అమృతోపనిషత్తులు- స్కందోపనిషత్తు
ఓం అచ్యుతోస్మి మహాదేవ, తవ కారుణ్య లేశతః
విజ్ఞాన యన ఏవాస్మి శివోస్మి కిమతః పరమ్ ॥
‘మహాదేవా! నీ స్వల్పమైన కృపాకటాక్ష వీక్షణాలతోనే నేను శాశ్వతుడనై వున్నాను. అనంత జ్ఞాన సంపన్నుడనై వున్నాను. శుభకరుడనై వున్నాను. ఇంతకంటే కావలసిందేముంటుంది!’-
కృష్ణయజుర్వేదాంతర్భాగమై వున్న ‘స్కందోపనిషత్తు’ వేదాంతసారాన్ని ఒక్క ముక్కలో ఎంతో గొప్పగా ప్రబోధిస్తున్నది. ‘ఆత్మ’ కానివన్నీ స్వప్నం వలె నశించి పోతాయి. జడ చేతనాలను సమంగా చూసేవాడే అచ్యుతుడు. జ్ఞానమే స్వరూపంగా గలవాడు ఆయన! అతడే మహాదేవుడు, అతడే హరి. జ్యోతులలోకెల్లా జ్యోతియైనవాడే ఆ భోలా శంకరుడు. అతడు పరబ్రహ్మయై వున్నాడు. నేనుకూడా బ్రహ్మమై వున్నాను. జీవుడే శివుడు, శివుడే జీవుడు. వడ్లే బియ్యం, బియ్యమే వడ్లు. ఊకచే కప్పబడినప్పుడు వడ్లు, ఊక తీసి వేశాక బియ్యమవుతున్నాయి. కర్మచేత కట్టుబడిన జీవుడు, కర్మం తొలగినప్పుడు శుభప్రదుడవుతున్నాడు. శివుడే విష్ణువు, విష్ణువే శివుడు. శివకేశవులలో ఈషన్మాత్రమైనా వ్యత్యాసం లేదు.
అంతేకాదు, దేహమే దేవాలయం. వ్యర్థపు ఆలోచనలు చేయకుండా భగవంతునిపట్ల స్థిరచిత్తులై ఉండటమే ధ్యానం. మనస్సును నిర్మలంగా ఉంచుకోవడమే స్నానం. ఇంద్రియ నిగ్రహమే శౌచం. ఆకాశంలో నక్షత్రాలు వంటివాటిని చూసినంత స్పష్టాతిస్పష్టంగా జ్ఞానులు సదా విష్ణువు ‘పరమపదాన్ని’ దర్శిస్తూనే ఉంటారు.
-యం.వి.నరసింహారెడ్డి , 98491 10922