సిద్దిపేట : ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని ఆదరించి.. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించాలని ఆర్థిక మంత్రి హరీష్ రావు సిద్దిపేట ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సిద్దిపేట మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో 15, 31 వార్డు అభ్యర్థులు పాతూరి సులోచనా శ్రీనివాస్ రెడ్డి, జంగిటి కనకరాజులకు మద్దతుగా హరీష్ రావు శనివారం ఉదయం ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ఆకలైనప్పుడు అన్నం పెట్టేటోడు కావాలా.. ఎన్నికలప్పుడు వచ్చి ఓట్లు అడిగే ఇతర పార్టీలు కావాలా? అని అడిగారు. మహిళల కోసం భవనాలు కట్టించాం. ఒకనాడు నీళ్లు దొరకని సిద్దిపేటలో ఇప్పుడు ఇంటింటికీ మంచినీరు అందిస్తున్నామని తెలిపారు. రూ. 270 కోట్లతో సిద్దిపేటను అద్భుతంగా అభివృద్ధి చేసుకున్నామని చెప్పారు. సిద్దిపేట ప్రజల ప్రతి అవసరాన్ని ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ వస్తున్నామని స్పష్టం చేశారు. సిద్దిపేటను శుద్దిపేటగా మార్చుకున్నామని మంత్రి తెలిపారు.
ఆస్పత్రికి వచ్చే తల్లీబిడ్డకు వేడివేడి అన్నం పెడుతున్నామని పేర్కొన్నారు. ఎర్ర చెరువును అద్దంలా తీర్చిదిద్దాం. కళ్యాణలక్ష్మి, సీఎం సహాయ నిధి తో ఎంతోమందిని ఆదుకున్నామని తెలిపారు. సిద్దిపేట టీఆర్ఎస్కు అడ్డా కావాలి. తనకు కొండంత ధైర్యం ఉండాలంటే టీఆర్ఎస్ అభ్యర్థికి అండగా మీరు నిలవాలి. విడిపోతే నష్టపోతాం.. కలిసి ఉంటే అభివృద్ధి సాధిస్తాం. ఇక మిగిలింది ఉద్యోగ కల్పన జరగాలి. ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నాం. ఏడాది వరకు సిద్దిపేటకు రైలు రాబోతుంది అని మంత్రి హరీష్ రావు తెలిపారు.