ప్రకృతి రమణీయతకు అద్దంపట్టే కొండలు. ఎటుచూసినా పచ్చదనంతో కళకళలాడే మహావృక్షాలు. వీటి మధ్యన కొలువయ్యాడు.. శ్రీరామలింగేశ్వరుడు. తన వద్దకు వచ్చే భక్తుల కోరికలు తీరుస్తూ.. కొంగు బంగారంగా విరాజిల్లుతున్నాడు. సాక్షాత్తు, శ్రీరాముడే ప్రతిష్ఠించిన ఈ స్వామి ఏటా చింతాకు పరిమాణంలో పెరుగుతూ ఉంటాడని నమ్మకం.
రంగారెడ్డి జిల్లా ఫరూఖ్నగర్ మండలం రామేశ్వరం గ్రామంలో పురాతన రామలింగేశ్వరస్వామి ఆలయం ఉంది. ఇక్కడి శివలింగాన్ని త్రేతా యుగంలో శ్రీరాముడు ప్రతిష్ఠించాడని చెబుతారు. మూలమూర్తి ఏటా చింతాకు పరిమాణంలో పెరుగుతుందని నమ్మకం. అందుకే, ఈ ఆలయం కాలక్రమేణా మహిమాన్విత క్షేత్రంగా అవతరించింది. చుట్టు పక్కల ప్రాంతాల్లోని ఎన్నో కుటుంబాలకు స్వామివారే ఇంటిదేవుడు. ఏ ఆపద వచ్చినా ఇక్కడికొచ్చి మొక్కుకొంటారు. కోరికలు తీరగానే వచ్చి, కానుకలు సమర్పించుకొంటారు. బైక్, కారు, ట్రాక్టర్.. ఏ వాహనం కొన్నా ఇక్కడే పూజలు చేస్తారు. నిత్యార్చనతోపాటు పండగ సమయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. పౌర్ణమి, అమావాస్యలకు అభిషేకాలు జరిపిస్తారు. శివరాత్రికి స్వామివారి బ్రహ్మోత్సవాలు (జాతర) ఘనంగా నిర్వహిస్తారు. భజనలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. ఈ సమయంలో రాష్ట్ర నలుమూలల నుంచీ వేలాది భక్తులు తరలివస్తారు.
స్థల పురాణం
రామేశ్వరంలోని పురాతన శివలింగాన్ని సాక్షాత్తు శ్రీరామచంద్రుడే ప్రతిష్ఠించాడని స్థల పురాణం. త్రేతాయుగంలో.. వనవాస సమయంలో.. సీతారాములు సూర్యాస్తమయ సమయానికి ఈ ప్రాంతానికి వచ్చారట. కానీ, నిత్యార్చన కోసం ఎక్కడా శివలింగం లేకపోవడంతో .. అప్పటికప్పుడు రాముడు ఓ లింగాన్ని ప్రతిష్ఠించి, పూజలు చేశాడట. అదే సమయంలో సీతాదేవి సమీపంలోని కొండపైకి వెళ్లి, అమ్మవారిని ప్రార్థించగా.. జగజ్జనని ప్రత్యక్షమై అక్కడే విగ్రహంగా వెలిసిందట. ఇందుకు సాక్ష్యంగా గుట్ట కింద రామలింగేశ్వరస్వామి వెలిశాడు. కొండపైన అమ్మవారు కొలువుదీరారు. కాలక్రమంలో శివలింగం భూగర్భంలో కూరుకుపోయింది. ఓ రైతు పొలం దున్నుతుండగా లింగం బయల్పడింది. గ్రామస్తులు అక్కడే ఆలయాన్ని నిర్మించి పూజలు చేస్తున్నారు.
ప్రగతి వెలుగులు
రామేశ్వరం ఆలయాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నది. పలు పనులు చేపట్టింది. ఆలయంతోపాటు కోనేరునూ ఆధునికీకరించారు. భక్తులు సేద తీరేందుకు వసతి గదులు కట్టించారు. కల్యాణ మండపాన్ని నిర్మించారు. జాతీయ రహదారిని కలిపే రామేశ్వరం ప్రధాన మార్గానికి మరమ్మతులు చేయించారు. దీనివల్ల గ్రామానికి బస్సు సౌకర్యమూ అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్వాసులు ఓ సెలవురోజు వెళ్లిరావడానికి అనువైన క్షేత్రం.
ఇలా చేరుకోవచ్చు
రామేశ్వరం ఆలయం షాద్నగర్ పట్టణానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు హైవే మీదుగా 70 కిలోమీటర్లు ప్రయాణిస్తే రాయికల్ టోల్గేట్ వస్తుంది. అక్కడి నుంచి మరో మూడు కిలోమీటర్లు వెళ్తే, రామేశ్వరం చేరుకోవచ్చు. షాద్నగర్ నుంచి ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది. ప్రైవేట్ వాహనాలు కూడా అందుబాటులో ఉంటాయి.
కొండె కృష్ణ