సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ
అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాశుచ॥
-భగవద్గీత (18-66)
‘భగవద్గీత’లోని ఈ శ్లోకానికి ‘చరమ శ్లోకమని’ పేరు. ఈ శ్లోకంలో ‘శరణాగతుడైన జీవుడేమి చేయాలో’ మొదటి చరణం తెల్పితే, రెండవ చరణంలో ‘భగవంతుడేమి చేస్తాడో’ మనకు స్పష్టమవుతుంది. ‘సర్వ ధర్మాల్ని త్యజించి నన్నాశ్రయింపుము. ‘అహం’ అంటే నేను- భగవానుడను, సర్వజ్ఞుడను. సర్వశక్తుడను అయిన నేను- ‘త్వా’- నిన్ను, అకించనుడవై, అనన్య గతికుడవై నన్నే ఉపాయంగా నమ్మివున్న నిన్ను- సమస్త పాపాలనుండి విముక్తుణ్ని చేయగలను’ అని గీతాచార్యుడైన శ్రీకృష్ణుడు అర్జునుని శోకం మాన్పుటకు ఈ ‘చరమ శ్లోకాన్ని’ ఉపదేశించాడు. ఈ ఉపదేశం కేవలం అర్జునునికే కాదు, సమస్త మానవాళికోసం శ్రీకృష్ణ పరమాత్మ అందించిన సందేశం.
‘సర్వధర్మ పరిత్యాగ’మంటే ‘భావ త్యాగమే’. ‘ఈ ఫలం నాది’ అనే భావనను వీడితే అది ఫలత్యాగం. ‘ఇది నాది’ అనే మమకారం వీడితే ‘సంగత్యాగం’. ‘ఇది నేను చేసింది’ అనే భావన వీడితే అది ‘కర్తృత్వ త్యాగం’. మమ-ఏకం= మామేకం- నన్నొక్కణ్నే, ‘శరణం వ్రజ’ అంటే ఆశ్రయింపుము, విశ్వసింపుము, స్వీకరింపుము. ఇదంతా జీవుడు ప్రసన్నుడై చేయాల్సిన మానసికానుష్ఠానమే. దీనివల్ల పాపాలు తమంతట తామే తొలగిపోతాయి. కర్మ కైంకర్యమవుతుంది. జ్ఞానం స్వరూప ప్రకాశమానమవుతుంది. భక్తి ప్రాప్యరుచిని చేరుతుంది. ప్రపత్తి వాస్తవ స్వరూప జ్ఞానంలో అంతర్భాగమవుతుంది. ప్రసన్నుడు భగవత్ ప్రపత్తిని వీడక చేసిన ప్రార్థనచే ముక్తుడవుతాడు. మహానందం పొందుతాడు.
శ్రీమన్నారాయణుడే రక్షకుడనీ, గతియని విశ్వసించి ఆయన చరణాలను ఆశ్రయించడమే ‘శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే’. ఇది ఒక మహత్తర మంత్రం. లక్ష్మీదేవితో కూడి వుంటేనే శ్రీమన్నారాయణుడికి ఉనికి. అందుకే, వ్యవహారంలో మనమంటూంటాం, ‘శ్రీ వుంటేనే శ్రీమన్నారాయణుడు! లేకుంటే, దరిద్ర నారాయణుడేనని!!’ నిరంతరం శ్రీమన్నారాయణుణ్నే ప్రార్థించాలి, అర్చించాలి. ‘శ్రీ’ లేని నారాయణుని కోరుకుంటే శూర్పణఖలమవుతాం. ‘నారాయణుడు’ లేని శ్రీని మాత్రమే కొలిస్తే రావణాసురులమవుతాం. అందుకే, కల్యాణ గుణ పూర్ణుడైన శ్రీమన్నారాయణుని చరణాలే శరణ్యం. భక్తి ప్రపత్తులతో ఆ దివ్య దంపతులకు అంజలి ఘటిస్తూ సేవించడం జీవుల విద్యుక్త ధర్మం. సామాన్యులు భూములు, ధనధాన్యాలు, భోగభాగ్యాదులు కోరుకుంటే, ప్రసన్నులు ఈ వాంఛలకు అన్నిటికీ అతీతమైన ‘ముక్తి మార్గాన్ని’ కోరుకుంటారు. ఆ దివ్య దంపతులకు నమస్కరిస్తూ సేవించటమే ‘శ్రీమతే నారాయణాయనమః’. ఇది మరో మహత్తర మంత్రం.
ఈ రెండు మహత్తర మంత్రాలనే ‘ద్వయ మంత్ర’మని విష్ణుభక్తులు పరమ పవిత్రంగా ఆచరిస్తుంటారు. ‘ద్వయ మంత్రం’తోపాటు సంసార తాపత్రయాన్ని పోగొట్టే మూల మంత్రం ‘ఓం నమో నారాయణాయ’. అదే అష్టాక్షరీ మంత్రం. అష్టాక్షరిలోని ‘ప్రణవం’ అంటే ‘ఓం’కారం- స్వామిత్వాన్ని, ‘నమః’ అనే పదం ‘శరణ్యత్వాన్ని’, ‘నారాయణ’ పదం ప్రాప్యత్వాన్ని ప్రబోధిస్తున్నాయి. చరమశ్లోకాన్ని, ద్వయమంత్రాన్నీ, అష్టాక్షరీ మంత్రాన్ని హృదయగతం చేసుకొని, అనునిత్యం అనుష్ఠించడం వల్ల సాలోక్య, సామీప్య, సారూప్యాది వైభోగాలను అనుభవించి, స్వామివారి విభూతిలో విలీనమవ్వడమే ‘సాయుజ్యం’. ‘త్వమేవ శరణం మమ’ అని త్రికరణ శుద్ధిగా ఆ పరబ్రహ్మకు తన్ను తాను సమర్పించుకొన్నవాడే ముక్తికి యోగ్యుడు! మహానందానికి పాత్రుడు!!
డాక్టర్ కె.వి.రమణ
98480 98990