గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం
నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః
శివ స్వరూపాలలో విశేషమైంది ధ్యానమూర్తి దక్షిణామూర్తి రూపం. దక్షిణ ముఖంగా ప్రతిష్ఠితమయ్యే శివరూపం ఇది. నిరంతరం కళ్ళు మూసుకొని, ధ్యానంలో ఉంటూ శిష్యుల సందేహాలను తన మౌనంతోనే పటాపంచలు చేయగలిగిన శివ స్వరూపం ఇది. శివుణ్ణి భూమిగా భావిస్తే, భూమి సూర్యుని చుట్టూ చాలా క్రమశిక్షణతో, సమయ నియమం ప్రకారం తిరుగుతుంటుంది. ఈ కక్ష్యలో ఏ మాత్రం తేడా రాదు. ఇది ఒక ధ్యాని చేయాల్సిన పని. లోకంలో తమ పనులు తమకు ఎన్ని ఉన్నా మనసును మాత్రం తమకు శక్తినిచ్చే వాటి దగ్గరే కేంద్రీకరించాలనడానికి ఇదొక సంకేతం.
దక్షిణ శబ్దానికి ‘కుడివైపు’, ‘సమర్థత’ అనే అర్థాలున్నాయి. సమర్థుని ప్రవర్తనలో అధికమైన వ్యక్తీకరణలు ఉండవు. కేవలం విధి నిర్వహణలు మాత్రమే ఉంటాయి. అందుకే, దక్షిణామూర్తి తత్త్వంలో ఈ ప్రత్యేకతలు కనిపిస్తుంటాయి. ఈ శివమూర్తి ప్రత్యేకతల్లో మౌనమే ప్రధానం. మౌనం పరావాక్కు స్వరూపం. పరావాక్కు మూలశక్తికి సంకేతం. అందుకే, దక్షిణామూర్తి స్వరూపమూ మూలశక్తి విధానాన్ని తెలియజేస్తుంది. ఈ శక్తి దగ్గరగా ఉన్నవారికి ఎలాంటి లోపాలూ వుండవు. అన్ని విషయాల అవగాహన చెప్పకనే తెలుస్తుంది. కనుకే, సమర్థుడైన దక్షిణామూర్తి తత్త్వం అర్థం చేసుకుంటే అధ్యాత్మిక జీవితం సాఫల్యమవుతుంది. భౌతిక దేహాన్ని అధిగమించి మనోదేహంపై నిగ్రహం సాధించి, ఆత్మసాధనకోసం ప్రయత్నించడానికి దక్షిణామూర్తి ఉపాసన తప్పనిసరి. మేధోవికాసం కలుగాలంటే ఈ స్వామి ఉపాసన అనివార్యం. ఆధ్యాత్మిక విద్యలలో పురోగతిని సాధించడానికి ఈ మూర్తితత్త్వాన్ని అర్థం చేసుకోవాలి. ‘ఓం నమో భగవతే దక్షిణామూర్తయే’ మంత్రాన్ని ఉపాసించడం ద్వారా పరావిద్య సాధన, భవరోగాల నుండి ముక్తి, గురువులకు గురువుగా మిగిలే అవకాశాలు అందరికీ లభ్యమవుతాయని శాస్ర్తాలు చెబుతున్నాయి.
-సాగి కమలాకరశర్మ