న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ నందిగ్రామ్ బీజేపీ అభ్యర్థి సువేందు అధికారికి ఎన్నికల కమిషన్ నోటీసు జారీ చేసింది. 24 గంటల్లో నోటీసుపై సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. సీపీఐ (ఎంఎల్) సెంట్రల్ కమిటీ నేత కవితా కృష్ణన్ ఫిర్యాదు మేరకు ఈసీ నోటీసు ఇచ్చింది. ఆయనకు ఈసీ నోటీసు ఇవ్వడం ఇది రెండోసారి. నందిగ్రామ్లో మార్చి 29న జరిగిన బహిరంగ సభలో సువేందు అధికారి ‘ద్వేషపూరిత ప్రసంగం’ చేశారని సీపీఐ నేత ఆరోపించారు. తన ప్రసంగంలో ‘బేగం’ అని ప్రస్తావించారని, అలాగే తన ప్రత్యర్థికి ఓటు వేస్తే ‘మినీ పాకిస్థాన్’కు ఓటు వేయడమేననని, భారతీయ పురాణాల్లోని ‘తామర’ గురించి సైతం ప్రస్తావిస్తూ.. ‘తామర పువ్వు గుర్తుకు ఓటేయండి’ అన్నట్లు నోటీసుల్లో ఈసీ పేర్కొంది. ఈ మేరకు 24 గంటల్లో సమాధానం ఇవ్వాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది.
294 అసెంబ్లీ స్థానాలున్న పశ్చిమ బెంగాల్కు ఎనిమిది విడుతల్లో ఎన్నికలు జరుగుతున్న విషయంలో తెలిసిందే. ఇప్పటికే మూడు విడతల పోలింగ్ పూర్తయింది. అధికార టీఎంసీ, విపక్ష బీజేపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. దీంతో ఇరుపార్టీల ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ తరఫున నందిగ్రామ్ నుంచి పోటీ చేసిన సువేందు అధికారి ఈ సారి బీజేపీ గూటికి చేరారు. ఈ సారి సీఎం మమతా బెనర్జీ సైతం తాను ఎప్పుడూ భవానీపూర్ అసెంబ్లీ స్థానాన్ని వీడి నందిగ్రామ్ నుంచే పోటీ చేస్తున్నారు. దీంతో ఇరు పార్టీల మధ్య పోరు తీవ్రంగా ఉంది. ఈ నెల 1న రెండో విడతలో ఎన్నికలు జరగ్గా.. మే 2న పోలింగ్ జరుగనుంది.