ఎల్లారెడ్డిపేట/సిరిసిల్ల తెలంగాణచౌక్/ మంథనిటౌన్/ బోయినపల్లి, ఏప్రిల్ 22 : కంటికి కనిపించని వైరస్ కారణంగా కుదేలవని రంగమంటూ ఏదీ లేదు. ఏడాదికి పైగా ఉద్యోగ, ఉపాధి రంగాలపై ఆధారపడ్డ వారి బతుకులను చిన్నాభిన్నం చేస్తున్నది. ఇక ప్రైవేటు విద్యా సంస్థల్లో పని చేసే ఉపాధ్యాయులు, సిబ్బంది పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పాఠశాలలు మూతపడడంతో ఏ పని చేయాలో తెలియని దుస్థితులు ఎదురయ్యాయి. వారి ఇబ్బందులను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించి ఆదుకునేందుకు ముందుకు వచ్చింది. ఆ మేరకు సంబంధిత పాఠశాలల్లో పనిచేసే సిబ్బందికి, ఉపాధ్యాయులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. దీంతో పాఠశాలల యాజమాన్యాలు జాబితాలను జిల్లా విద్యాధికారులకు సమర్పించగా, వాటిని పరిశీలించిన అధికారులు తొలి విడుత జాబితాను తయారు చేసి, ప్రభుత్వానికి పంపించారు. ఈ మేరకు మూడు రోజుల క్రితమే వారి బ్యాంకు ఖాతాల్లోకి 2 వేల చొప్పన నగదు విడుదల చేయగా, బుధవారం 25 కిలోల బియ్యం పంపిణీని ప్రారంభించింది. గురువారం కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పంపిణీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో 58 మందికి చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ బియ్యం పంపిణీ చేశారు.
కరోనా సమయంలో ప్రైవేటు టీచర్లు, సిబ్బంది అర్ధాకలితో బాధపడవద్దని రాష్ట్ర ప్రభుత్వం బియ్యం పంపిణీ చేస్తున్నదని చెప్పారు. ఇల్లంతకుంట మండలంలో 35 మంది ప్రైవేటు ఉపాధ్యాయులు, సిబ్బందికి మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఒక్కొక్కరికి 25 కిలో బియ్యంతో పాటు 2 వేల విలువైన చెక్కులను అందించారు. ఉద్యోగం పోయి రోడ్డున పడకుండా ఉండేందుకు సీఎం కేసీఆర్ ఈ సాయం చేస్తున్నట్లు తెలిపారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని విద్యానగర్లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ కలెక్టర్ కృష్ణభాస్కర్, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళతో కలిసి ప్రారంభించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని కృష్ణానగర్లో ప్రైవేటు ఉపాధ్యాయులకు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ బియ్యం పంపిణీ చేశారు. పెద్దపల్లి జిల్లాలో కాల్వశ్రీరాంపూర్లో కలెక్టర్ సంగీత సత్యనారాయణ, మంథని పట్టణంలోని సుభాష్నగర్లో జడ్పీ చైర్మన్ పుట్ట మధు, మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ బియ్యం అందించారు. తెలంగాణలో ఏ ఒక్కరికీ ఆకలి బాధ ఉండకూడదనే ఉద్దేశ్యంతోనే సంక్షోభంలోనూ సాయమందిస్తున్న గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అని పుట్ట మధు కొనియాడారు.
ఇవి కూడా చదవండి
తాజ్ హోటల్ సెట్ కోసం ఎందరు పనిచేశారో తెలుసా..?
అటవీశాఖ సిబ్బందికి వ్యాక్సిన్ కేంద్రం ఏర్పాటు