న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా (సీజేఐ) తెలుగువారైన జస్టిస్ నూతలపాటి వెంకట రమణ (జస్టిస్ ఎన్వీ రమణ) నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎస్ఏ బోబ్డే ఈ నెల 23న పదవీ విరమణ చేయనున్నారు. 24న భారత 48వ సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణం చేయనున్నారు. 2022 ఆగస్టు 26 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. రాష్ట్రపతి సంతకంతో కూడిన నియామక పత్రాన్ని సంప్రదాయం ప్రకారం ప్రధాని ముఖ్యకార్యదర్శి పీకే శర్మ, న్యాయశాఖ కార్యదర్శి బారున్ మిత్రా మంగళవారం ఉదయం జస్టిస్ రమణకు అందజేశారు. తదుపరి సీజేఐగా సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ అయిన జస్టిస్ రమణ పేరును జస్టిస్ బోబ్డే ఇటీవల కేంద్రప్రభుత్వానికి సిఫార్సు చేశారు. కేంద్ర న్యాయశాఖ దీనిని రాష్ట్రపతికి పంపగా.. ఆయన తాజాగా ఆమోదముద్ర వేశారు. సుప్రీంకోర్టు సీజేఐగా నియమితులైన రెండో తెలుగు వ్యక్తి జస్టిస్ రమణ. ఇంతకుముందు జస్టిస్ కోకా సుబ్బారావు 1966 జూన్ 30 నుంచి 1967 ఏప్రిల్ 11 వరకు సీజేఐగా వ్యవహరించారు.
ఏపీలోని కృష్ణా జిల్లా పొన్నవరంలో ఒక వ్యవసాయ కుటుంబంలో నూతలపాటి వెంకట రమణ 1957 ఆగస్టు 27న జన్మించారు. తండ్రి గణపతిరావు. తల్లి సరోజిని. కంచికచర్లలో ఉన్నత పాఠశాల విద్యాభ్యాసం చేశారు. అమరావతిలోని ఆర్వీవీఎన్ కళాశాలలో బీఎస్సీ చదివారు. 1982లో నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్ర పట్టా అందుకున్నారు. 1983 ఫిబ్రవరి 10న న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. న్యాయవాదిగా సేవలందించారు. 2000 జూన్ 27న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2013 మార్చి 10 నుంచి మే 20 వరకు ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. 2013 సెప్టెంబర్ 2న ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2014 ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
ఇవి కూడా చదవండి..
మధ్యవర్తులను ప్రకటిస్తే జవాన్ను అప్పగిస్తాం
బీజేపీ ఎంపీని ఘెరావ్ చేసిన రైతులు
పంజాబ్ నుంచి యూపీకి గ్యాంగ్స్టర్ తరలింపు
మీలాగే.. మేం హిందువులకు పిలుపునిస్తే..
పోలింగ్ ప్రశాంతం.. తీర్పు నిక్షిప్తం