మియాపూర్, జూన్ 16 : వర్షాకాలం నేపథ్యంలో వర్షపు నీటితో పాటు మురుగునీరు ప్రవాహానికి ఆటంకాలు లేకుండా తగిన చర్యలను పకడ్బందీగా చేపట్టాలని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ కోరారు. వివేకానందనగర్లోని సప్తగిరి కాలనీలో నెలకొన్న డ్రైనేజీ సమస్యను ఏయిర్టెక్ యంత్రం ద్వారా పరిష్కరించే చర్యలను విప్ గాంధీ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి డ్రైనేజీ మ్యాన్హోల్ను పరిశీలించి వ్యర్థాలు నిండి ఉంటే తక్షణమే శుభ్రం చేయాలని, మురుగు నీరు సాఫీగా ప్రవాహం అయ్యేలా సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు. అక్కడక్కడా మ్యాన్హోల్స్ పొంగి మురుగునీరు రహదారులపైకి చేరుతూ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని, పారిశుధ్య సిబ్బంది వీటిపై నిరంతరం పక్కాగా పర్యవేక్షణ చేపట్టి తక్షణ చర్యల ద్వారా పరిష్కారం చూపాలని విప్ గాంధీ సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దొడ్ల వెంకటేశ్ గౌడ్, మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రెడ్డి రఘునాథ్రెడ్డి, పార్టీ నేతలు సైదేశ్వర్, కాశీనాథ్, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.