చిల్లర మల్లర రాజకీయాలు చేస్తే సహించరు
రాజన్న సిరిసిల్ల జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, ఆర్బీఎస్ అధ్యక్షుడు గడ్డం నర్సయ్య
రాజన్న సిరిసిల్ల, మే 24 (నమస్తే తెలంగాణ) : రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చిన కేంద్రంపై దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన చేస్తే పట్టించుకోని బీజేపీ నాయకులు రైతుల గోస పేరిట దొంగ దీక్షలు చేస్తున్నారని రాజన్న సిరిసిల్ల జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్య విమర్శించారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమూ చేపట్టని విధంగా రైతు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేయడం మానుకోవాలని హితవుపలికారు. దమ్ముంటే రైతులు తెచ్చిన ధాన్యాన్ని యథాతథంగా కొనేలా ఎఫ్సీఐకి కేంద్రంతో ఆదేశాలిప్పించాలని డిమాండ్ చేశారు. సోమవారం జడ్పీ చైర్పర్సన్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ముందుగా రైతు వ్యతిరేక చట్టాన్ని రద్దు చేసేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సవాల్ విసిరారు. తేమశాతం, తాలు తీసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్న ఎఫ్సీఐ నిబంధనల మేరకే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తున్నదన్న ఇంగిత జ్ఞానం బీజేపీ నేతలకు లేదా? అని ప్రశ్నించారు. గోదావరి జలాలతోపాటు సమృద్ధిగా కురిసిన వర్షాలతో పంటలు బాగా పండి దిగుబడి రెండింతలు వచ్చిందని తెలిపారు. జిల్లాలో లక్షా 67వేల 163 ఎకరాల్లో 84 వేల 634 మంది రైతులు వరి పండిస్తే, 3.50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారని, 236 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 24వేల 436 మంది రైతుల నుంచి రూ.200ల కోట్ల విలువైన లక్షా 76 వేల 648 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు.
ఇప్పటి వరకు 60శాతం కొనుగోలు చేశామని, వచ్చే నెల 10 వరకు లక్ష్యాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. దేశంలో ఏరాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని విధంగా 24 గంటల ఉచిత కరెంటు, పంట పెట్టబడి సాయం, రైతుబీమా, సకాలంలో ఎరువులు, విత్తనాలు ఇస్తూ వ్యవసాయ రాష్ట్రంగా అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కారును చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. హమాలీలు, రైస్మిల్లుల యజమానులు కరోనా బారిన పడ్డప్పటికీ కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు చేరవేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో నిల్వ చేసేందుకు స్థలం లేక పోతే మంత్రి కేటీఆర్ చొరవ తీసుకుని 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇతర జిల్లాల రైస్మిల్లులకు తరలించినట్లు చెప్పారు. రైతుకు మేలు చేసేలా సలహాలు, సూచనలు చేయాలే కాని పక్కదోవ పట్టించే విధంగా చిల్లర మల్లర రాజకీయాలు చేస్తే ప్రజలు సహించరని హితవుపలికారు. సమావేశంలో టీఆర్ఎస్ కోనరావుపేట మండలాధ్యక్షుడు న్యాలకొండ రాఘవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.