మినీ ఎన్నికల సంగ్రామానికి నాంది
పశ్చిమబెంగాల్, అస్సాంలో నేడు తొలిదశ
బెంగాల్లో 30, అస్సాంలో 47 స్థానాలకు పోలింగ్
బెంగాల్లో టీఎంసీ-బీజేపీ ముఖాముఖి పోరు
అస్సాంలో బీజేపీ- కాంగ్రెస్ కూటముల హోరాహోరీ
న్యూఢిల్లీ, మార్చి 26: మినీ ఎన్నికల సంగ్రామానికి నేడే ప్రారంభం. పశ్చిమబెంగాల్, అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీల ఎన్నికల్లో తొలుత పశ్చిమబెంగాల్, అస్సాం శాసనసభల ఎన్నికల తొలిదశ పోలింగ్ శనివారం జరుగనున్నది. పశ్చిమబెంగాల్లో 30 స్థానాలకు, అస్సాంలో 47 స్థానాలకు తొలిదశలో పోలింగ్ నిర్వహిస్తున్నారు. బెంగాల్లో తొలిదశ పోలింగ్ కోసం 7,061 పోలింగ్ స్టేషన్లు, 10,288 పోలింగ్ బూత్లు ఏర్పాటుచేశారు. 73,80,942 మంది ఓటర్లు ఓటు వేయనున్నారు. అస్సాంలో 1,917 పోలింగ్ కేంద్రాల్లో 11,537 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. 81.09 లక్షల మంది ఓటేయనున్నారు.
జంగల్మహల్లో ఎన్నికల రణరంగం
ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న రాష్ర్టాలన్నింటిలోకి యావత్ దేశాన్ని ఆకర్షిస్తున్న రాష్ట్రం పశ్చిమబెంగాల్. 294 అసెంబ్లీ స్థానాలున్న బెంగాల్లో ఏకంగా 8 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొదటి దశలో 30 స్థానాలకు శనివారం పోలింగ్ జరుగనున్నది. వీటిలో అత్యధికం ఒకప్పుడు మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న జంగల్మహల్ ప్రాంతంలోనివే. దాదాపు 74 లక్షలమంది ఓటర్లు 191 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. మొదటి దశలో టీఎంసీ, బీజేపీలు 29 స్థానాల చొప్పున తమ అభ్యర్థులను పోటీలో నిలిపాయి. మరో స్థానంలో వాటి మిత్రపక్షాలు బరిలో ఉన్నాయి. కాంగ్రెస్-వామపక్ష కూటమి 30 స్థానాల్లో పోటీ చేస్తున్నది. ఎన్నికల ప్రచారంలోనే టీఎంసీ, బీజేపీ కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకొని హింసకు పాల్పడటంతో ఎన్నికల విధులకు వేలమంది కేంద్ర బలగాలను మోహరించారు. సీఎం మమతాబెనర్జీకి ఎదురుతిరిగి బీజేపీలో చేరిన సువేందు అధికారికి పట్టున్న పుర్బా మేదినీపూర్ ప్రాంతంలోని ఏడు సీట్లకు కూడా ఈ తొలిదశలోనే ఎన్నికలు జరుగుతున్నాయి.
అస్సాంలో ప్రముఖుల పోరాటం
అస్సాంలో మొదటి విడతలో పోటీపడుతున్న అభ్యర్థుల్లో ఎక్కువగా ప్రముఖులే ఉన్నారు. సీఎం సర్బానంద్ సోనోవాల్, అసెంబ్లీ స్పీకర్ హితేంద్రనాత్ గోస్వామి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రిపున్బోరా, పలువురు మంత్రులు మొదటి దశలో తలపడుతున్నారు. రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 126 సీట్లుండగా మూడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొదటి దశలో పోలింగ్ జరుగుతున్న 47 స్థానాల్లో 23 మంది మహిళలు సహా మొత్తం 264 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో అధికార బీజేపీ-అస్సాం గణపరిషత్, కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి, కొత్తగా ఏర్పాటైన అస్సాం జతియా పరిషత్ (ఏజేపీ) మధ్య త్రిముఖ పోరు ఉన్నది.
ఆ రాష్ర్టాలకు ఒకేదశలో..
బెంగాల్, అస్సాంతోపాటు షెడ్యూ ల్ విడుదలైన తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీలకు ఏప్రిల్ 6న ఒకే దఫాలో పోలింగ్ జరుగనుంది.
కేంద్ర దర్యాప్తు సంస్థలపై న్యాయ విచారణ
కేరళ ప్రభుత్వం నిర్ణయం.. దర్యాప్తునకు కమిషన్ ఏర్పాటు
తిరువనంతపురం, మార్చి 26: ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలపై న్యాయ విచారణ జరుపాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. దర్యాప్తు కోసం జస్టిస్ (రిటైర్డ్) కేవీ మోహన్ నేతృత్వంలో ఓ కమిషన్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. బంగారం స్మగ్లింగ్, డాలర్ కేసుల దర్యాప్తును ఈడీ తప్పుదోవ పట్టిస్తున్నదని సీఎం పినరాయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఆరోపిస్తున్నది. సీఎంను లక్ష్యంగా చేసుకొని ఈడీ ఈ దర్యాప్తును కొనసాగిస్తున్నట్టు మండిపడింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర క్యాబినెట్ శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది.
సరిహద్దే కాదు.. ఆత్మనూ పంచుకుంటున్నాం
బంగ్లాదేశ్పై తృణమూల్ ఎంపీ మొయిత్రా
కోల్కతా: బెంగాలీలు బంగ్లాదేశ్తో సరిహద్దుతోపాటు ఆత్మను కూడా పంచుకొంటారని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా అన్నారు. పశ్చిమబెంగాల్ ప్రజల రేషన్ను, హక్కులను బంగ్లాదేశ్ నుంచి వచ్చిన చొరబాటుదారులు లాక్కుపోతున్నారన్న కేంద్ర హోంమంత్రి అమిత్షా వ్యాఖ్యలపై ఆమె ఈ మేరకు సమాధానమిచ్చారు. రోత వ్యాఖ్యలను ఇకనైనా ఆపాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పారిశ్రామికాభివృద్ధి ఆగింది.. ఆయన గడ్డం మాత్రం పెరుగుతూనే ఉంది
‘దేశంలో పారిశ్రామికాభివృద్ధి పెరగకుండా నిలిచిపోయింది. కానీ ఆయన (ప్రధాని మోదీ) గడ్డం మాత్రం పెరుగుతూనే ఉంది. కొన్నిసార్లు ఆయనకు ఆయనే స్వామీ వివేకానందను అని చెప్పుకొంటారు. స్టేడియాలకు తన పేరు పెట్టుకొంటారు. ఆయన మెదడులోనే ఏదో తేడా ఉంది. బహుశా అది పనిచేస్తున్నట్టు లేదు. దేశానికి కూడా ఆయన పేరు పెట్టుకొని దేశాన్ని అమ్ముకొనే రోజు ఎంతో దూరంలో లేదు’
-మమతాబెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ సీఎం