హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): కొవిడ్ పాజిటివ్ వచ్చినవారిలో ఎక్కువమంది హోం ఐసొలేషన్లో ఉంటూ.. చికిత్సపై అవగాహన లేకపోవడంతో శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. అలాంటివారు చివరి నిమిషంలో దవాఖానకు వస్తున్నారని.. దీనిని నివారించేందుకు హోం ఐసొలేషన్లో ఉన్న ప్రతిఒక్కరికీ ఆశా వర్కర్లు రోజుకు రెండుసార్లు ఆక్సిజన్ లెవల్స్, జ్వర పరీక్షలు చేయాలని సూచించారు. హోం ఐసొలేషన్ అవకాశం లేనివారి కోసం ప్రభుత్వం ఆధ్వర్యంలో ఐసొలేషన్ సెంటర్లు ఏర్పాటుచేసినట్టు తెలిపారు. జిల్లాల వైద్యాధికారులు, వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో ఆదివారం మంత్రి ఈటల టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా సెకండ్ వేవ్లో ఒక్కరికి వస్తే వారి కుటుంబసభ్యులందరికీ వ్యాప్తి చెందుతున్నదని తెలిపారు. ఈ పరిస్థితిని నివారించేందుకు ప్రభుత్వ ఐసొలేషన్ కేంద్రాలు ఏర్పాటుచేశామని చెప్పారు. లక్షణాలు ఉన్నవారు ఏ ప్రాంతం నుంచి వచ్చినా పరీక్షలు చేయాలని సూచించారు. ప్రైవేటులో పరీక్షలు చేయించుకొని పాజిటివ్ వచ్చిన వారందరి వివరాలను సైతం వైద్యారోగ్యశాఖకు తెలియజేయాలని.. వారందరికీ హోం ఐసొలేషన్ కిట్స్ అందజేయాలని ఆదేశించారు. టెలిమెడిసిన్ ద్వారా అనుమానాలు నివృత్తి చేయాలని, ఐఎంఏ వారు సైతం ఇందుకోసం ముందుకొచ్చారని తెలిపారు.
ప్రైవేటు దవాఖానల చికిత్స పర్యవేక్షణ
ప్రైవేటు దవాఖానల్లో చికిత్సను నిరంతరం పరవేక్షిస్తూ.. ఆక్సిజన్ అవసరమైతే అందించాలని మంత్రి ఈటల అధికారులకు సూచించారు. వారం రోజులుగా కేసుల పెరుగుదల తీవ్రత తగ్గిందని, వ్యాప్తి కూడా తగ్గుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. వైద్యారోగ్యశాఖకు ఏం అవసరం ఉన్నా వెంటనే సమకూర్చుకోవాలని.. వైద్యులు, సిబ్బంది అవసరం ఉంటే నియమించుకోవాలని మరోసారి ఆదేశించారు. వైద్యాధికారులకు వెహికల్ అలవెన్స్ అందేలా చూడాలని ఉన్నతాధికారులకు సూచించారు. కరోనా లక్షణాలు ఉంటే నిర్ధారణ పరీక్షలతో సంబంధం లేకుండా చికిత్స మొదలుపెట్టాలని అన్నారు. అర్బన్ పీహెచ్సీ, బస్తీ దవాఖానలు, జీహెచ్ఎంసీ ఏరియాలో ఏఎన్ఎం, ఆశావర్కర్లు ఎక్కువమందిని నియమించుకోవాలని ఆదేశించారు. అనంతరం జిల్లా అధికారులతో స్థానికంగా పరిస్థితులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. వైద్యారోగ్యశాఖ కార్యదర్శి ఎస్ఎం రిజ్వీ మాట్లాడుతూ.. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. టెస్టింగ్, ట్రాకింగ్, ట్రీటింగ్ విధానంతో ముందుకెళుతున్నామని చెపపారు. సమావేశంలో కుటుంబ సంక్షేమ కమిషనర్, ఎన్హెచ్ఎం డైరెక్టర్ వాకాటి కరుణ, వైద్యారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.