బెజ్జంకి, మార్చి 28: ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. మండలంలోని మూడు గ్రామాల్లో ఇండ్ల నిర్మాణం పూర్తి కావడంతో పేదల సొంతింటి కల త్వరలోనే నెరవేరనున్నది. మండలంలో మొదటి విడతలో 40, రెండో విడతలో 215 ఇండ్లు మంజూరయ్యాయి. బెజ్జంకి, తోటపల్లి, చీలాపూర్ గ్రామాల్లో ఇండ్ల నిర్మాణం పూర్తికావడంతో వాటిని అర్హులకు అందించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. బెజ్జంకిలో 40 ఇండ్లకు 386 మంది దరఖాస్తు చేసుకున్నారు. విచారణ చేయగా 44 మంది అర్హులని తేల్చారు. తోటపల్లిలో 30 ఇండ్లకు 163 మంది దరఖాస్తు చేసుకోగా, 32 మంది అర్హులని, చీలాపూర్లో 20 ఇండ్లకు 118 మంది దరఖాస్తు చేసుకోగా, 22మంది అర్హులని అధికారులు గుర్తించారు. అధికారులు గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించారు. వాటిపై క్షుణంగా విచారణ చేపట్టారు. తుది జాబితాను అధికారులు రూపొందించారు. ఆ జాబితాను మరోమారు గ్రామపంచాయతీల్లో గ్రామసభ నిర్వహించి, జాబితాను గ్రామస్తులకు అందుబాటులో ఉంచారు. వాటిపై సైతం అభ్యంతరాలుంటే తెలియజేయాలని అధికారులు కోరారు. కొంతమందిపై వచ్చిన ఫిర్యాదులపై సైతం విచారణ చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. గ్రామంలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు చివరి దశకు చేరుకుని అందించేందుకు సిద్ధంగా ఉండటంతో పేదలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
వేసవిలో వచ్చే గ్యాస్ సమస్యలకు ఇలా చెక్ పెట్టండి..!