దేశ చరిత్రను చదివినట్లయితే ఋగ్వేదకాలం, క్రీ.పూ.800-600 ఏండ్ల నుంచి జనాభా లెక్కలు తీస్తున్నారు. అదే విధంగా మౌర్యుల కాలంలో కూడా జనాభా లెక్కలు చేసినట్లు కౌటిల్యుడి అర్థశాస్త్రం చెబుతున్నది. ఏ దేశంలో లేని విధంగా మనదేశంలో వర్ణవ్యవస్థ ద్వారా నిచ్చెనమెట్ల కులవ్యవస్థ ఏర్పడి, ఆయా కులాల మధ్య సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అసమానతలు ఏర్పడ్డయి. కులాల మధ్య ఉన్న అసమానతలను రూపుమాపాలంటే, కులాలవారీ జనగణన తప్పనిసరి అని భావించిన నాటి బ్రిటిష్ ప్రభుత్వం 1872 నుండి 1931 వరకు కులాలవారీ జనగణన జరిపింది.
దేశ రాజ్యాంగం 1950, జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. రాజ్యాంగంలో బీసీ కులాలను విస్మరించి, వివిధ అధికరణల ద్వారా ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభా దామాషా పద్ధతిలో విద్య, ఉద్యోగాల్లో, చట్టసభల్లో రాజకీయ రిజర్వేషన్లు కల్పించారు. కాబట్టి 1951 నుంచి తీస్తున్న జనాభా లెక్కల్లో ఎస్సీ, ఎస్టీ కులాలను లెక్కిస్తూ, మిగతా వారిని ఇతరులుగా నమోదు చేస్తున్నారు. రాజ్యాంగాన్ని కులరహిత సమాజ నిర్మాణం కోసం రూపొందించారు. కానీ, నేడు దేశ రాజకీయాలు కులాలను ప్రోత్సహిస్తూ రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధంగా కులాల చుట్టూ పరిభ్రమిస్తున్నాయి.
ఆర్టికల్ 246లో తెలిపినట్లు షెడ్యూల్ 7 జాబితా 1లోని 69 క్లాజ్ ప్రకారం దేశ జనాభా లెక్కలు, పదేండ్లకోసారి లెక్కించడానికి సెన్సెస్ చట్టం, 1948 ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉంది. సామాజిక, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల (ఓబీసీ) జనాభా లెక్కలు లేనందున రిజర్వేషన్లు, కులాలవారీగా సంక్షేమ పథకాలు అమలుచేయడానికి అనేక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమస్యలు ఎదురవుతున్నాయి. ఓబీసీ జనాభా 50 శాతానికి మించి ఉన్నప్పటికీ సామాజిక రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని మండల్ కమిషన్ తీర్పులోని సుప్రీంకోర్టు నిబంధన ప్రకారం కేంద్ర విద్య, ఉద్యోగాల్లో ఓబీసీ రిజర్వేషన్లను 27 శాతానికి పరిమితం చేశారు. అదే తీర్పులో ఓబీసీ కులాల ఆమోదయోగ్యమైన జనాభా లెక్కలున్నట్లయితే యాభై శాతం రిజర్వేషన్లు మించి అమలు చేసుకోవచ్చని సూచించింది. 2010లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ, ఇతర పార్టీలు 2011లో తీయబోయే జనాభా లెక్కల్లో ఓబీసీ కులగణన జరుపాలని ఆందోళన చేశాయి. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్తూ, జనాభా లెక్కలకు సంబంధించిన సామగ్రిని అప్పటికే దేశవ్యాప్తంగా పంపించామని ఓబీసీ కులగణన వీలుకాదని చెప్తూ, ప్రత్యేకంగా సామాజిక, ఆర్థిక కులగణన చేస్తామని తెలిపింది. అందుకనుగుణంగా 2011లో దేశవ్యాప్తంగా సామాజిక, ఆర్థిక కులగణన చేపట్టి నేటికీ ఆ వివరాలను అధికారికంగా ప్రకటించలేదు. నేడు దేశవ్యాప్తంగా పలు ప్రాంతీ య పార్టీలు 2021లో లెక్కించనున్న జనాభా లెక్కల్లో ఓబీసీ కులగణన చేయాలని ముక్తకంఠంతో కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ ద్వంద్వవైఖరి అనుసరిస్తూ, కాలయాపన చేస్తున్నాయి. ఓబీసీ కులగణన ఈసారి కూడా చేయనట్లయితే, మరో పదేండ్లు జనాభా దామాషా పద్ధతిలో లభించవలసిన విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను వారు కోల్పోనున్నారు.
