నాడు మూడు రోజుల పాటు భక్తోత్సవాలు
నేడు 11 రోజులు వైభవంగా బ్రహ్మోత్సవాలు
యాదాద్రి, మార్చి 13 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు 1955లోనే శ్రీకారం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటుకు పూర్వమే మూడు రోజుల పాటు భక్తోత్సవాలను నిర్వహించేవారు. కాలక్రమేణా వాటిని ఐదు రోజులకు పెంచి, భక్తుల తాకిడి పెరగడంతో బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే గతంలో ఈ ఉత్సవాలు మార్గశిర మాసంలో జరిగేవి. వాటిని అప్పట్లోనే కొంత మంది అర్చకులు ఫాల్గుణ శుద్ధ విదియ నుంచి ద్వాదశి వరకు 11 రోజులు నిర్వహించాలని ప్రణాళికలు రూపొందించారు. నాటి నుంచి 11 రోజుల పాటు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు.
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈ నెల 15వ తేదీ నుంచి మార్చి 25వ తేదీ వరకు 2021 వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 15న స్వస్తివాచనం, అంకురార్పణం, విశ్వక్సేరాదన, రక్షాబంధనంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ నెల 25వ తేదీ వరకు జరిగే ఉత్సవాలను స్వామివారి బాలాలయంలోనే నిర్వహిస్తున్నారు. 21న ఎదుర్కోలు, 22న స్వామివారి తిరుకల్యాణోత్సవం, 23న దివ్య విమాన రథోత్సవం, 25న శతఘటాభిషేకంతో ఉత్సవాలకు పరిసమాప్తి పలుకనున్నామన్నారు. నాలుగు రోజులపాటు అలంకార సేవలు నిర్వహించనున్నారు. గతేడాది వార్షిక బ్రహ్మోత్సవాలకు రూ.72లక్షల ఖర్చు చేశామని, ఈసారి సైతం అంతేస్థాయిలో బడ్జెట్ను కేటాయించినట్లు తెలిపారు. 60 నుంచి 70 మంది పారాయణందారులు, రుత్వికులు, ఆచార్యులతో ఘనంగా నిర్వహిస్తామన్నారు.
యాదాద్రీశుడి బ్రహ్మోత్సవ విశిష్టత..
యాదాద్రీశుడి క్షేత్రంలో ప్రతి ఏటా పాల్గుణ మాసంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఉత్సవాలను మొదటగా సృష్టికర్త ప్రారంభించడంతో బ్రహ్మోత్సవాలు అన్న పేరు స్థిరపడింది. ఈ ఉత్సవాలతో స్వామిక్షేత్రం 11 రోజులపాటు ముక్కోటి దేవతలకు విడిదిగా మారుతుందని అర్చకులు చెబుతున్నారు. పూర్వం శ్రీస్వామి సన్నిధిలో వేదమంత్ర ఘోషలు వినిపించేవని చెబుతూ ఉంటారు. బ్రహ్మోత్సవ వేళ యాదగిరి వేదగిరి అన్న ప్రాచీన నామాన్ని సార్థకం చేసుకుంటుంది. ఈ సందర్భంగా సకల దేవతల్ని శాస్ర్తోక్తంగా ఆహ్వానించి వేదోక్తంగా పూజలు నిర్వహించడం ఆలయ సంప్రదాయంగా వస్తోంది. విశ్వక్సేన పూజలతో మొదలైన ఉత్సవాలు స్వయంభువులకు నిర్వహించే అష్టోత్తర శతఘటాభిషేకంతో బ్రహ్మోత్సవాలకు ముగింపు పలుకుతారు. మొదట ధ్వజారోహణంలో మహావిష్ణువు వాహనమైన వేద స్వరూపుడు గరుత్మంతుడికి పూజలు నిర్వహిస్తారు. మూడోరోజూ నుంచి స్వామివారి అలంకార సంబురాలు జరుపుతారు. ఏడు, ఎనిమిది, తొమ్మిది రోజుల్లో విశేష పర్వాలైన ఎదుర్కోలు, తిరుకల్యాణ మహోత్సవం, రథయాత్ర నిర్వహిస్తారు. పదోరోజూ చక్రస్నానం జరుపుతారు.
స్వస్తి వాచనంతో ఆరంభం..
పంచ నారసింహుడిగా విరాజిల్లుతున్న పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు 15వ తేదీ స్వస్తి శార్వరి నామ సంవత్సర పాల్గుణ శుద్ధ విదియ సోమవారం రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 25న పాల్గుణ శుద్ధ ద్వాదరి గురువారం రోజున డోలోత్సవంతో ముగుస్తాయి. ఈ ఉత్సవాల్లో 60 నుంచి 70 మంది పారాయణందార్లు, రుత్వికులు, ఆచార్యులు, పండితులు పాల్గొననున్నారు.
