వాషింగ్టన్ : అమెరికాలో మళ్లీ కాల్పులు కలకలం సృష్టించాయి. న్యూజెర్సీలో శనివారం రాత్రి జరిగిన పుట్టిన రోజు వేడుకలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు మృతి చెందగా.. 12 మంది గాయపడ్డారు. శనివారం రాత్రి 11.50 గంటల ప్రాంతంలో ఫెయిర్ ఫీల్డ్ టౌన్షిప్లో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. కాల్పులతో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారని తెలిపారు. మరో 12 మంది గాయపడగా.. ఆసుపత్రి తరలించగా చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. అయితే, నిందితుడిని ఆచూకీ తెలియలేదని, కాల్పులకు కారణాలు సైతం తెలియరాలేదని పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాల్పుల ఘటనపై న్యూజెర్సీ గవర్నర్ ఫిల్ మర్ఫీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారని పేర్కొన్నారు.