‘సత్యం, ధర్మం, అహింసలను పాటిస్తూ ఆనందంగా బతికేవాడే నిజమైన మానవుడు’ అని ప్రజల్లో చైతన్యదీప్తులు వెలిగించిన మహాయోగి ఆయన! కొండకోనల్లో సాధారణ నాగరికతకు దూరంగా గోండు గిరిజనుల జీవితాలలోనూ ఆధ్యాత్మిక గంగా ప్రవాహాన్ని కురిపింప జేసిన మహానుభావుడాయన. పలు గ్రామాలలో 100 శాతం మధుమాంసాలను నిషేధింప జేయడం ద్వారా సామాన్య జనంలో గొప్ప పరివర్తన తెచ్చిన ఆ నిష్కామ కర్మయోగియే ఆత్రం గంగానంద స్వామి!
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం ‘గురుదేవ నగర్’ (బాబెర) ఆశ్రమ వ్యవస్థాపకుడైన ఆత్రం గంగానందస్వామి 1929లో జన్మించారు. 86 ఏండ్ల వయసులో శ్రీ మన్మథ నామ సంవత్సరం శ్రావణ బహుళ నవమి (8-8-2015)న స్వామి శివైక్యమయ్యారు. తొమ్మిది నెలల తపోదీక్ష అనంతరం కాశీ క్షేత్రంలో కొన్నాళ్లు గడిపిన పిమ్మట పూర్తి ఆధ్యాత్మిక జీవితానికే అంకితమయ్యారు. ‘కీర్తికి లొంగనివాడే అసలైన గురువు’ అన్న సిద్ధాంతాన్ని నమ్మిన మౌనిగానూ గంగానందస్వామి సుప్రసిద్ధులయ్యారు. గురువుకు కులమతాల పట్టింపులు ఉండరాదన్నది ఆయన సిద్ధాంతం. జీవన్ముక్తిని పొందటానికి ధ్యానం, యోగమే సరైన మార్గాలనీ, వాటిద్వారానే ఆత్మవికాసం చెందాలని, తద్వారా భగవదాత్మ సాక్షాత్కారం కలుగుతుందని ప్రబోధించారు. ప్రతి ఒక్కరూ సద్గురువును ఆశ్రయించాలని, ఆ గురువులు సామాజిక హితకార్యాలు చేస్తూ, ప్రజలతో చేయించాలని ఆయన అనేవారు.
వందలాది సామూహిక వివాహాలను ఆయన స్వయంగా, నిరాడంబరంగా జరిపించారు.
‘దత్త జయంతి’ (మార్గశిర పున్నమి) నుండి జగన్మాత దీక్షలు, శివరాత్రి నుండి శివదీక్షలు భక్తులచే గంగానందస్వామి చేయించేవారు. ఆయన శివైక్యం చెందిన తర్వాతకూడా భక్తులు దీక్షలు చేస్తున్నారు. ఒకసారి గురూపదేశం తీసుకుని తర్వాత ఎవరూ చూడటం లేదని మధ్యలో నిలిపి వేయడం అపచారమని చెప్పేవారు. గంగానందస్వామి పూజాఫలంగా ‘వాస్తాపూర్, నందిగూడ, మల్యాల, మేడీగూడ..’ వంటి గ్రామాల ప్రజలు మద్యం, మత్తు పదార్థాలు, మాంసాహారాలను దాదాపు వందశాతం నిషేధించారు. వారంతా శాఖాహారంతో సాత్విక జీవనం సాగిస్తూ లోకానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ‘ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని తలస్నానం చేయాలి. తర్వాత యోగా చేయాలని’ చెబుతూ తాను స్వయంగా ఆచరించేవారు. ‘దుఃఖానికి విచారించవద్దని, ఇతర జీవాలపట్ల ప్రేమపూర్వకంగా నడుచుకోవాలని’ స్వామి సూచించేవారు.
గంగానందస్వామి ఆధ్వర్యంలో పలు శివ, హనుమత్ ఆలయాల నిర్మాణాలు, విగ్రహాల ప్రతిష్ఠలు జరిగాయి. ఎప్పుడూ ప్రజలతో మమేకమయ్యే ఆయన గోండీ, మరాఠీలో భజనలు, కీర్తనలు ఆలపిస్తూ వాటిని భక్తులకు చెప్పేవారు. ఊళ్ళలో తిరుగుతూ, ప్రవచనాలు ఇచ్చేవారు. పేద ప్రజలతో కలిసి ఎంతో నిరాడంబరంగా జీవించిన గంగానంద స్వామివారికి నిర్మల్నుండి బెజ్జూరువరకు ఎందరో భక్తులు విశ్వాస పాత్రులయ్యారు.
మాడుగుల
నారాయణమూర్తి ,94411 39106
ఇవీ కూడా చదవండి…
నిత్యం 45వేల మందికే శ్రీవారి దర్శనం