ముంబై : కరోనా కట్టడికి విధించే లాక్డౌన్ ను ఉల్లంఘించే వారికి ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించాలని బాంబే హైకోర్ట్ ఔరంగాబాద్ బెంచ్ స్పష్టం చేసింది. లాక్డౌన్ సడలింపు సమయం అనంతరం ఇండ్ల నుంచి బయటకి వచ్చే వారిపై ఇలాంటి చర్యలు తప్పవని పేర్కొంది. నడకతో పాటు ఏ రకమైన వాహనంలోనైనా బయట తిరిగే వారు తమ ఆధార్ కార్డులను దగ్గర ఉంచుకోవాలని కోర్టు తెలిపింది.
ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే ట్రాఫిక్ పోలీసులు వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పేర్కొంది. జస్టిస్ రవీంద్ర గుగే, జస్టిస్ బీయూ దెబద్వార్ లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. వైద్యులు, వైద్యారోగ్య, పారామెడికల్ సిబ్బంది సైతం ఆధార్ కార్డులను కలిగిఉండాలని కోరింది. ఈ నిబంధనలను పాటించని వారికి తక్షణమే ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.