కేంద్రప్రభుత్వం 2011లో లెక్కించిన ఓబీసీ కులాల సామాజిక, ఆర్థిక గణాంకాల వివరాలను అందించాలని ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం కోరింది. కేంద్రం స్పందించకపోవడంతో సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఆ విచారణలో భాగంగా కేంద్రం సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పిస్తూ, ఓబీసీ కులగణన సాధ్యం కాదని తెలిపింది. ఇందులో వాస్తవానికి విరుద్ధంగా సుప్రీంకోర్టును తప్పుదోవపట్టించే విధంగా పలు అంశాలను తెలుపుతూ, దేశంలో 1931 నాటికి 4,147 కులాలున్నట్లు చెప్తూ, నేటికి ఆ కులాల సంఖ్య ఉపకులాల, ఉప తెగల, గోత్రాల పేరున విడిపోయి 46 లక్షలుగా ఉన్నట్లు తెలిపింది. ఓబీసీల కులగణన చేసినట్లయితే దేశంలో కులాల మధ్య అసమానతలు, విద్వేషాలు పెరిగి దేశ సమగ్రతకు విఘాతం కలుగుతుందని సుప్రీంకు తెలిపింది. ఇదే బీజేపీ ప్రభుత్వం 2018లో ఓ ప్రకటన చేస్తూ.. 2021 జనాభా లెక్కల్లో కులగణన జరుపుతామని తెలుపటం గమనార్హం.
1953లో కేంద్రం కాకా కాలేల్కర్ అధ్యక్షతన నియమించిన మొదటి జాతీయ బీసీ కమిషన్ నుంచి నేటివరకు అనేక రాష్ట్ర బీసీ కమిషన్లు, సుప్రీంకోర్టు, హైకోర్టులు బీసీ రిజర్వేషన్ల రక్షణ, పెంపు కోసం బీసీల కులగణన చేయాలని కేంద్ర ప్రభుత్వాలకు సూచించాయి. ఆమోదించదగిన, అధికారిక ఓబీసీ కులాల గణాంకాలు లేనందున బీసీ రిజర్వేషన్లు జనాభా దామాషాలో అమలు కావడం లేదు. ఫలితంగా కేంద్ర ఉద్యోగాల్లో 1993 నుంచి 27 శాతం ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేస్తున్నప్పటికీ, నేటికీ ప్రాతినిధ్యం 21 శాతానికి మించలేదు. కేంద్రీయ విద్యాసంస్థల్లో 2008 నుంచి ఓబీసీ రిజర్వేషన్లు అమలుచేస్తున్నారు. 2008 కంటే ముందు ఓబీసీలు కేంద్రీయ విద్యాసంస్థల్లో లక్షల సంఖ్యలో విద్యా అవకాశాలను కోల్పోయారు. అదేవిధంగా చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు లేనందున లోకసభ, అసెంబ్లీల్లో ప్రాతినిధ్యం 20 శాతానికి మిం చడం లేదు. కుల ప్రాతిపదికన రిజర్వేషన్ల ద్వారా విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయరంగాల్లో సమాన అవకాశాలు లభించి, ఆయా కులాలకు సమాజంలో గౌరవం పెరిగి, కులాంతర వివాహాలకు దారితీసి, కులరహిత సమాజంగా ఏర్పడుతుం ది. ఇప్పటికైనా కేంద్ర బీజేపీ ప్రభు త్వం, గతంలో విధానపరమైన నిర్ణ యం తీసుకున్నట్లు, 2021 జనాభా లెక్కల్లో కులాలవారీగా గణాంకాలను సేకరించి, అధికారికంగా ప్రకటించాలి. లేనట్లయితే బీజేపీ రాజకీ య మూల్యం చెల్లించుకోక తప్పదు.
-కోడెపాక కుమార స్వామి , 94909 59625