మనిషి సంఘజీవి. సహజంగానే మనిషి బాల్యం తల్లిదండ్రులపై, సమాజంపై ఆధారపడినంత దీర్ఘకాలం ఏ జీవి బాల్యమూ ఆధారపడదు మనిషి సాంఘిక జీవనం విస్తరించడానికి ఇది మూలకారణం. సాంఘిక జీవనం మనిషి సంస్కృతిని, నైపుణ్యాలను పెంచే ప్రధాన సాధనం. సాంఘిక గతిశీలతయే మనకు సహాయాన్ని, రక్షణను, ప్రోత్సాహాన్ని, ప్రేరణను, వికాసాన్నీ ఇస్తుంది. సుఖదుఃఖాలు, భయనిర్భయాలు, నిరాశోత్సాహాలూ ఆయా పరిస్థితుల వల్ల మనిషిలో కలిగే సహజస్థితులు. అవే మౌలిక చాలకశక్తులు. మానవ జీవన పురోగమనాన్ని నిర్ణయించేవి.
సృష్టి దైవీమూలం ఒకటే అయినా జగతి తన ఏకత్వంలోనే అనేక వైవిధ్యాలతో కూడింది. అందులోనూ వైవిధ్యమన్నది జీవుల మహావిస్తార లక్షణం. అత్యధిక మానసికోన్నతి కలిగిన మనిషిలో ఈ వైవిధ్యం మరీ ఎక్కువ. దీనికితోడు అతని సృజనాత్మకత ఈ ప్రపంచానికి కూర్చుతున్న వైవిధ్యం అపారం. జగత్తులో ఎంత వైవిధ్యం పెరుగుతుందో అంతగా అనిశ్చితి కూడా పెరుగుతుంది. అనిశ్చితి ఎప్పుడూ ఆందోళనకరం, భయానకం, సంతోష దూరం. అది ధర్మాన్ని బలహీనపరుస్తుంది. ధర్మం ఎంత బలహీనపడుతుంటే సమాజంలో సమష్టి సంక్షేమాని కోసం పాటుపడే మేలిశక్తుల అవసరం, బాధ్యత, క్రియాత్మకత, ఐక్యత అంతగా పెరగవలసి ఉంటుంది. ఏ సంస్కరణా, అభివృద్ధి సాధించాలన్నా సహృదయత, సమర్థత, దీక్షలతోపాటు అర్థ, అంగ, జ్ఞాన, వీర, త్యాగబలాలు అత్యవసరం.
ధార్మికత ఎంత బలహీనపడితే వీటి బలం అంత పెరగవలసి ఉంటుంది.
ఈ శక్తులు సమాజ శ్రేయస్సుకు ఎంత అవసరమో అంత అరుదైనవి. అందువల్ల, ఈ ధర్మరక్షక శక్తులను జాగ్రత్తగా గుర్తించడం శిష్టజనుల బాధ్యత. కుటిలత్వం, వంచన ప్రబలిన కాలంలో, సామాజిక మాధ్యమాల వికృత విజృంభణలో ఈ సాధు శక్తులను గుర్తించడంలో నిష్పాక్షికత, జాగ్రత్త మరీ మరీ అవసరం. చాలా సందర్భాల్లో ఈ ధర్మరక్షక శక్తులతో నేరుగా భాగస్వామ్యం వహించడానికి మనకు తగిన అర్థ, దేహ, హృదయ, జ్ఞానబలాలు లేకపోవచ్చు. కానీ, మంచిని, ధార్మిక కృషిని తగు ప్రశంసతో ప్రోత్సహించగలిగిన విమల సంస్కారం ఉంటే చాలు. నిజానికది బుద్ధిజీవుల కనీస ధర్మం. వ్యక్తిలో కానీ, సమాజంలో కానీ మంచి శీలాన్ని, నైపుణ్యాన్ని, కృషినీ పెంచడానికి, బలపరచడానికీ ఉన్న ప్రధాన మార్గం సందర్భానుసారంగా, సమయోచితంగా తగిన శిక్షలను, ప్రోత్సాహకాలను అందజేయడం. అందులో అతిబలమైన ప్రోత్సాహకం మనసారా చేసే తగు ప్రశంస.
ఈ సంస్కారం అలవాటు చేసుకోవడానికి ఏ అవరోధమూ లేదు. కాబట్టి, సమాజ వికాసానికై, సంతోషానికై సాగే కృషిలో ఆయా సాధుశక్తులకు మనసారా తగు ప్రశంసలందిస్తూ మనమూ నిజాయితీగా భాగస్వామ్యం వహించవచ్చు. ప్రశంసలందించే వారికి ఎంత ఔదార్యం అవసరమో అందుకునేవారికీ అంత వినయం అవసరం. ‘సత్ప్రశంస’ సమాజోద్ధరణకే కాదు, ప్రశంసించేవారి వ్యక్తిత్వ వికాసానికీ, జీవనోద్ధరణకూ ఒక సాధనమవుతుంది. అది మనసులో స్వచ్ఛతనూ, కృతజ్ఞతనూ పెంచుకోవడానికి మొదటిమెట్టు. ఆధ్యాత్మికతలో మొదటి సామాజిక ద్వారం. భగవంతుడి లీలను స్తుతించడం కంటే ముందు అతని కృపకు ద్వారాలైన ప్రకృతి, సమాజ కరుణామృత మధురకర్మలను మనసారా ప్రశంసించడం అలవాటు చేసుకోవాలి.
ఇది నిజానికి ప్రత్యక్ష ఈశ్వరారాధన. మన అహంకారాన్ని కరిగింపజేసుకునే మొదటి సాధన. లేకుంటే మాటలలో ఎంత వినయం ప్రకటించినా, తెలియకుండానే మనం ఆత్మస్తుతిలో మునిగిపోతాం. అవగాహనను, బుద్ధిని, అభిప్రాయాలను సంకుచిత పరుచుకుంటాం. పరోక్షంగా విభేదబుద్ధితో మన దైవావగాహనను, ఆనందపు పరిధిని ముకుళింపజేసుకుంటాం. ఫలితంగా మనలో మానవీయతయే కోత పడుతుంది. శివ సంకల్పాలను, కర్మలను నిండుమనసుతో ప్రశంసించకుంటే నెమ్మదిగా సమాజంలో వికృతులను బలపరచిన వాళ్లమవుతాం, పాపార్జకులమవుతాం. లోకంలో మనం ప్రకటించే ఇటువంటి సత్ప్రశంసలను, స్తుతులను భగవంతుడు ఇష్టపడతాడు కాబట్టే, అతనిని ‘స్తోత్రప్రియుడు’ అనేది.
ఇవీ కూడా చదవండీ…
పూజ చేసేటపుడు కలశంపై కొబ్బరికాయ ఎందుకు పెడతారు?
గోవిందరాజ స్వామి ఆలయంలో దర్శన సమయాల్లో మార్పు : టీటీడీ