కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకం
మౌనేన కలహో నాస్తి, నాస్తి జాగరతో భయం॥
కృషి వల్ల కరువుండదు. అంటే వ్యవసాయాన్ని జీవనోపాధిగా మలచుకొని జీవించే జనం ఉండే సమాజానికి కరువు కాటకాలు ఎదురుకావు. పట్టుదలతో పనిచేసేవాడికి ఫలితం తప్పక ఉంటుందని చెప్తారు. జపం వల్ల పాపం నశిస్తుంది. మౌనంగా ఉంటే కలహం ఉండదు. మెలకువగా ఉండేవానికి భయం ఉండదనేది సనాతన ధర్మం నానుడి.
వయసు, ధనం, గృహ కలహాలు, మంత్రం, ఔషధం, దాంపత్యం, దానం, మానం, అవమానం ఈ విషయాల్లో విధిగా మౌనాన్ని పాటిస్తూ ఉండాలని పెద్దలు సూచించారు. అంటే ఈ విషయాలు ఇతరులకు వెల్లడించరాదని అర్థం. ‘మాట్లడటం వెండి వంటిదైతే, మౌనంగా ఉండటం బంగారం వంటిద’న్న సామెత మౌనం గొప్పదనాన్ని తెలియజేస్తుంది.
అర్థవంతమైన, ప్రయోజనకరమైన మాట వల్ల పరమార్థం సిద్ధిస్తుంది. అర్థం లేకుండా సందర్భం పాటించకుండా మాట్లాడటం వల్ల లేనిపోని సమస్యలు ఎదురవుతాయి. దానికన్నా మౌనంగా ఉండటమే మేలు. జీవితంలో మౌనానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. మౌనంగా ఉన్నప్పుడే చేతులు దక్షతను ప్రదర్శిస్తాయి. పనులను బాగా చేయగలుగుతాయి. మాటలు తగ్గించి, మనసును లక్ష్యంపై పెడితే పనిలో ఏకాగ్రత కుదురుతుంది. నోరు మాట్లాడకుండా ఉన్నప్పుడే హృదయం మాట్లాడుతుంది. వేదాలు, పురాణాలు కూడా మౌనానికే ప్రాధాన్యం ఇచ్చాయి. ఇక్కడ మౌనం అంటే కేవలం మాట్లాడకుండా ఉండటం మాత్రమే కాదు. బాహ్య మౌనం కంటే మానసిక మౌనమే ముఖ్యం. మౌనంగా ఉండటం వల్ల అంతులేని మనశ్శాంతి కలుగుతుంది. అందుకే మౌనాన్ని తపస్సు అంటారు. మౌనాన్ని పాటిస్తూ తపోదీక్షలో ఉన్నవారే మునులు.
మౌనం అంతరంగాన్ని ప్రబోధిస్తుంది, అంతర్ముఖ పయనం చేయిస్తుంది, అంతర్యామిని దర్శింపజేస్తుంది. మన అంతరాత్మను మనముందు ఆవిష్కరిస్తుంది, ఆత్మ సాక్షాత్కారం చేయిస్తుంది. ‘మౌనమంటే పదాల ప్రతిబంధకాల్లేని నిశ్శబ్ద సంభాషణ’ అని శ్రీరమణుల ప్రబోధం. మౌనం గొప్పదనాన్ని చాటిచెప్పిన మహనీయుడు ఆయన. మౌనాన్ని అన్నింటికన్నా అతీతమైన, సమర్థమైన భావ ప్రకటనగా భావిస్తారు. ఎవరైతే మౌనాన్ని ఆశ్రయించి, అమృతత్వాన్ని ఆశిస్తూ ఇంద్రియాలను అంతర్ముఖం చేస్తారో వారే ధీరులు. వారికి అమృత రాజ్య ద్వారాలు తెరిచి ఉంటాయని చెప్తుంది కఠోపనిషత్తు. వాక్కును మనసులో లయం చేసి మౌనం వహిస్తే బుద్ధి ఆత్మలో, ఆత్మ నిర్వికల్పపూర్ణమైన బ్రహ్మంలో లయమవుతుంది. అప్పుడు పరమశాంతి లభిస్తుందని వివేక చూడామణిలో శంకరాచార్యుల ప్రవచనం. మౌనం వహించిన వ్యక్తి ముని అవుతాడు. అటువంటి వారి చిత్తం ఈ ఉపాధి వ్యవస్థల నుంచి విముక్తం అవుతుంది. దీనివల్ల అతనికి సిసలైన సుఖం స్పష్టంగా తెలుస్తుంది. అతని మనసులో సచ్చిదానందం వెల్లివిరుస్తుంది.
అయితే, మౌనమనేది అన్ని సందర్భాల్లో, అందరికీ పనికిరాదని మన సుభాషితాలు చెప్తున్నాయి. ‘మౌనాన్మూర్ఖః ప్రవచన పటుః వాతులో జల్పకోవా…’ (భర్తృహరి) అన్నారు. ఎప్పుడూ మాట్లాడకుండా ఉండేవారిని మూర్ఖుడనో, పొగరుబోతు అనో అనుకునే ప్రమాదం ఉంది. ఎప్పుడూ మాట్లాడుతూ ఉండేవాణ్ని వదరుబోతు, వాగుడుకాయ అని హేళన చేస్తుంటారు. అందుకే విజ్ఞులు సందర్భానుసారంగా మెలగుతూ ఉండాలి. ఎప్పుడైనా మితభాషణమే భూషణం. అంటే మంచి మాటలను అతి తక్కువగా మాట్లాడటం అన్నివేళలా శ్రేయస్సును కలిగిస్తుంది.
–డా॥ శాస్ర్తుల రఘుపతి ,73867 58370