సిద్ధిపేట: వరిసాగులో రైతులు మూస పద్ధతికి స్వస్తి చెప్పాలని, ప్రత్యక్ష సాగువైపు నడవాలని మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. వెద సాగు పద్ధతిలో పెట్టుబడులు తగ్గడంతోపాటు నాట్లకు సన్నద్ధతగా చేయాల్సిన పనులేవీ ఉండవని చెప్పారు. జిల్లాలోని పెద్దలింగారెడ్డిపల్లిలో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా వెద సాగు పద్ధతిలో వరిని సాగుచేస్తున్న రైతు ఎల్లారెడ్డి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. వెదజల్లే విధానంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న ఎల్లారెడ్డిని అభినందించారు. వెద సాగుకు సంబంధించి రైతులతో మంత్రి చర్చించారు.
ఈ సందర్భంగా సాధారణ సాగుకు, వెద సాగుకు మధ్య సాగు ఖర్చులు ఏ విధంగా ఉంటాయి? రైతులకు ఈ పద్ధతిలో ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి? ఈ ప్రకృతి విధానంలో వెద సాగు గురించి రైతు తమ అనుభవాలను రైతులు వివరించారు.
వెద సాగు పద్ధతిని లేబర్ ఖర్చు ఇబ్బందితో మొదలు పెట్టానని పంగ ఎల్లారెడ్డి అన్నారు. కొండపలకల గ్రామం పోయి వచ్చిన. ఎకరానికి 10 కిలోల విత్తనాలు సరిపోతాయి. కలుపు కూడా 20 రోజులకు స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. దిగుబడి కూడా ఎక్కువగా వచ్చిందని ఆయన చెప్పారు.
వెదజల్లే పద్ధతిలో సాగు చేయడం ద్వారా ఎకరానికి 40 క్వింటాళ్లు దిగుబడి వచ్చిందని ఎల్లుపల్లి గ్రామ రైతు వెంకట్ రెడ్డి చెప్పారు. తాను మొత్తం ఐదెకరాల్లో పంట పండించినట్లు వివరించారు. వెద సాగు అంటేనే నారు పెంచే పని ఉండదని, నారు మడికి ఎరువు పెట్టాల్సిన అవసరం కూడా రాదన్నారు. వరి నారు తీసేందుకు కూలీల కోసం అవస్థ పడాల్సిన అవసరమూ లేదని ఎల్లారెడ్డి పేర్కొన్నారు.