దసరా పండుగ అయిపోయింది. తెల్లారి ఇగ పట్నంకు బైలెల్లుదామనే మోపున కన్నారంల ఉండే పరంధామన్న బండేసుకొని అచ్చిండు మా ఇంటికి.‘హుజ్రావాద్ పోయొద్దామా తమ్మీ, ఎలచ్చన్ల ముచ్చట జోర్ నడుస్తున్నదట, మోకా ఎటున్నదో తెలుసుకుందాం పా..’ అన్నడు.
మా ఇంటి నుంచి బయల్దేరి చెంజర్ల, గట్టుదుద్దెనపల్లి, మొలంగూర్ మీదుగా వీణవంకల ఇట్ల కాలువెట్టినమో లేదో.. వీణవంకల పచ్చ జంబ్ఖానాలు మెరుస్తున్నయి. ఇసుకవోత్తే రాలనంత జనం గులాబీరంగు కండువాలు కప్పుకొని ఉన్నరు. ‘ఇక్కడ ఎవ్వర్నడిగినా కారుకే గుద్దుతమంటరన్న. రెడ్డిపల్లి దిక్కు వోనియ్యి’ అనంటే బండి ఎడమదిక్కు మల్పిండు.
బండి రెడ్డిపల్లి దాన్క పోనే లేదు. మజ్జల్నే ఇద్దరాలుమొగలు రోడ్డు మీదున్న వడ్లను కాళ్లతోని దున్నుకుంటా ముచ్చట వెట్టుకుంటున్నరు. వాళ్లను సూసి బండాపిండు పరంధామన్న. ‘అవ్వా.. రెడ్డిపల్లి తొవ్వ ఎటువోత’దని ముచ్చట గల్పిండు. ‘ఇది రెడ్డిపల్లే బిడ్డా.. మీరెటుపోవాలె’, అని మల్లడిగింది వడ్లు దున్నే అవ్వ..? ‘అవ్వా.. మేం రెడ్డిపల్లికే పోవాలె గని నాల్కె ఎండిపోతంది గొన్నీళ్లుంటియ్యరాదు’ అని నేనన్నా.. ‘అయ్యో బిడ్డా నీళ్లేమన్న బంగారమా.. ఇప్పుడు నీళ్లక్కొదువుందా..? ఏడజూసినా పుష్కలంగ నీళ్లేనాయే’ అనుకుంటా.. బట్టపేగు సుట్టి, యాపచెట్టు ఒచ్చోరకున్న నీళ్లడబ్బా తీసిందవ్వ. వడ్లు దున్నుతున్న తాతను జూత్తే ఆయన సింగరేణి నౌఖరి చేసిండని ఎవ్వరనుకోరు. ఐదేండ్లాయెనట నౌఖరి దిగిపోయి. ‘ముగ్గురు ఆడివిల్లలకు పెండ్లిళ్లు జేసిన అంటున్నవ్, కొడుకు పట్నంల సాఫ్ట్వేర్ కొలువు. ఏ బరువు లేదు. ఇంత తిని, రాజు లెక్క ఇంటికాడుండక, ఎందుకే నీకీ కట్టం’ అనడిగిన. ‘మాకు బుద్ధి తెల్సినప్పటి నుంచి సూత్తున్న బిడ్డ, ఇన్ని నీళ్లు ఎన్నడూ కనవల్లె. ఎవుసం జేస్కొమ్మని ఎవ్వరన్న పైసలిచ్చిర్రా..? ఎన్కట పెట్టువడికి పైసల్లేక ఈ రెండెకరాల భూమిని పడావుంచిండు మా నాయి న. ఇప్పుడు ఎవుసం జేస్కొమ్మని పెట్టువడి పైసలే బేం కులెయ్యవట్టె, పైసలియ్యంగ నేనింటికాడుంటే ఎట్లా బిడ్డ..? అని గతాన్ని నెమరేసుకున్నడు.
