శ్రీమద్భాగవతంలో తృతీయ చతుర్థ స్కంధాలు చతురీయ (మోక్ష) సంసాధకాలైన భక్తి జ్ఞాన, వైరాగ్యాలను ప్రతిపాదించే విదుర- మైత్రేయ సత్కథా సంవాద సమలంకృతాలు. పురాణ కథలు చాలా ప్రబోధాత్మకంగాను, ప్రరోచకంగానూ ఉంటా యి. వాటిలో మనో విజ్ఞానం, ఆధ్యాత్మ జ్ఞానం మెండుగా నిండి ఉంటాయి. ఎంతో ఉన్నత శ్రేణి భక్తులైతే తప్ప, వైకుంఠ ద్వార పాలకులు కాలేరు. పూర్వ పుణ్య విశేషం వల్ల ఉన్నత స్థితి కలిగినా దానిని కాపాడుకోవడానికి మరింత పుణ్యం కావాలి.
పారమార్థికంగా జయ-విజయులను- ‘జయ’ అనగా ఇంద్రియ జయమని, ‘విజయ’ అనగా, మనో విజయమని భావించవచ్చు. జయ-విజయుల అనుమతి- అనగా ఇంద్రియ, మనోజయాలు సాధించకపోతే ఎంతటి మతిమంతుడైనా ఇందిరావరుని మందిర (వైకుంఠ) ప్రవేశం చేయజాలడని సనాతన సిద్ధాంతం. ‘లోకము లన్నియున్ గడియలోన జయించిన వాడ వింద్రియానీకము జిత్తమున్ గెలువ నేరవు’ అని ప్రహ్లాదుడు హిరణ్యకశిపుని నిర్భయంగా నిలదీస్తాడు- ‘తండ్రీ! ఈ ఆ లోకాలు గడియలో జయించానని గొప్పలు గుప్పిస్తున్నావు. కానీ, నీలోని మనస్సునూ, ఇంద్రియాలను గెలువ లేకపోయావు. నీ ఇంద్రియానీకం జయిస్తే మరి ఏ లోకమూ జయించే పని లేదు గదా!’ అని.
సనాతన ధర్మంలో ఇంద్రజిత్తు కన్నా ఇంద్రియ జిత్తు మిన్న. ఇంద్రుని జయించిన వానిని జయించడమే అతీంద్రియత్వం! ఇదే రామాయణంలో రామానుజుని (లక్ష్మణుని) రామణీయకం! ‘జితం జగత్ కేన మనో హి యేన’- మనస్సును జయించిన వాడే జగద్విజేత. కానీ, చిత్రమేమంటే అట్టి జయ-విజయులకు కూడా అహంకారం, దర్పం కలిగాయి. భగవంతుడు అచ్యుతుడు ఇట్టి అభిమానాన్ని ఎట్టి స్థితిలోనూ ఆమోదించడు, అట్టి పెట్టుకోనివ్వడు. మాధవుడు ఏదో ఒక మాయ చేసి, మరులు గొల్పి అట్టి వారికి కూడా ‘పదవీ (వైకుంఠ) చ్యుతి’ కలిగిస్తాడు.
సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు బ్రహ్మదేవుని మానస పుత్రులు. సురుచిర సుందర గాత్రులు. నలుగురిని సముచ్చయంగా (కలిపి) ‘సనత్కుమారులు’ అని పిలుస్తారు. నివృత్తి- మోక్ష మార్గ నిరతులు. ధీరులు- నిరంతర చిరంతన (సనాతన) బ్రహ్మ చింతనతో చిత్త, ఇంద్రియాలను చెత్తగా చిత్తు చేసిన (ఓడించిన) వారు. ఆశాదూరులు, ఆత్మ వేత్తలు. విచరన్ నిర్వాణులు- రూపు దాల్చి నడచి వస్తున్న నిర్వాణం (ముక్తి) వంటివారు. సర్వం కష శేముషీ విచక్షణులు-వివిధ విషయాలలో విశుద్ధ జ్ఞానం కల విద్వాంసులు. అవ్యాహత గమనులు- అడ్డు అదుపు లేక అంతట- ఎక్కడికైనా వెళ్ల గలిగిన అసమాన సామర్థ్య సంపన్నులు. ‘సనత్’ అనగా ‘సదా’- ఎల్లప్పుడు అని అర్థం. వారు బ్రహ్మ సృష్టిలో సర్వాధిక వయోవృద్ధులు. అయినా ‘సదా కుమారులు’- ఐదేళ్ల బాలురుగానే ఉంటారు. అనగా, రాగ ద్వేష రహితులై, అకృత్రిమంగా, అమాయకంగా- నిష్కపటంగా ఉంటారు. దిగంబరులు- అంటే పరమార్థంలో దేహాభిమాన రహితులు. దేహాభిమానులు, దైవీ సంపద విరహితులు, దైవసన్నిధికి దూరంగానే ఉంటారు తప్ప దూసుకు పోలేరు.