కొండకిందే స్వామివారి తిరుకల్యాణం..
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ పునర్నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ఈసారి కూడా శ్రీస్వామివారి తిరుకల్యాణోత్సవాన్ని యాదగిరిగుట్ట పట్టణంలోని పాత హైస్కూల్ మైదానంలో నిర్వహించనున్నారు. ఈ నెల 22వ తేదీన బాలాలయంలో ఉదయం 10 గంటలకు శ్రీరామ అలంకారం(హనుమంత సేవ), 11 గంటల నుంచి గజవాహన సేవ, బాలాలయంలో తిరు కల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. రాత్రి 7.30 గంటలకు భక్తుల మధ్య వైభవంగా కల్యాణం నిర్వహించనున్నారు. శ్రీస్వామివారి కల్యాణం చేయించుకునే భక్తులకు రూ.2,500 టికెట్ నిర్ణయించారు. కల్యాణం అనంతరం దాతలకు శేష వస్త్రంగా ఒక ఉత్తరీయం, కనుము, అభిషేకం లడ్డూ, రెండు వడలు ప్రసాదంగా ఇవ్వనున్నారు.
గతేడాది బడ్జెట్ రూ.72లక్షలు..
గతేడాది బ్రహ్మోత్సవాలకు రూ.72లక్షలు ఖర్చు వచ్చింది. ఈ సారి సైతం గతంలోలాగా అంతేస్థాయిలో ఉత్సవాలను నిర్మించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో ముందుగా బడ్జెట్ను నిర్ణయించలేమని ఈవో గీత తెలిపారు. ప్రధానాలయం, పురవీధులు, కొండకింద గల ప్రధాన రహదారి, పాత బస్టాండ్తోపాటు వివిధ ప్రాంతాల్లో డెకరేషన్ లైటింగ్ను ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 1000కి పైగా లైటింగ్లను ఏర్పాటు చేశారు. గత సంవత్సరం మాదిరిగా చలువ పందిళ్లు, చక్కటి విద్యుత్ దీపాల అలంకరణ, సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే హైదరాబాద్కు చెందిన సుజాత లైటింగ్, సౌండింగ్ కంపెనీ లైటింగ్ బిగిస్తున్నారు.
మొక్కు సేవలు రద్దు..
యాదాద్రీశుడి బ్రహ్మోత్సవాలను దృష్టిలో ఉంచుకుని యాదాద్రి కొండపైన గల బాలాలయంలో ఈనెల 15 నుంచి 25వ తేదీ వరకు నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమం, మొక్కు సేవలను రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. శ్రీస్వామివారి రాత్రి నివేదన అర్చన తదుపరి 8.15 నుంచి 9 గంటల వరకు బలిహరణ, ఆరగింపు రద్దు చేయనున్నారు. 21నుంచి 23వ తేదీ వరకు భక్తులచే నిర్వహించే అర్చనలు, బాలభోగాలు, 24 నుంచి 25వ తేదీ వరకు అభిషేకం, అర్చనలు రద్దు చేయనున్నట్లు తెలిపారు.
లక్ష్మీదేవితో కొలువైన క్షేత్రమిది..
లక్ష్మీదేవితో కొలువైన క్షేత్రమిది. యాదగిరి లక్ష్మీనరసింహుడి రూపం ఉగ్రం, మనస్సు నవనీతం, ఘనసింహం గర్జిస్తున్నట్లు.. ముల్లోకాలను వణికించే మృగరాజు పంజా విసురుతున్నట్లు హిరణ్యకశిపుడిని చీల్చి చండాడిన ఆ వాడి గోళ్ల చేతులు ఆది మహాలక్ష్మీని మాత్రం అతి సున్నితంగా అక్కున చేర్చుకున్నాడని, సృష్టికర్త బ్రహ్మకే ఆయువు పోసిన బ్రహ్మాండనాయకుడని పురాణాలు చెబుతున్నాయి. నరసింహుడిని దర్శించుకున్న సృష్టికర్త బ్రహ్మ ఉగ్రం.. వీరం.. మహావిష్ణుం.. జల్వంతం సర్వతోముఖం.. నృసింహం భీషణం భద్రం.. మృత్యు మృత్యుం నామామ్యహం అంటూ అర్చించాకే బ్రహ్మసృష్టి కార్యాన్ని ప్రారంభించాడని పండితులు చెబుతుంటారు. సింహరూపుడైన శ్రీహరి అంటే ఎంతో భక్తి కాబట్టే స్వహస్తాలతో బ్రహ్మోత్సవాలకు ఆ చతుర్ముఖుడే స్వయంగా నిర్వహిస్తాడని క్షేత్ర చరిత్ర చెబుతున్నది.
