ఒకప్పుడు ఒక పండితుడు ఒకానొక గ్రామానికి వెళ్తున్నాడు. చాలాదూరం నడవటంతో అలసిపోయి ఒక చెట్టు కింద నడుమువాల్చాడు. అక్కడే సమీపంలో ఉన్న పొలంలో ఒక రైతు చెలక దున్నుతూ కనిపించాడు. అయితే, ఆ ఎద్దులు డస్సిపోయి ఆగిపోయాయి. అప్పుడా రైతు ‘మీ యజమానికి బుద్ధి లేదు. ఏ పనీ చేయలేని సన్నాసి. నడవండి..నడవండి…’ అని తిడుతూ, వాటిని అదిరిస్తున్నాడు.
ఈ తిట్లు, అదిరింపులు విని చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న ఆ పండితుడు ఆశ్చర్యపోయాడు. అదేంటి? ఆ ఎద్దుల యజమాని రైతే కదా! తనను తానే ఎందుకు తిట్టుకుంటున్నాడు? ఒకవేళ ఆ ఎద్దులు అవసరానికి తెచ్చుకున్నాడా? వాటి యజమాని వేరే ఎవరైనా ఉన్నారా? ఎవరిని తిడుతున్నాడోనని తెలుసుకునేందుకు, ఆ రైతు దగ్గరకు వెళ్లాడు. ‘మీరెవరిని తిడుతున్నారు? ఆ ఎద్దులు మీవే కదా! అంటే మిమ్మల్ని మీరే తిట్టుకుంటున్నారా?’ అని అడిగాడు. అప్పుడా రైతు ‘ఎవరు ఈ తిట్లను గురించి తెలుసుకుంటున్నారో, వారినే తిడుతున్నానని’ అన్నాడు. ఆ మాటకు ఆ పండితుడు ఆశ్చర్యపోతాడు.
ఇలాగే మనం మనవికాని అనేక విషయాలను పులుముకుని జీవితంలో చిక్కుకుంటున్నాం. అందులో ఒకటి కర్మ ఫలం. ఇదే విషయాన్ని భగవద్గీతలో గీతాచార్యుడు నొక్కి వక్కాణించాడు. కర్మ చేయడమే మన పని, కర్మఫలం మన సొత్తు కాదు. కాబట్టి, దాని గురించి ఆలోచించి సుఖదుఃఖాలను పులుముకో వద్దన్నది శ్రీకృష్ణుని ఉద్బోధ. బాలునికి గాని, పిచ్చివానికి గాని పాపపుణ్యాల జ్ఞానం ఉండదు. వారికవి అంటనట్లు నిత్యానందుడైన జ్ఞానిని కూడా కర్మఫలాలు అంటవు. నేను కర్మ చేశాను అనడంతోనే రెండు రకాల బంధనాలను మనమే వేసుకుంటున్నాం. ‘నేను’ అనేది పెద్ద బంధనం, ‘చేశాను’ తాత్కాలిక బంధనం. ‘చేశాను’ అనేది ‘నేను’తో ముడివడి మనల్ని సుఖదుఃఖాల బరిలోకి నెట్టివేస్తుంది. దీనిని వదిలించుకోవాలంటాడు శ్రీకృష్ణ పరమాత్మ.
‘ఈ శరీరం నాది, ఏ పని చేసినా అదీ నాదే, ఫలమూ నాదే’ అని ఆలోచించడం తో దాని ఫలంగా సంతోషం గాని, దుఃఖం గాని మన మనసులో చేరుతాయి. ఫలితం గురించి ఆలోచించకుండా కర్మ చేయమంటాడు గీతాచార్యుడు. ‘తదర్థం కర్మ కౌన్తేయ ముక్తసంగః సమాచర’.. ‘అర్జునా! ఆసక్తి శూన్యుడవై కర్మను ఒనర్చు’ అని పేర్కొన్నాడు. కర్మఫలంపై ఆసక్తి కలవారు అజ్ఞానులని, అనాసక్తి కలవారు జ్ఞానులని, జ్ఞానులే లోకహితులని గీతాచార్యుడు కర్మయో గంలో విడమరచి, విశ్లేషించి చెప్పినా.. కొందరు ఆ కర్మఫలాలకు పాపం, ఫుణ్యం అని పేర్లను పులిమి సుఖదుఃఖాల చట్రంలో ఇరుక్కుపోతున్నారు.
పాపపుణ్యాలను బేరీజు వేసుకుంటూ.. జ్ఞానాన్ని వదిలి చాలామంది అజ్ఞానా న్ని నింపుకొంటున్నారు . పాపపుణ్యాల గురించి కాకుండా ఇంకా దేని గురించి ఆలోచించాలన్న ప్రశ్న మనలో ఉదయించవచ్చు. ‘ఆలోచించకుండా కర్మలను ఆచరిస్తే అవి ఇతరులను బాధించి, నష్టాన్ని కలిగించవా?’ అనే సంశయమూ కలుగవచ్చు. ఇలాంటి అనుమానమే అర్జునుడికీ వచ్చింది. అందుకే శ్రీకృష్ణుడి తో ‘తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ?’.. ‘నన్ను హింసాత్మక మైన ఈ కర్మను చేయమని ఎందుకు నియోగిస్తున్నావు?’ అని అడుగుతాడు. అందుకు గీతాచార్యుడు ‘స్వధర్మ’మే చేయమంటాడు. స్వధర్మాన్ని వదలవద్దం టాడు. సైనికుడు దేశరక్షణనే చేయాలి, విద్యార్థి విద్యనే ఆస్వాదించాలి. తండ్రి కుటుంబ పోషణ, సంరక్షణలను వదలవద్దు. ఇలా జనులు తాము చేయాల్సిన పనులు చేస్తూ ఉంటే, సమాజంలో శాంతి వెల్లివిరుస్తుంది. ఏ ఒక్కరైనా స్వధర్మం వదిలి, వేరే పనుల్లో తలదూర్చడం మొదలైనప్పుడు సమాజంలో సంఘర్షణ మొదలవుతుంది. దాని మూలంగా అశాంతి ప్రబలుతుంది. అందుకే వ్యక్తి తన ధర్మాన్ని వదలవద్దని సూచిస్తుంది గీత. రాముడు క్షాత్రధర్మం కోసం తన జీవితాన్నే పణంగా పెట్టి, రామరాజ్యాన్ని సృష్టించగలిగాడు. అలానే ప్రతి మనిషి తన మార్గాన్ని విస్మరించకుండా కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడే లోకానికి, ఈ సంఘానికి హితం చేకూరుతుంది.
రావుల నిరంజనాచారి