సనకాదులు ఒక పర్యాయం పద్మనాభుని పాదపద్మ పూజా ప్రసాద ప్రాప్తికై ప్రేమతో పవిత్రమైన వైకుంఠం వెళ్లారు. వైకుంఠం, వైకుంఠుడు ఒకటే! ‘కుంఠం నాశం వైకుంఠం అవినాశ స్థానమ్’- కుంఠమనగా నశించే అజ్ఞానం. వైకుంఠమనగా నాశం లేనిది గాన జ్ఞానం. కాన, జ్ఞానానుభవ స్థితియే వైకుంఠం. ‘అభేద దర్శనం జ్ఞానం’- ఏకత్వాన్ని దర్శించుటే జ్ఞానం కనుక వైకుంఠంలో భేదబుద్ధి ఉండదు. ఆదిశేషుడు, ఆమ్నాయ (వేద) స్వరూపుడైన గరుత్మంతుడు అవిరోధంగా ఎక్కడ ఉంటారో అదే వైకుంఠం. నళినాయతేక్షణుడు నారాయణుడు అక్కడ నెలకొని ఉంటాడు. అంత్యానుప్రాసల అలంకార విన్యాసాలతో పద్యాన్ని అర్థవంతంగా హృద్యంగా పలకడం పోతన్నకు వెన్నతో పెట్టిన విద్య. ఈ క్రింది వృత్తాలలో అమాత్యుడు అనంతుని వైకుంఠ వైభవాన్ని, ఆయన దివ్య స్వరూప సౌందర్య ప్రాభవాన్ని ఎంతో ప్రభావ పూర్ణంగా వర్ణించాడు.-
విబుధ వరులు సనకాదులు అలా ముందుకు వెళ్ళి-వెళ్ళి విశిష్ట వైభవంతో విరాజిల్లుతున్న వైకుంఠ నగరాన్ని వీక్షించారు. అది నిత్యమైన దివ్యశోభతో దేదీప్యమానంగా వెలిగిపోతోంది. సుమనో మనోహరంగా, ప్రపన్ను (శరణాగతు)లైన భక్తులకు పరమ భజనీయమైన పవిత్రనామంగా పరిఢవిల్లుతోంది. ‘యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ’- ఆ పరంధామం పొందిన వారికి పునర్జన్మ లేదు. సత్పురుషులచే సన్నుతింపబడే ఆ సుందర నగరం ‘భూమా’- సర్వ వ్యాపకమైన విష్ణు స్వరూపం. అశేష భక్త బృందాన్ని అహర్నిశం కృపతో కాచే కరుణా నిధానం. ఆ నగర ఉద్యాన వనం మూర్తీభవించిన మోక్షం వలె ‘నైశ్శ్రేయసం’ అన్న నామంతో నయనాభిరామంగా అలరారుతోంది-
లీలా పురుషోత్తముని లోకాతీతమైన ఆ వర (శ్రేష్ఠ) వైకుంఠపురం ఒక సుందర సరోవరం. అవర్ణనీయ దివ్య సువర్ణ శాలలతో, గోపురాలతో, రమ్యమైన హర్మ్యాల (మేడల)తో కూడిన ఆ మహామందిరమే సరస్సు మధ్య ఉన్న సరోజం (పద్మం). ఆ మందిర మధ్య భాగంలో ప్రకాశించే ఆదిశేషుడే తామర దుద్దు. శేషశెయ్యపై శయనించి శోభిస్తున్న శ్రీమన్నారాయణుడే షట్పదం- తుమ్మెద!