యాద మహర్షి తపోశక్తితోనే యాదగిరిగుట్ట..
మహాజ్ఞాని విభాండకుడి కుమారుడు రుష్యశృంగుడు, అతడి పుత్రుడైన యాద మహర్షి తపోశక్తితోనే యాదగిరిగుట్ట వెలసిందని చెబుతారు. యాద మహర్షి బాల్యం నుంచి మహావిష్ణు భక్తుడు. ఉగ్రరూపుడైన నృసింహావతారం పట్ల ఎనలేని మక్కువ కలిగింది. దైవసాక్షాత్కరం కోసం దట్టమైన అడవుల్లో తిరుగుతూ కొండజాతికి చిక్కాడు. ఆటవికులు యాదుడిని క్షుద్ర దేవతలకు బలి ఇవ్వబోయారు. ఈ సమయంలో ఆంజనేయుడు అండగా నిలిచాడు. కీకారణ్యంలో సింహాకార గుట్టలు ఉన్నాయని, అక్కడికి వెళ్లి తపస్సు చేస్తే స్వామి సాక్షాత్కరిస్తాడని యాదార్షికి ఆంజనేయుడు సూచిస్తాడు. దీర్ఘకాలిక తపస్సుతో ఫలించి తొలుత స్వామి పంచరూపాలతో దర్శనమిచ్చాడు. మొదటగా జ్వాలా, గండబేరుండ, యోగానంద, ఉగ్రనరసింహ, శ్రీలక్ష్మీసమేతుడిగా సాక్షాత్కరించిన నారసింహుడు ఈ గుహలోనే కొలువై ఉన్నాడు. దీంతో ఈ క్షేత్రానికి పంచ నారసింహ నిలయంగా పురణాల్లో నిలిచింది. యాదరుషి తపస్సు ఫలితంగా వెలసిన ఈ క్షేత్రం యాదగిరిగుట్టగా ప్రసిద్ధి చెందింది.
స్వామివారి బ్రహ్మోత్సవాలకు బస్సు మార్గంలో వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకం కలుగకుండా ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ నుంచి భక్తులు ఎక్కువగా వస్తారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్టకు 60 కిలోమీటర్లు, నల్లగొండ నుంచి 90 కిలో మీటర్లు ఉంటుంది. హైదరాబాద్- సికింద్రాబాద్ నుంచి ప్రతి అరగంటకు ఒక బస్సు ఉన్నది, అలాగే నిజామాబాద్, మహబూబ్నగర్, షాద్నగర్, నారాయణఖేడ్, సిద్దిపేట, మెదక్, జగిత్యాల, రాణిగంజ్, నల్లగొండ, సూర్యాపేట, మేడ్చల్, తాండూరు, పరిగి, వనపర్తి, విజయవాడ, కర్నూల్, శ్రీశైలం, నారాయణపేట, వేములవాడ, కొమురవెల్లి తదితర ప్రాంతాల నుంచి బస్సు సౌకర్యం ఉన్నది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా యాదగిరిగుట్ట బస్టాండ్ నుంచి కొండపైకి ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సును అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటికే 4 బస్సులు కొండపైకి నడుపగా, అదనంగా మరో మూడు బస్సులను భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నారు.
రైల్వే ప్రయాణం ఇలా..
ఇటు హైదరాబాద్, అటు వరంగల్ నుంచి వచ్చే భక్తులకు రైల్వే సౌకర్యం కలదు. జిల్లా కేంద్రమైన భువనగిరితోపాటు స్వామివారి 5 కిలో మీటర్ల దూరమైన రాయగిరిలో యాదాద్రి రైల్వేస్టేషన్ ఉన్నది. సికింద్రాబాద్ నుంచి వచ్చే రైళ్లు కాకతీయ ప్యాసింజర్, పుష్ఫుల్, కృష్ణా ఎక్స్ప్రెస్ యాదాద్రి రైల్వేస్టేషన్లో నిలుపుతారు. ఇక సికింద్రాబాద్ నుంచి వరంగల్ వెళ్లే పుష్ఫుల్, గోల్కొండ, భాగ్యనగర్, కాకతీయ, గౌతమి, మంచిర్యాల, కృష్ణా, ఇంటర్సిటీ, తెలంగాణ, ఈస్ట్కోస్ట్, దక్షిణ్ ఎక్స్ప్రెస్ రైళ్లు భువనగిరి రైల్వేస్టేషన్లో నిలుపుతారు. వరంగల్ నుంచి వచ్చే రైళ్లు సైతం భువనగిరిలో ఆగుతాయి. భువనగిరి నుంచి బస్సుల్లో యాదగిరిగుట్టకు చేరుకోవచ్చు.