ప్రకృతి శక్తిగా భావించే అమ్మవారు అనంత రూపాల్లో అనుగ్రహిస్తూ ఉంటుంది. దుర్గ, సరస్వతి, గాయత్రి, రాధాదేవిగా పూర్ణత్వంతో సంపూర్ణ ఆశీస్సులు అంది స్తుంది. గంగ, తులసి, మంగళ చండీ, మానసాదేవి, షష్టీదేవి, కాళి, వసుంధర ఇవి అమ్మ కళారూపాలు. సప్త కళారూపాలతో తన భక్తులకు సమస్తం కటాక్షి స్తుంది. చంద్రుడి భార్య రోహిణి, మనువు భార్య శతరూప, ఇంద్రుడి భార్య శచీదేవి, బృహస్పతి సతి తారాదేవి, వశిష్ఠుని ఇల్లాలు అరుంధతి, గౌతముని భార్య అహల్య, అగస్త్యుని అర్ధాంగి లోపాముద్ర.. సీతాదేవి, కుంతీదేవి, దమ యంతి, ద్రౌపది, గాంధారి, మండోదరి, సత్యభామ, రేణుక, రేవతి ఇలా పలువురిని అమ్మవారి కళాంశ రూపాలుగా చెబుతారు. వీరిలో ఎవరిని ఆరాధన చేసినా అది అమ్మవారికే చెందుతుంది.
అదితి, దితి, వినత, కద్రువ, సురభి వీరంతా కాళాంశ రూపాలే. సురభి అంటే గోమాత. గోవు మహాలక్ష్మి కూడా అమ్మవారి కళాంశ రూపమే. గోవుల్లో పరాశక్తి కొలువుదీరి ఉంటుంది. ఒకసారి కృష్ణపరమాత్మకు గోలోకంలో ఉన్నప్పుడు ఏదైనా మధుర పదార్థాన్ని తాగాలనిపించిందట. వెంటనే రాధాదేవి శరీరంలో నుంచి ఒక కామధేనువు ఉద్భవించిందట. ఆ కామధేనువు సంతానమే గోవులు. అవన్నీ సురభీదేవి అంశలే! సురభి సాక్షాత్తు మహాలక్ష్మి, రాధాదేవి. ఈ తల్లిని గోలోకంలో రాస మండలంలో కృష్ణ పరమాత్మ రాధాదేవి రూపంలో ఆరాధిం చాడు. బృందావనంలోని గోపీజనంతోపాటు బ్రహ్మాది దేవతలు సైతం రాధమ్మను ఉపాసించారు.
ఏదైనా వస్తువును సృష్టించాలంటే దానికి ఎంతో సృజనాత్మకత ఉండాలి. ఈ అనంత జగత్తును సృష్టించిన బ్రహ్మకు ఎంతటి సృజనాత్మక శక్తి ఉందో ఊహిం చలేం. ఏ జ్ఞానం చేత బ్రహ్మదేవుడు సృష్టి చేయగలుగుతున్నాడో ఆ జ్ఞానమే సరస్వతీదేవి. ఏ ఐశ్వర్యం చేత లోకాన్ని పాలిస్తున్నాడో ఆ ఐశ్వర్యం లక్ష్మీదేవి. ఈ సృష్టికొక పటుత్వాన్నిచ్చి, ఏ శక్తితో నిర్వహించ గలుగుతున్నదో ఆ తల్లి దుర్గ. ఇవన్నీ సహకార, అవిభాజ్య శక్తులు. సరస్వతీదేవి ఉపాసకుడు బ్రహ్మ. ఆ తల్లిని నిరంతరం ధ్యానించి తన నాలుగు వదనాలపై నాలుగు వేదాలు ప్రకాశించేలా, బుద్ధి భాసిల్లేలా అనుగ్రహం పొందాడు.
లలితా మహా త్రిపుర సుందరి, రాజరాజేశ్వరి పరాభట్టారికా, భువనేశ్వరిగా పూర్ణ, కళా, కళాంశ, కళాకళాంశ రూపాలుగా అమ్మవారు ఈ సృష్టిని సదా రక్షిస్తూ ఉన్నది. గ్రామదేవతలు కళాకళాంశ రూపాలుగా తమ బిడ్డలకు రక్షగా నిలుస్తున్నారు. దేవతామూర్తులే కాదు.. జగత్తులోని ప్రతి స్త్రీమూర్తీ కళాకళాంశ రూపమే! అందుకే అమ్మవారి అనుగ్రహం కావాలంటే ముందుగా స్త్రీని గౌరవిం చడం నేర్చుకోవాలి. శక్తిని ఉపాసించే ముందు స్త్రీని అమ్మవారిగా భావించగల గాలి. సృష్టికర్త బ్రహ్మే అయినా స్త్రీలను అమ్మవారే సృష్టిస్తుందని శివపురాణం చెబుతున్నది. పరాశక్తి తత్వం పూర్ణ శక్తులు మొదలుకొని సాధారణ మహిళల వరకు విశ్వమంతా ప్రకృతిగా వ్యాపించి ఉంది. ప్రతి మహిళలోనూ అమ్మవారి కళ ఉంది. ఆమె ఎప్పుడూ మంగళరూపిణే. ప్రతి స్త్రీ మూర్తిలో అమ్మవారి అనుగ్రహం, చైతన్యం, విభూతి అలరారుతూ ఉంటుంది. అందుకే అమ్మవారిని ఎన్ని రకాలుగా ఆరాధించినా స్త్రీ మూర్తిని గౌరవించగలిగినప్పుడే దానికి సార్థకత చేకూరుతుంది. అమ్మవారి ఉపాసన చేస్తున్నామంటే.. అది సాధారణ స్త్రీ మొదలుకొని అసాధారణ దైవం అయిన ఆదిపరాశక్తి వరకు అందరికీ చెందుతుందని భావించాలి.
-వేముగంటి శుక్తిమతి ,99081 10937