హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం
కలౌ నాస్త్యేవ నాస్త్యేవ నాస్త్యేవ గతిరన్యధా॥
–బృహన్నారదీయ పురాణం
‘కపటం, కలహాలతో కూడిన ఈ కలియుగంలో హరినామ సంకీర్తనమే ఏకైక ముక్తిమార్గం. దానికి మించిన వేరొక మార్గం లేదు. వేరొక మార్గం లేదు, వేరొక మార్గం లేదు’. శ్రీచైతన్య మహా ప్రభువులవారు ‘హరినామ’ సంకీర్తనను ప్రస్తుత కలియుగంలోని ‘ప్రధాన ముక్తిమార్గం’గా ప్రబోధించిన గొప్ప భాగవతోత్తములు. వారి గురువు తనకు ఈ శ్లోకాన్ని బోధిస్తూ, ‘ఇది నిత్యం తన కంఠంలో స్వరించబడుతూ వుండాలని’ తనకు సూచించినట్టు వారు తరచూ చెబుతుండేవారు.
తన గురువుగారి ఆదేశానుసారం శ్రీచైతన్య మహా ప్రభువులవారు యుగధర్మమైన ఈ ‘హరే కృష్ణ’ నామ సంకీర్తనాన్ని దేశమంతటా వ్యాపింపజేశారు. జీవితంలో ఆధ్యాత్మిక పురోగతిని సాధించేందుకు శ్రీహరి నామ సంకీర్తనం తప్ప మరో మార్గమేదీ లేదని పై శ్లోకం స్పష్టం చేస్తున్నది. శ్రీచైతన్య మహా ప్రభువులవారు బోధించిన ‘శిక్షాష్టకం’లోను ‘హరినామాన్ని జపించేందుకు కుల, మత, వర్ణ, జాతి విబేధాలేవీ అడ్డు రావని, ప్రతి ఒక్కరూ ఈ పవిత్రమైన నామ సంకీర్తనలో పాలు పంచుకోగలరని’ సమస్త మానవాళికీ వారు పిలుపు నిచ్చారు. కలియుగం పలు దోషాలతో కూడినదైనా ఒక గొప్ప గుణాన్ని మాత్రం కలిగి ఉన్నట్టు ‘శ్రీమద్భాగవతమూ’ స్పష్టం చేసింది.
కలేర్దోషనిధే రాజన్నస్తి హ్యేకో మహాన్గుణః
కీర్తనాదేవ కృష్ణస్య ముక్తసఙ్గః పరం వ్రజేత్
–శ్రీమద్భాగవతం: (12.3.51)
‘రాజా! కలియుగం దోషసాగరమే అయినా దీనిలో ఇంకా ఉన్న ఒక మహాగుణమేమిటంటే, కేవలం హరే కృష్ణ మహా మంత్రాన్ని కీర్తించుట చేతనే మనుజుడు భవబంధ విముక్తుడై పరంధామాన్ని చేరగలగడం’.
హరినామ సంకీర్తనమనే ధర్మాన్ని తన యుగధర్మంగా కలిగివున్న కారణం చేత కలియుగం సైతం పై విధంగా కొనియాడబడింది. అత్యంత సరళమైన ఈ మార్గాన్ని ఆచరించిన ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక పురోగతిని సాధించి భగవద్ధామాన్ని చేరగలుగుతారు. శ్రీమధ్వాచార్యులు సైతం ‘ముండకోపనిషత్తు’ను వ్యాఖ్యానిస్తూ.. ఈ యుగధర్మాన్ని, మంత్ర మహిమను గురించి ‘నారాయణ సంహిత’లో ప్రస్తావించారు.
ద్వాపరీయైర్జనైర్విష్ణుః పాంచరాత్రైస్తు కేవలైః
కలౌ తు నామమాత్రేన పూజ్యతే భగవాన్ హరిః
‘ద్వాపరయుగంలో పాంచరాత్ర ఆగమశాస్త్ర నిర్దేశిత విస్తృత ఆరాధన పద్దతులచేగాని ప్రసన్నుడవ్వని శ్రీకృష్ణుడు (విష్ణువు), కలియుగంలో మాత్రం కేవలం నామ సంకీర్తన మాత్రంతోనే అత్యంత ప్రసన్నుడవుతాడు’.
భగవన్నామాలు అసంఖ్యాకం. కృష్ణ, గోవింద, నరసింహ, శ్రీనివాస, రామ, వరాహ మొదలైన భగవన్నామాలన్నీ పరిపూర్ణమైనవేగాక సర్వశక్తివంతమైనవి కూడా. వినసొంపైన ఈ భగవన్నామాలలోనే భగవంతుడు తన శక్తులన్నీ సమకూర్చి మరీ వుంచాడు. పవిత్రమైన ఈ భగవన్నామాలను జపించినపుడు మనస్సూ పవిత్రమై హృదయంలోని ఆరాటం, అశాంతి మొదలైన వ్యాకులతల నుండి ఉపశమనం లభిస్తుంది. ఆ విధంగా జపించడాన్ని కొనసాగించినపుడు ఆధ్యాత్మిక జ్ఞానం పెంపొంది, భగవంతునితో తమకు గల సంబంధాన్ని పునరుద్ధరించుకొని శాశ్వతమైన సచ్చిదానంద స్థితికి భక్తులు చేరగలరు.
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే॥
భగవంతుని నామాలు అసంఖ్యాకమైనప్పటికీ, శ్రీచైతన్య మహా ప్రభువులవారు ప్రత్యేకించి కలియుగ వాసులకు ఉపదేశించిన మహామంత్రం ఇదే. దీనిని ఎవ్వరైనా సరే, నిత్యం 108 సార్లు జపించి భగవంతునిపట్ల ప్రేమను పెంపొందించుకొనవచ్చు.
–శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస ప్రభూజి
93969 56984