బెంగళూరు: కరోనా సెకండ్ వేవ్తో పోరాడుతున్న ఇండియాకు సాయం చేయడానికి అమెజాన్ ఇండియా ముందుకు వచ్చింది. ఏసీటీ గ్రాంట్స్, టెమాసెక్ ఫౌండేషన్ పుణె ప్లాట్ఫామ్ ఫర్ కొవిడ్-19 రెస్పాన్స్లతో చేతులు కలిపి అత్యవసరంగా సింగపూర్ నుంచి 8 వేల ఆక్సిజన్ కాన్సెన్ట్రేటర్లను తీసుకొస్తోంది. మరో 500 బై-లెవెల్ పాజిటివ్ ఎయిర్వే ప్రెజర్ (బైపాప్) మెషీన్లు కూడా వీటితోపాటే రానున్నాయి. ఈ సంస్థలన్నీ ఆ దిశగా భారత ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నాయి. సాధ్యమైనంత త్వరగా వీటిని ఇండియాకు తీసుకురానున్నారు.
వీటిని దేశవ్యాప్తంగా ఉన్న ఆయా కొవిడ్ హాస్పిటల్స్కు డొనేట్ చేయనున్నారు. ఈ మెషీన్లను ఇండియాకు తీసుకురావడానికి అయ్యే విమాన ఖర్చులను మొత్తం అమెజాన్ ఇండియా భరించనుంది. ఎయిరిండియాతోపాటు ఇతర విమాన సర్వీసుల్లో ఇవి ఇండియాకు రానున్నాయి. ఈ మెషీన్లను ఏసీటీ గ్రాంట్స్, పీపీసీఆర్, ఇతర సంస్థలు కలిసి కొనుగోలు చేశాయి. అవి ఇండియాకు వచ్చిన తర్వాత వాటిని ఆయా హాస్పిటల్స్కు తరలించే బాధ్యత కూడా అమెజాన్ ఇండియా తీసుకోవడం విశేషం. వీటిలో తొలి కన్సైన్మెంట్ ఇప్పటికే ముంబైలో ల్యాండైంది. ఈ నెల 30 కల్లా మొత్తం ఇండియాకు రానున్నాయి.
కొవిడ్ వల్ల ఇండియా ఊహించని రీతిలో ప్రభావితమైంది. ఈ కష్ట సమయంలో మేము దేశానికి అండగా ఉంటాము. అందులో భాగంగానే ఆక్సిజన్ కాన్సెన్ట్రేటర్లను సింగపూర్ నుంచి ఎయిర్లిఫ్ట్ చేయనున్నామని అమెజాన్ ఇండియా గ్లోబల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ అగర్వాల్ చెప్పారు. ఇవి కాకుండా మరో 1500 ఆక్సిజన్ కాన్సెన్ట్రేటర్లను అమెజాన్ ఇండియా సమీకరించి ఆయా హాస్పిటల్స్కు డొనేట్ చేయనుంది.