నిధులలోనూ అధిక ప్రాధాన్యత కల్పించాలని తెలిపారు. గతంలో ముంపునకు గురైన దుర్గం చెరువు నెక్టర్ గార్డెన్, దీప్తిశ్రీనగర్, జనప్రియ నగర్, ధరణీనగర్, తారానగర్, రాజేంద్రనగర్, ప్రేమ్నగర్ వంటి లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని విప్ అధికారులకు సూచించారు. జీహెచ్ఎంసీ, ప్రాజెక్టు విభాగాలు సమన్వయంతో పని చేసి పనులను నాణ్యతతో సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఎస్ఎన్డీపీ ఎస్ఈ భాస్కర్రెడ్డి, వెస్ట్జోన్ ఎస్ఈ చిన్నారెడ్డి పాల్గొన్నారు.
మియాపూర్, జూన్ 18 : ప్రజారోగ్యానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతతో కృషి చేస్తున్నదని, కరోనాను ప్రాథమిక దశలోనే కట్టడి చేసేందుకు జ్వరసర్వే ఎంతో విజయవంతమైందని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని ఆర్బీఆర్ కాంప్లెక్స్లో నీమ్స్ బోరో ఫామ్స్, భానోదయ కన్సస్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో అంకురా దవాఖానా సౌజన్యంతో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ వ్యాక్సినేషన్ను కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నె శ్రీనివాసరావులతో కలిసి విప్ గాంధీ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ను చేపడుతున్నదని పేర్కొన్నారు. కాలనీ ప్రజల ఆరోగ్యం కోసం అసోసియేషన్లు ఉచిత వ్యాక్సినేషన్కు ముందుకు రావడం ఆదర్శనీయమని విప్ గాంధీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంస్థ చైర్మన్ జీవీఎన్ మురళీ కృష్ణ, ఎండీ కిశోర్, రెడ్డి రఘునాథ్రెడ్డి, శ్రీనివాస్యాదవ్, సైదేశ్వర్, రాజేందర్ పాల్గొన్నారు.