దేవాలయం అంటే ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు. మన సంప్రదాయాలను కాపాడే వేదిక. విజ్ఞాన సముదాయాలు ఆలయాలు. అందుకే, పూర్వం రాజులు వందలాది ఆలయాలను అద్భుతంగా నిర్మించేవారు. అపురూప శిల్పకళతో మన సాంస్కృతిక వైభవాన్ని తరతరాలు నిలిచిపోయేలా కట్టించారు. ఒకప్పుడు ఆలయాలు నాగరికతను బోధించే ధామాలుగా ఉండేవి. సంఘ నిర్మాణ కేంద్రాలుగా, సిద్ధ వైద్యశాలలుగా, ఆకలి తీర్చే అన్నదాన క్షేత్రాలుగా ఉండేవి. వాటిలోకి అడుగు పెట్టింది మొదలు భక్తిభావం ఉప్పొంగేది. ప్రశాంతత నెలకొనేది. కాలక్రమంలో ఆదరణ కరువై ఎన్నో ఆలయాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. మడులున్నా, మాన్యాలున్నా కొందరు స్వార్థపూరిత వ్యక్తుల కారణంగా ధూపదీప నైవేద్యాలకూ నోచుకోని ఆలయాలు ఎన్నో ఉంటున్నాయి. భక్తుల కానుకలద్వారా ఆదాయం సమకూరుతున్నా పాలకమండళ్లు గుళ్ల అభివృద్ధిని పట్టించుకోవడం లేదు. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే ఆలయ సంరక్షణ బాధ్యతను భక్తులే స్వీకరించాలని పిలుపు నిస్తున్నారు ఈషా ఫౌండేషన్ స్థాపకులు, ఆధ్యాత్మిక వేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్.
నిర్వహణ లేని ఆలయాలు, ఆరాధన లేని దేవతలు, సంరక్షణ లేని పూజారులు, అంతర్ధానమవుతున్న సంప్రదాయాలను పునరుద్ధరించడానికి ప్రతి ఒక్కరూ కదలాలని సద్గురు జగ్గీ వాసుదేవ్ కోరుతున్నారు. తమిళనాట ఆధ్యాత్మిక సమాజం స్పందించాలంటున్నారు. ఈ క్రమంలో మొదలైన #FreeTNTemples క్రమంలో ఉద్యమం జోరందుకున్నది. సామాజిక మాధ్యమాలలో ఆలయాలను సంరక్షించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ ఉద్యమంలో ప్రజలూ భాగస్వాములు కావాలని సద్గురు ఆశిస్తున్నారు. ఈ మేరకు మద్దతు తెలుపాలనుకొనేవారు 83000 83000 నంబర్కి మిస్డ్కాల్ ఇవ్వాలని వారు సూచిస్తున్నారు.
-సద్గురు జగ్గీ వాసుదేవ్.
ఇవీ కూడా చదవండి…