సర్ ఐజాక్ న్యూటన్మహాశయుడు భూమ్యాకర్షణ సిద్ధాంతాన్ని కనుగొన్నాడు. అందువల్ల శాస్త్ర, సాంకేతిక రంగాలలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఇది సత్యం. న్యూటన్ తన ‘నూత్న సిద్ధాంతాన్ని’ ఆవిష్కరించడం వల్లనే చెట్టునుండి రాలిన పళ్లు భూమ్మీద పడుతున్నాయని భావించడం అవివేకమవుతుంది. న్యూటన్కంటే ముందు కాలంలో జీవించినవాళ్లకు చెట్టునుండి రాలిన పళ్లు నేలమీద పడుతవనే విషయం తెలియదనుకోవడం హాస్యాస్పదం. ప్రాచీన భారతీయులపట్ల మనకు సరిగ్గా ఇటువంటి అభిప్రాయాలే ఉన్నాయి. వారు నెలకొల్పిన సంప్రదాయాలు, చెప్పిన శాస్త్రీయ విషయాలు కారణం తెలియకుండానే గుడ్డిగా చెప్పారని, ఇప్పుడు వాటిలోని శాస్త్రీయతను నూతనంగా ఆవిష్కరిస్తున్నామని మనం భ్రమపడుతుంటాం. నిజానికి ‘ఇలాంటి ఆలోచననే మన పూర్వికులను అవమానించడం’ అన్న స్పృహకూడ మనకుండదు. ఈ నేపథ్యంలో మన ప్రాచీనులు చెప్పిన వివిధాంశాలను ఈనాటి ఆధునిక విజ్ఞానంతో పోల్చి చూసుకొని, ప్రాచీనకాలం నాటి మన విజ్ఞానశాస్త్ర స్థాయిని తెలియజెప్పడమే ఈ శీర్షిక ప్రధానోద్దేశ్యం.
మధ్యయుగంలో పాశ్చాత్య శాస్త్రజ్ఞులు కనుగొనే వరకు సమస్త మానవాళి ‘భూమి బల్లపరుపుగా ఉందని భావించేవారని’ ఒక అపోహ ఉన్నది. ‘భూగోళం’, ‘ఖగోళం’ అన్న పదాలు భారతీయులకు ఏనాటినుండో తెలుసు. భూమిమాత్రమే కాదు, ‘ఖ’ అంటే ఆకాశంలో ఉండేవన్నీ గోళాలే అన్న అవగాహన మనకుండింది. ‘ద్యౌ’ అంటే ఆకాశం. ‘అంతరిక్షం’ అంటే ‘ఆకాశానికి ఆవల ఉండే శూన్యం’ (ఆంగ్లంలో ‘స్పేస్’ అంటారు). నక్షత్ర మండలాలతోపాటుగా ఉండే ఈ సృష్టి యావత్తునూ కలిపి ‘విశ్వం’ అంటాం. దీనినే ‘బ్రహ్మాండం’ అనికూడ పిలుస్తాం. అంతరిక్షంలో ఉండే గోళాలన్నీ అండాలే. అంటే, ఈ గోళాలన్నీ బంతివలె గుండ్రంగా కాకుండా కొంత సాగదీయబడి, అండం అంటే గుడ్డు రూపాన్ని ధరించి ఉన్నవన్నమాట. ‘ఇంత తెలిసి వున్నవాళ్లు సూర్యుడిని, చంద్రుడిని గ్రహాలు అని ఎందుకు పిలుస్తున్నారు?’ అన్నది ప్రశ్న. ‘గ్రహం’ అంటే ‘గ్రహించేది’ లేదా ‘పట్టి వుంచేది’ అని అర్థం. వెలుగును, వేడిమిని పట్టి వుంచేదే గ్రహం. సూర్యచంద్రులు ఈ నిర్వచనంలోకి వస్తారు కనుక వారు గ్రహాలు.
నక్షత్ర గ్రహతారాణం అధిపో విశ్వభావనః
తేజసా మపి తేజస్వీ ద్వాదశాత్మన్ నమోస్తుతే. (శ్లో. 15)
అంటూ సూర్యుడిని కీర్తిస్తున్నది ‘ఆదిత్య హృదయం’. యుద్ధంలో రావణాసురుడిపైన విజయం సాధించడానికిగాను శ్రీరామునికి అగస్త్య మహర్షి బోధించిన సూర్యస్తోత్రం పేరు ‘ఆదిత్య హృదయం’. ‘నక్షత్రాలకన్నా, గ్రహాలకన్నా, తారలకన్నా గొప్పవాడు సూర్యుడు’ అని అర్థం. గ్రహాలకు, నక్షత్రాలకూ ఉండే భేదాన్ని గురించిన అవగాహన మన పూర్వికులకు ఉన్నదని అర్థమవుతున్నది కదా! అంత మాత్రమే కాదు, నక్షత్రాలకు వివిధ స్థాయిలు ఉంటాయనికూడా వారికి తెలుసును. నక్షత్రాలు వేరు, తారలు వేరు. అందుకే, రెండు పేర్ల ప్రయోగం జరిగింది.
‘కోటిసూర్య సమప్రభ’ అన్న వ్యవహారమున్నది. ‘అసంఖ్యాకమైన సూర్యులతో సమానమైన వెలుగు’ అని అర్థం. ‘ఈ బ్రహ్మాండంలో ఉన్న నక్షత్రాలన్నీ సూర్యుళ్లే’ అన్న స్పృహతో చెప్పిన వాక్యమిది. వెలుగు, వేడిమి రెంటి కలగలుపు ప్రభావాన్ని చెప్పడానికి వాడే పదం ‘తేజస్సు’. తేజోవంతమైన వస్తువులన్నింటిలోనూ అత్యధిక తేజస్సును కలిగి వున్నవాడు సూర్యుడు. సంవత్సరంలోని పన్నెండు మాసాలలో పన్నెండు తీర్ల తేజస్సును భూమికి ప్రసాదిస్తున్న సూర్యుడిని పన్నెండు ఆత్మలు కలిగినవానిగా (ద్వాదశాత్మునిగ) కీర్తిస్తున్నది ‘ఆదిత్య హృదయం’. ఈ వాక్యం భూమికి అన్వయించింది.
‘నక్షత్ర గ్రహ తారాణం’ అన్నప్పుడు- ‘విశ్వ భావనః’ అని చెప్పబడింది. ‘విశ్వంలో భావించి చూసినప్పుడు’ అని అర్థం. ‘విశ్వంలో’ అని చెప్పి ఊర్కోకుండా ‘భావనః’ అన్న పదాన్ని జోడించాడు అగస్త్య మహర్షి. సూర్యుడినుండి భూమి అందుకొంటున్న వెలుగు, వేడిమి మనకు తెలిసి వున్న ఈ ఒక్క సూర్యుడినుండే అధికంగా లభిస్తున్నది. అసంఖ్యాకమైన నక్షత్రాల (సూర్యుళ్ల) నుండి మనకు వెలుగు మాత్రమే లభిస్తున్నది. వేడిమి లభించడం లేదు. ఇంతటి స్పష్టత మన పూర్వికులకు ఉన్నదని గ్రహించగలిగితేనే శాస్త్రవిజ్ఞాన విషయాలకు సంబంధించిన ఆత్మన్యూనతా భావాన్నుండి మనం బయటపడ గలుగుతాం.