సిద్దిపేట కలెక్టరేట్, మే 5 : ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి వివరాలు వెంటవెంటనే ఆన్లైన్లో నమోదు చేయాలని, అలాగే రైతుల ఖాతాల్లో 24 గంటల్లో డబ్బులు జమ చేసేందుకు అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు సూచించారు. బుధవారం సిద్దిపేట కలెక్టరేట్ నుంచి కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి, అదనపు కలెక్టర్ ముజామ్మిల్ఖాన్తో కలిసి అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. కరోనా వేళ రైతులు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఊరూరా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. మిల్లులో ధాన్యం అందించిన వెంటనే ట్యాబ్లో ఏంట్రీ పూర్తి చేయాలని నిర్వాహకులకు సూచించారు. రానున్న 15 రోజుల్లో కొనుగోలు కేంద్రాలకు అధిక మొత్తంలో ధాన్యం వచ్చే అవకాశం ఉందని, ఆ మేరకు కేంద్రాల బాధ్యులు, నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
నిత్యం కొనుగోలు కేంద్రాల్లో పర్యటిస్తూ టార్పాలిన్, గన్నీ బ్యాగుల కొరత తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బంది తలెత్తినా.. ఆయా కేంద్రం అధికారిదే పూర్తి బాధ్యత అని స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లాలోని 51 మిల్లుల యజమానులతో సమన్వయం చేసుకుంటూ, రైతుల నుంచి సేకరించిన ధాన్యం వెంటనే మిల్లులకు తరలించి, వెంటనే ఆన్లోడింగ్ వేగంగా చేయాలని సూచించారు. వడగండ్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్న దృష్ట్యా ధాన్యం తడవకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 407 కొనుగోలు కేంద్రాల ద్వారా నిత్యం ధాన్యం సేకరిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ సారి జిల్లాలో పుష్కలంగా వరిపంట పండిందన్నారు. ఈ సారి 5.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అంచనా వేసి, ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. అన్నదాతల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇప్పటివరకు 40వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించిన్నట్లు తెలిపారు.
ప్రభుత్వానికి చెడ్డపేరు తేవొద్దు..
ధాన్యం కొనుగోలు విషయంలో క్షేత్రస్థాయి నుంచి అధికారులంతా బాధ్యతగా వ్యవహరించాలని మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే అధికారులు ట్యాబ్ ఎంట్రీ వెంటనే చేయలేకపోవడంతో రైతులకు నిర్దేశిత సమయంలో డబ్బులు వారి ఖాతాల్లో జమ చేయలేక పోతున్నామని, దీని ద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు. సిద్దిపేట జిల్లాలో 34 గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి ధాన్యం సేకరించినప్పటికీ, ఇప్పటివరకు ట్యాబ్ ఏంట్రీ చేయలేదన్నారు. రోజువారీగా ఈ ప్రక్రియ చేయాలని వారికి సూచించారు.