హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని గాంధీ దవాఖాన సహా నిమ్స్, సరోజినీదేవి, ఛాతి, ఫివర్, టిమ్స్, కింగ్కోఠి, మలక్పేట, గోల్కొండ వనస్థలిపురం, కొండాపూర్ దవాఖానల్లో కొవిడ్ పడకల సంఖ్యను పెంచాలని అధికారులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఆదేశించారు. సోమవారం బీఆర్కేభవన్లో సీనియర్ ఐఏఎస్ అధికారులు, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లు, జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ప్రభుత్వ దవాఖానల సూపరింటెండెంట్లతో కొవిడ్ నియంత్రణపై సీఎస్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని పీహెచ్సీలు, బస్తీ దవాఖానలు, ఇతర ఆరోగ్యకేంద్రాల్లో కొవిడ్ అవుట్ పేషెంట్ క్లినిక్లను నిర్వహించాలని చెప్పారు. కరోనాను అధిగమించేందుకు అధికారులంతా అంకితభావంతో పనిచేయాలని, మున్సిపల్ సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లతో ఏర్పడిన బృందాలను ప్రతి ఇంటికి పంపించి కొవిడ్ బాధితులకు మెడికల్ కిట్లు అందించాలని తెలిపారు. అన్ని దవాఖానల్లో పరిశుభ్రత డ్రైవ్ చేపట్టాలని అన్నారు. సమావేశంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి రిజ్వీ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, పురపాలకశాఖ కమిషనర్ డాక్టర్ యన్ సత్యనారాయణ, ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్రాస్, ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఒమర్ జలీల్, పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి కెఎస్ శ్రీనివాసరాజు, టీఎస్ఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.