మహేష్ బాబు కుర్రహీరోలను కట్టి పడేయడం ఏంటి అనుకుంటున్నారా..? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. సినిమాలు, యాడ్స్లో నటిస్తూ బిజీగా ఉండటమే కాకుండా థియేటర్ బిజినెస్లోనూ మహేష్ రాణిస్తున్నాడు. నటుడిగా, బిజినెస్మ్యాన్గా దూసుకుపోతున్న మహేష్.. ఇప్పుడు నిర్మాతగా కూడా సత్తా చూపించాలని ఫిక్స్ అయిపోయాడు. ఇప్పటికే కొన్ని సినిమాలు నిర్మించాడు సూపర్స్టార్. కాకపోతే అందులో తానే హీరోగా నటించాడు. బ్రహ్మోత్సవం, శ్రీమంతుడు, సరిలేరు నీకెవ్వరు లాంటి సినిమాల నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నాడు మహేష్ బాబు. అయితే ఇప్పుడు ఇతర హీరోలతోనూ వరుస సినిమాలను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నాడు.
ఘట్టమనేని మహేష్ బాబు ప్రొడక్షన్లో ఇప్పుడు మేజర్ సినిమా వస్తుంది. అడవి శేష్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. పాన్ ఇండియన్ సబ్జెక్టుతో ఈ సినిమాను తీసుకొస్తున్నాడు అడవి శేష్. 2008 ఉగ్రవాదుల దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన మేజర్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా వస్తుంది.
ఇదిలా ఉంటే మేజర్ సినిమాతో పాటు విజయ్ దేవరకొండ హీరోగా ఒక సినిమా నిర్మించాలని చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నాడు మహేష్ బాబు. దీనికోసం కథ చర్చలు కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతం విజయ్ కమిట్ అయిన సినిమాలు పూర్తి కాగానే మహేష్ బాబు ప్రొడక్షన్లో కొత్త సినిమా మొదలు కానుంది. ఈ నిర్మాణ సంస్థ పనులన్నీ నమ్రత శిరోద్కర్ దగ్గరుండి చూసుకుంటోంది.
తాజాగా మరో హీరో కూడా మహేష్ బాబు నిర్మాణ సంస్థలో పని చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతి రత్నాలు వంటి సూపర్ డూపర్ హిట్లతో మంచి జోరు మీద ఉన్న నవీన్ పొలిశెట్టి హీరోగా చలో, భీష్మ లాంటి సక్సెస్ఫుల్ సినిమాలు తెరకెక్కించిన వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమాను మహేష్ నిర్మించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి మహేష్ కోసం ఓ కథ సిద్ధం చేశాడు వెంకీ. దానికంటే ముందు నవీన్- వెంకీ కుడుముల సినిమా పట్టాలెక్కడం ఖాయంగా కనిపిస్తుంది. ఏదేమైనా కూడా టాలెంట్ ఉన్న యంగ్ హీరోలను తన నిర్మాణ సంస్థలో ప్రోత్సహిస్తున్నాడు మహేష్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి