కోవిడ్ రూల్స్ ని ఏమాత్రం పట్టించుకోకుండా తరతరాలుగా వస్తోన్నసాంప్రదాయాన్నికర్నూలు జిల్లా వాసులు కొనసాగించారు. ఎప్పటిలాగానే ఈసారి కూడా పిడకల సమరాన్ని ఆనందంగా జరుపుకున్నారు. ఆస్పరి మండలం కైరుప్పల గ్రామంలో ఉగాది తరువాత రోజు జరిగిన పిడకల సమరానికి పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. గ్రామస్తులు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు పిడకలు విసురుకున్నారు. ఆచారం ప్రకారం ఈ పిడకల సమరానికి ముందు కారుముంచి గ్రామానికి చెందిన రాజ వంశస్థులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామానికి బయలుదేరగానే.. స్వామి, అమ్మవారి వర్గీయులుగా విడిపోయిన జనం పిడకల రాసులపై పడ్డారు.
వీరభద్ర స్వామి, కాళికాంబ ప్రేమ వివాహంలో ఇరు వర్గాల మధ్య విభేదాలు చోటుచేసుకుని ఘర్షణ పడినట్లు పురాణ కథనం. దానికి ప్రతీకగా కైరుప్పలలో పిడకల సంబరాన్ని ఏటా నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే కోవిడ్ సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్నాకానీ ఇవేమీ పట్టించుకోకుండా జనం ఈ పిడకల సమరంలో పాల్గొనడం విశేషం. మాస్క్ లు పెట్టుకోమని, డిస్టెన్స్ మెయిన్ టేన్ చేయమని ప్రజలకు ఎంత అవగాహన కల్పించినా అవేమీ పట్టించుకోవడం లేదనడానికి ఇదే నిదర్శనం. గతేడాది కోవిడ్ కేసులతో కర్నూలుజిల్లా వణికిపోయింది.