స్టాక్ మార్కెట్లలో మదుపరుల సంపద ఆవిరి
సెన్సెక్స్ 870, నిఫ్టీ 229 పాయింట్లు పతనం
ముంబై, ఏప్రిల్ 5: మదుపరుల్లో మళ్లీ కరోనా భయాలు నెలకొన్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రగతిపై దిగులు పట్టుకున్నది. దీంతో స్టాక్ మార్కెట్లు భీకర నష్టాల్లోకి జారుకున్నాయి. ఒక్కరోజే లక్షల కోట్ల రూపాయల సంపద కరిగిపోయింది. ఇది.. సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్ల తీరుతెన్నులు. దేశంలో మరోసారి విజృంభిస్తున్న మహమ్మారి.. మార్కెట్లను కుప్పకూల్చింది. రోజుకు లక్ష దాటిన కేసులు.. పెద్ద ఎత్తున పెట్టుబడుల ఉపసంహరణకు దారితీశాయి. ఫలితంగా బాంబే స్టాక్ ఎక్సేంజ్ సూచీ సెన్సెక్స్ 870.51 పాయింట్లు లేదా 1.74 శాతం కోల్పోయి 49,159.32 వద్ద ముగిసింది. ఒకానొక దశలో 1,449.03 పాయింట్లు దిగజారింది. అయితే మళ్లీ 580 పాయింట్ల వరకు కోలుకున్నది. అయినప్పటికీ మదుపరుల సంపద రూ.2 లక్షల 16,566.52 కోట్లు హరించుకుపోయింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈలో నమోదైన సంస్థల మార్కెట్ విలువ రూ.2,05,09,835.27 కోట్లకు పరిమితమైంది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ సైతం 229.55 పాయింట్లు లేదా 1.54 శాతం పడిపోయి 14,637.80 వద్ద స్థిరపడింది. మరోవైపు డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ సోమవారం ట్రేడింగ్లో 18 పైసలు క్షీణించి 73.30కు పరిమితమైంది.
మరిన్ని వార్తలు చదవండి..
హైదరాబాద్లో ఇండ్లకు భలే గిరాకీ
మొబైల్ వ్యాపారానికి ఎల్జీ గుడ్బై