అప్పటికే టైం నాలుగు దాటింది. మళ్లా వీణవంక మీన్నుంచి బండి నర్సింగాపూర్ తొవ్వకు వోతున్నది. టక్క.. టక్క.. సప్పుడొస్తున్నది. ఆ సప్పుడు మోకు దెబ్బ అని రోడ్డు పక్కకున్న తాటిచెట్టు కిందికి వొయ్యేదాన్క తెల్వలే. ‘ఏం పేరే గౌడ్సాబ్’, ‘సార్ నా పేరు సమ్మయ్య’, ‘ఓ రెండు దమ్ములు కల్లంపుతవానే’ మాటందుకున్నడు పరంధామన్న. రెండు దమ్ములేంది సార్, బుద్ధిదీర తాగుర్రి అన్నడు. మా పక్కకు ఓ తాత, మేమిద్దరం తాటిమొద్దు మీద కూసున్నం. ‘తాత ఓటెటేత్తున్నవ్..?’ ఉబ్బాగక తాతనడిగిన. ‘బిడ్డా.. అది గుర్రం కడుపుల గుడ్డసొంటి ముచ్చట’, ఓటెటేత్తరో ఎవరన్న చెప్తరా చెప్పు’ అని నన్నే ఉల్టా అడిగిండు. రెండు.. మూడు.. నాలుగైదు దమ్ముల కల్లు వట్టిండు తాత. మళ్లోపారడిగిన ‘తాత.. ఓటెటేత్తున్నవ్?’.. ‘సార్లు మీరైతే మా ఊరోళ్లు కాదు, కడుపులున్న విషయం దాసుకోకుంటా చెప్తా’ అనుకుంటా షురూ జేసిండు. ‘నాకు ముగ్గురాడివిల్లలు. ఇద్దరాడివిల్లల్ని బయటికిచ్చిన, వాళ్లిద్దరు మంచిగనే ఉన్నరు. చిన్నల్లున్ని ఇల్లిటం దెచ్చుకున్న. మొన్న ‘దళితబంధు’ పత్కం కింద చిన్నల్లుని అకౌంట్ల పది లచ్చలు జమైనయట. నేనిగ నియ్యత్ దప్తనా..?’
‘తమ్మీ.. లేటయితంది మెల్లగా నడుద్దాం పా’ కుడిచెయ్యికున్న గడియారం సూసుకుంటన్నడు పరంధామన్న. ‘సరే అన్న పోదాం పా’ అని సమ్మన్నకు కల్లు పైసలు ముట్టజెప్పి జమ్మికుంట దారివట్టినం. జమ్మికుంట రైల్వే బ్రిడ్జెక్కినం. ఎడమదిక్కు ఇల్లందకుంట అని బోర్డు కనవడ్తున్నది. అక్కడి ‘రామాలయం’ పేరువోయిన గుడి. ఆ రాముని గుడిని బైటికెళ్లే జూసి బండి మళ్లా ఎన్కకు దిప్పినం. రాంగ తొవ్వల వయసు మీదున్న పిల్లగాడు కనిపిస్తే, బండాపినం. పరంధామన్న ‘అన్నా… హుజ్రావాద్కు ఎట్ల వోవాల్నె’ అనడిగిండు. ‘అన్న సక్కగ వొయ్యి ఎడమదిక్కు తిరిగి సీదవోతే హుజ్రావాదే’ అన్నడు. ‘అన్నా.. ఏడజూసినా నాయకులే కనవడ్తున్నరు, నువ్వు ఎవ్వలికేత్తున్నవే ఓటు’ అనడిగిన. ‘అన్న నా పేరు సతీష్, నాకు 30 ఏండ్లుంటయ్. నాకు బుద్ధి తెల్సినప్పటి సంది మాకు ఎమ్మెల్యే ఈటలనే. ఈవ్వారకు ఆయన మొకం దగ్గర్నుంచి చూసింది లేదే. ఏమున్నా చోటామోటా లీడర్లు పోవుడు, పైసలు దెచ్చుకునుడు వాళ్లే తినుడు. ఊరికోసం ఒక్క మంచి పన్జేసిందే లేదు. ఈటల కూడా ఈమానం లేనోళ్లనే నమ్ముతడు.. గాయ్నకెవలేస్తరే ఓటు?
మేం ఒడ్డెరోల్లమన్న. మా ఒడ్డెరిండ్ల కు తొవ్వలేక అరిగోసవడ్తున్నం. అయి నా ఇటుమొకాన గూడ మళ్లి సూడలే ఈటల. మొన్న మా వాడకు మంత్రి హరీశ్రావు సారొచ్చిండు. మాకున్న సమస్యలు మొత్తం జెప్పినం. సార్ సక్కగచ్చి తొవ్వ సమస్యను జూసి అప్పటికప్పుడు మూడు లక్షల రూపాలిచ్చి మా ఒడ్డెరిండ్లకు తొవ్వేపిచ్చిండు. ఇకముందు కూడా ఏ ఆపదొచ్చినా అండగా ఉంటనని హామీ ఇచ్చిండు. నాయకుడంటె ఇట్లుండాలె…
ఇల్లందకుంట సతీష్ చెప్పిన ఇంకో ముచ్చట..: మా దోస్తు ఒకాయన దుబాయిలుంటడు. వాని భార్య పానం బాగలేక సచ్చిపోయింది. దానం చేద్దామంటే కూడా పైసల్లేవు. అంత పేదోళ్లు. నా దోస్తుగాన్నేమో అక్కణ్ణుంచి రానిస్తలేరు. ఈ నాయకులుఎవ్వరూ పట్టిచ్కోలె. నలుగురైదుగురం కల్సి హరీశన్న దగ్గరికి వొయి ఉన్న ముచ్చట జెప్పినం.అప్పటిదప్పుడు యాభై వేల రూపాలిచ్చిండు. ఆ పైసలతోటే ఆమెను దానం జేసినం.
-గడ్డం సతీష్ ,99590 59041