లోక కళ్యాణ మూర్తులైన ఆ సనక సనందనాదులు సంతోషంతో తమ యోగశక్తివల్ల వడి-వడిగా వైకుంఠధామం విచ్చేశారు. సాధనాపరంగా కర్మ, ధ్యాన, భక్తి, జ్ఞాన యోగాలే సనత్కుమారులు. ఆఱు మహాద్వారాలు దాటి ఏడవ మహాద్వారం చేరుకున్నారు. అదికూడా దాటి వెళ్లితే ఇక దామోదరుని దివ్య దర్శనమే! కాని, దైవ యోగం వల్ల పూజార్హులని గుర్తించక ద్వారపాలకులైన జయ-విజయులు అహంకారంతో అక్కడ వారిని అడ్డుకొన్నారు. ఇక్కడ పరమార్థంలో కామ, క్రోధాది అరిషడ్వర్గమే ఆఱు ద్వారాలు. అహంకారమే ఆఱున్నొక్క (ఏడవ) ద్వారం. సాధువరేణ్యులైన సనకాదులకు స్వామి సంకల్పమేమో అన్నట్లు సాత్తికమైన కోపం వచ్చింది. కటు స్వభావులు, కుటిల స్వాంతు (మనస్కు)లైన జయ-విజయులతో వారిలా అన్నారు-
‘సత్య సనాతనుడైన స్వామి సందర్శనం మాకు క్రొత్త కాదు. ఇది మా నిత్యకృత్యం. నిరాటంకంగా వచ్చి పోతూ ఉండే మాకు మీరు ఆటంకంగా నిలిచారు. ఇలా అడ్డు పడుట చాలా చెడ్డ పని. భక్తులమైన మాకు, భగవంతునికి మధ్య భేదం లేదు. (‘తస్మిన్ తజ్జనే భేద అభావాత్’- భగవంతునికి భాగవతులకు అభేదమని భక్తి సూత్రాలలో నారద ఉపదేశం). మీరు భేదం పాటించారు. మాకు ఖేదం కల్గించారు. భేదబుద్ధి భయంకర రాక్షస స్వభావం. అది ఉన్న మీరు రాక్షసులై జన్మించండి.’
కామ క్రోధ లోభాది శత్రు గుణాలకు లోనై భూలోకంలో పుట్టండని సనకుడు శాపం పెట్టాడు. జయ-విజయుల కోప కారణమైన పాపమే వారికి శాపమయింది. అన్ని లోకాలకు మిన్న అయిన వైకుంఠంలో ఉన్నవారైనా అనన్య భక్తులను అవమానిస్తే వారికి అధఃపతనం అనివార్యమని హచ్చున హెచ్చరిక! ఈ ప్రసంగంలో అర్భకులైన సనకాదులు కూడా మార్గమధ్యలోనే (7వ ద్వారం దగ్గఱ) మన్యువుకు (కోపానికి) లోనైనందున గర్భాలయం లోనికి వెళ్లి విశ్వగర్భుడైన విష్ణువును దర్శించే భాగ్యం దక్కించుకోలేకపోయారు. భగవంతుడే భార్గవీ (లక్ష్మీ) సమేతంగా బయటకు వచ్చి కన్పించాడు. ఎంతటి విబుధ శ్రేష్ఠులైనా క్రోధావిష్టులైతే వైకుంఠానికి వెళ్లి విష్టరశ్రవుని (విష్ణువుని) దర్శించే అదృష్టానికి నోచుకోలేరని విస్పష్టమైన హెచ్చరిక.
ఈ సన్నివేశాన్ని పురస్కరించుకొని సహజ పాండిత్యుడు పోతన, బయటకు వచ్చి దర్శన మిచ్చిన దామోదరుని తిలకించి, పులకించి చంపక మాలతో స్వామి శ్రీ చరణాలను చర్చించి అర్చించాడు-సనత్కుమారులు సరోజాక్షుని సుందర వదనార విందాన్ని సుస్థిర భక్తిచే దర్శించి-దర్శించి తమ దృక్కు (చూపు)లను త్రిప్పుకోలేక ఎలాగో తంటాలు పడి ఎప్పటికో స్వామి పాదార విందాలపై ప్రసరింప చేశారు. ఆ పవిత్ర పాదాలు భక్తుల ఖేదాలను పోగొట్టేవి. ముని ముఖ్యుల మానసాలకు మోదాన్ని కల్గించేవి. మోక్షమందిర ద్వారాలను తెరిపించేవి. కాగా, ఆ పాదాలు వేదాలను నిత్యనూతనమైన నూపురాలు (అందెలు)గా అలంకరించుకొన్నవి!
-తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ , 98668 36006